breaking news
Test centers
-
భూసారం తెలిసేదెలా..!
ఏఎంసీల్లో మూతపడ్డ పరీక్ష కేంద్రాలు జిల్లాలో వ్యవసాయంపై ప్రతికూల ప్రభావం నర్సీపట్నం, న్యూస్లైన్ : జిల్లారైతులకు భూసార ఫలితాలు తెలుసుకోవడం ఒక పరీక్షే. జిల్లాలో భూ విస్తీర్ణానికి అనుగుణంగా పరీక్ష కేంద్రాలు లేకపోవడం, ఉన్నవాటిలో సైతం అంతంతమాత్రపు సిబ్బందితో నిర్వహించడం ప్రధాన కారణం. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం నిర్వహించే భూసార పరీక్షలతో ప్రయోజనం అంతంతమాత్రంగానే ఉంటోంది. భూమిలో ఉండే పోషకాలను బట్టి రైతులు పంటమార్పిడి, ఎరువులను వినియోగిస్తే ఫలితం ఉంటుంది. దీని వల్ల తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. రైతులను ఈ దిశగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రతి ఏటా ఖరీఫ్ ప్రారంభంలో భూసారపరీక్షలు నిర్వహించడం ఆనవాయితీ. రెవెన్యూ గ్రామానికి 10 చొప్పున గ్రామీణ జిల్లాలో 8,100 మట్టి నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఈ పరీక్ష ఫలితాలను వీలైనంత తొందర్లో రైతులకు అందించేందుకు వ్యవసాయశాఖ చేస్తున్న ప్రయత్నాలు కేంద్రాలు, సిబ్బంది కొరత విఘాతం కలిగిస్తున్నాయి. భూసారంపై అవగాహన లేకపోవడంతో రైతులు అవసరానికి మించి ఎరువులు వినియోగించడం వల్ల పెట్టుబడులు పెరగడంతో పాటు దిగుబడులు తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో కొన్నిచోట్ల రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుండగా మరికొన్ని చోట్ల వ్యవసాయం అంటేనే విరక్తి చెందుతున్నారు. దీంతో ప్రభుత్వం భూసార పరీక్షలకు అత్యంత ప్రాధాన్యమిచ్చి వాటిని నిర్వహించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేసింది. అరకొర కేంద్రాలు అయితే ప్రభుత్వం క్షేత్రస్థాయిలో వాటికి అనుకూలమైన పరిస్థితులను కల్పించడంలో విఫలమౌతోంది. ఒక భూమిలో సేకరించిన నమూనాకు నైట్రోజన్, సల్ఫర్, జింక్, కాపర్ వంటి మొత్తం 16 రకాాల ఫలితాలు సేకరించవలసి ఉంటుంది. గతంలో ఈ పరీక్షలను నర్సీపట్నం, పాడేరు మార్కెట్ కమిటీలతో పాటు అనకాపల్లి భూసార పరీక్ష కేంద్రం, విశాఖ మొబైల్ యూనిట్లలో చేసేవారు. ప్రస్తుతం పాడేరు, నర్సీపట్నంలలో నిర్వహించే పరీక్ష కేంద్రాలకు మార్కెట్ కమిటీలు నిధులు మంజూరు చేయకపోవడంతో వాటిని తాత్కాలికంగా మూసివేశారు. మిగిలిన వాటిలో విశాఖ మొబైల్ యూనిట్ మూడు జిల్లాల పరిధిలో నమూనాలకు పరీక్షలు నిర్వహించవలసి ఉంది. ప్రధానంగా అనకాపల్లి భూసార పరీక్ష కేంద్రంలోనే జిల్లా నమూనాలకు పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఇక్కడ సిబ్బంది తక్కువగా ఉండడం వల్ల రోజుకు 50 నమూనాలకు ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం విద్యుత్కోతలు విధించడం వల్ల ఈ పరీక్షల నిర్వహణకు గండి పడుతోంది. ఈ పరిస్థితుల్లో ఖరీఫ్ ప్రారంభానికల్లా నమూనాల ఫలితాలు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. -
సర్వం సిద్ధం
సాక్షి, నల్లగొండ: పంచాయతీ సెక్రటరీ పరీక్షలకు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్ -1, మధ్యాహ్నం 2 నుంచి 4.30 గంటల వరకు పేపర్ -2 పరీక్ష నిర్వహిస్తారు. జిల్లా వ్యాప్తంగా ఎనిమిది పట్టణాల్లో 200 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష జరగనుంది. మొత్తం 59,793 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. పతి కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. మొత్తం 3,204 మంది అధికారులు, ఉద్యోగులు పరీక్షల విధులు నిర్వహిస్తారు. నల్లగొండలో 95, భువనగిరిలో17, సూర్యాపేటలో 27, మిర్యాలగూడలో 34, దేవరకొండ, కోదాడ, హుజూర్నగర్లో 8 చొప్పున, చౌటుప్పల్లో 3 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 52మంది ఫ్లైయింగ్ స్క్వాడ్స్, 52 మంది లైజన్ అధికారులు, 200 మంది సహాయ లైజన్ అధికారులు, 200 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 2700 మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వహిస్తారు. ప్రశ్నపత్రాలు తెరిచింది మొదలు పరీక్ష ముగిసిన తర్వాత ఓఎమ్మార్ షీట్లు సీల్ చేసేంత వరకూ వీడియోలో చిత్రీకరిస్తారు. 10 నిమిషాలు ఆలస్యమైనా ఒక్క నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులు పరీక్ష రాసే అవకాశాన్ని గతంలో కోల్పోయేవారు. పరీక్ష కేంద్రాలు దూర ప్రాంతాలలో కేటాయించడం, సకాలంలో బస్సులు రాకపోవడం తదితర కారణాలతో అభ్యర్థులు సకాలంలో పరీక్షకు హాజరుకాలేకపోతున్నారు. నెలల తరబడి పడిన కష్టమంతా వృథాకావడమే కాకుండా ఉద్యోగాన్ని చేజార్చుకుంటున్నారు. దీన్ని గుర్తించిన ప్రభుత్వం పంచాయతీ సెక్రటరీ పరీక్షకు సమయం విషయంలో కొంచెం మినహాయించింది. పరీక్ష ప్రారంభమైన 10నిమిషాల్లోపు హాల్లోకి అభ్యర్థులను అనుమతిస్తారు. పరిశీలన ముఖ్యం చిన్నచిన్న పొరపాట్ల వల్ల అభ్యర్థులు ఉద్యోగాలు చేజార్చుకుంటున్నారు. ఓఎమ్మార్ షీట్లు అసంపూర్తిగా పూరిస్తున్నారు. తద్వారా పరీక్ష ఎంతబాగా రాసినా ఉపయోగం లేదు. ఓఎమ్మార్ షీట్లో అడిగినట్లుగా అభ్యర్థి వివరాలు, పేపర్ కోడ్, హాల్టికెట్ నంబర్ వంటి వివరాలు సంపూర్ణంగా నమోదు చేయాలి. వీఆర్ఓ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా లక్ష మంది అభ్యర్థులు ఓఎమ్మార్ షీట్ సరిగా నింపలేదని అధికారులు వెల్లడించారు. దీంతో వీరంతా మార్కులు పొందినా ఉద్యోగాలు రానట్లే. కాబట్టి అభ్యర్థులు ఎటువంటి ఒత్తిడికి గురికాకుండా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఓఎమ్మార్లో వివరాలు పేర్కొనాలి. అంతేగాక కొందరు అభ్యర్థులు ఒరిజినల్ ఓఎమ్మార్ షీట్ ఇన్విజిలేటర్కు ఇవ్వకుండా తమ వెంట తీసుకెళ్తున్నారు. ఇలా చేయడం నేరమే కాకుండా భవిష్యత్ తిరిగి పరీక్షకు హాజరయ్యే అవకాశాలు కోల్పోతారు. స్క్రైబ్స్ (సహాయకులుగా) చేతులులేని, దృష్టిలోపం, మస్తిష్క పక్షవాతం ఉన్న అభ్యర్థులు కూడా పరీక్షకు హాజరవుతున్నారు. వీరికి సహాయకులు(స్క్రైబ్)గా పదోతరగతి చదువుతున్న విద్యార్థులను ఏర్పాటు చేస్తారు. ఈ బాధ్యత పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెడెంట్కు అప్పజెప్పారు. దృష్టిలోపం ఉన్న అభ్యర్థులకు గంటకు 10 నిమిషాల అదనపు సమయాన్ని ఉపయోగించుకునే వెసులుబాటు ఉంది. రెండు పేపర్లకూ అదనపు సమయాన్ని వినియోగించుకోవచ్చు.