breaking news
tailor problems
-
దర్జా కోల్పోతున్న దర్జీలు
జైనూర్ : ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఏకరూప దుస్తులు కుడుతున్న దర్జీలు చాలీచాలని కూలితో కష్టాలు పడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఉట్నూర్ ఊటీడీఏ పరిధిలోని జైనూర్, సిర్పూర్(యు), కెరమెరి మండలాల్లో 15 ఆశ్రమ పాటశాలలకు జైనూర్లోని స్త్రీ శక్తి భవనంలో సుమారు 50 మంది దర్జీలు ఏకరూప దుస్తులు కుడుతూ జీవనం సాగిస్తున్నారు. ఒక్కో డ్రెస్కు రూ.40 మాత్రమే.. ఏకరూప దుస్తులకు ప్రభుత్వం ఒక డ్రెస్కు రూ.40 మాత్రమే చెల్లిస్తోంది. ఇవి ఎటూ చాలడం లేదని దర్జీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ బిల్లులు కూడా వస్తాయో రావోనని ఆందోళన చెందుతున్నారు. ఒక్కోసారి సంవత్సరం గడిచినా బిల్లులు రాని సందర్భాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేరే పని రాకపోవడం వల్ల తప్పని పరిస్థితుల్లో ఈ పని చేయాల్సి వస్తోందని వారు పేర్కొంటున్నారు. మొత్తం 20 వేల దుస్తులు.. ప్రతీ సంవత్సరం సుమారు 5000 మంది పిల్లలకు ఒక్కొక్కరికీ 4 చొప్పున మొత్తం 20 వేల దుస్తులు తయారు చేస్తామని వారు తెలుపుతున్నారు. ఆ పని కూడా కేవలం ఐదు నెలలు మాత్రమే దొరుకుతుందని చెబుతున్నారు. మిగతా సమయంలో కాలీగా ఉంటున్నామని కనీసం ప్రభుత్వం ఒక్కో డ్రెస్సుకు రూ.200 చెల్లిస్తే కుటుంబ పోషన భారం కాకుండా ఉంటుందని వారు కోరుతున్నారు. బట్ట సరఫరాలో జాప్యం ప్రతీ ఏడాది జూన్ రెండో వారంలో పాఠశాలలు ప్రారంభమవుతాయి. పాఠశాలలు ప్రారంభం నుంచే పిల్లలకు ఏకరూప దుస్తులు పంపిణీ చేద్దామనే ఆలోచన ఏ అధికారికి రావడం లేదు. జూన్లో దుస్తులు పంపిణీ చేయాల్సి ఉన్నా నవంబర్, డిసెంబర్ నెలల్లో దుస్తులు కుట్టడానికి బట్టను సరఫరా చేస్తున్నారు. వీటిని కుట్టడానికి మళ్లీ మూడు నుంచి నాలుగు నెలల సమయం పడుతుంది. దుస్తులు అందేలోపు పాఠశాలలకు సెలవులు వస్తాయి. దీంతో పిల్లలు పాఠశాలల నిర్వహన ఉన్న అన్ని రోజులు సొంత దుస్తులే ధరిస్తున్నారు. అధికారులు స్పందించి వేసవిలోనే దర్జీలకు బట్టలు కుట్టడానికి బట్ట సరఫరా చేస్తే పిల్లలకు జూన్లోనే దుస్తులు పంపిణీ చేసే అవకాశం ఉంటుంది. దీంతో పిల్లలు కూడా ఏకరూప దుస్తులో కనిపిస్తారు. వేసవిలో పని తక్కువ మాకు వేసవి కాలంలో పని చాలా తక్కువగా ఉంటుంది. ఎండా కాలంలో అయితే ఎక్కువ పని చేయడానికి ఆస్కారం ఉంటుంది. – యమునాబాయి మా కష్టాన్ని చూడాలి మేము చేసే పనిని చుసి ప్రభుత్వం కనీసం ఒక్కో డ్రెస్సులకు రూ.200 చెల్లించాలి. అప్పుడే మా కుటుంబ పోషన సజావుగా సాగుతుంది. – భీమన్న బట్ట సరఫరా చేయాలి పిల్లలకు జూన్లోనే ఏకరూప దుస్తులు పంపిణీ చేయాలి. అలా చేయాలంటే ప్రభుత్వం మార్చి గాని ఏప్రిల్లో గాని బట్ట సరఫరా చేయాలి. – శంకర్ -
శ్రీవారికి కొప్పెర కష్టాలు
► కొప్పెరకు కొత్త వస్త్రాల్లేవ్! సాక్షి, తిరుమల: భక్తుల కొండంత కోరికలను నెరవేర్చే కోనేటిరాయుడికి కొప్పెర కష్టం వచ్చింది. భక్తులు కానుకలు సమర్పించుకునేందుకు కొప్పెర వస్త్రాలు కుట్టే దర్జీ కరువైపోయాడు. ఉద్యోగ విరమణ చేసిన దర్జీ స్థానంలో కొత్తవారిని నియమించకపోవడంతో కొప్పెర వస్త్రాలు కుట్టే పని అర్ధంతరంగా నిలిచిపోయింది. అపర కుబేరుడికి దర్జీ కరువే కొప్పెర ద్వారా భక్తుల నుంచి కానుకలు అందుకునే తిరుమలేశుడికే దర్జీ కరువైపోవడం సంబంధిత అధికారుల పనితీరుకు దర్పణం పడుతోంది. తిరుమల ఆలయ కొప్పెర(హుండీ) కోసం వాడే కేస్మెట్ వస్త్రాన్ని కుట్టేందుకు గతంలో ప్రత్యేకంగా అనుభవం గడించిన దర్జీ ఉండేవారు. ఐదారేళ్ల క్రితం ఆయన ఉద్యోగ విరమణ చేశారు. ఆయన స్థానంలో కొంతకాలంగా టీటీడీ ఆరోగ్య శాఖలోని ఓ మల్టిపుల్ వర్కర్(అవసరాన్ని బట్టి ఏ విభాగానికైనా వినియోగించుకునే టీటీడీ ఉద్యోగి) చేత ఈ దర్జీ పనిచేయించారు. రోజువారీ విధుల్లో భాగంగా ఆ దర్జీ తిరుమల ఆలయానికి అవసరమైన కొప్పెర వస్త్రాలను కుట్టి ఇచ్చేవారు. ఆయన కూడా రెండు నెలల క్రితం ఉద్యోగ విరమణ చేశారు. కానీ, ఆయన స్థానంలో కొత్తవారిని నియమించలేదు. దీంతో కొప్పెరతయారు చేసేందుకు మార్కెటింగ్ విభాగం కొనుగోలు చేసిన వస్త్రాలు సంబంధిత కార్యాలయంలో కుప్పలుతెప్పలుగా పేరుకుపోయాయి. దర్జీలేని కారణంగా ఆలయంలో కొప్పెరకు కొత్త వస్త్రాల కొరత ఏర్పడింది. ఆలయ నిబంధనల ప్రకారం ఒకసారి గంగాళం లేదా పాత్రకు కట్టిన వస్త్రాన్ని మరోసారి వాడకూడదు. దర్జీ లేకపోవడంతో ఒకసారి ఉపయోగించిన వస్త్రాలనే మళ్లీ ఉపయోగిస్తున్నట్లు సమాచారం. అయితే, ఈ విషయాన్ని ఆలయ అధికారులు ధ్రువీకరించడం లేదు. తమ వద్ద స్టాకు ఉందని, అవసరమైతే తెప్పించుకుంటామని చెబుతున్నారు. కొప్పెర కొలతలేమిటి? హుండీ ఎత్తు తొమ్మిది అడుగులు, వెడల్పు మూడు అడుగులు. మూడు అడుగుల ఎత్తు కలిగిన రాగి గంగాళాన్ని నేల నుంచి తొమ్మిది అడుగుల ఎత్తులో సిద్ధం చేసిన దళసరి కేస్మెట్ వస్త్రంలో ఉంచి హుండీ రూపొందిస్తారు. భక్తులు చేయి ఎత్తి కానుకలు వేస్తే అవి సరిగ్గా రాగి గంగాళంలో పడే విధంగా నాలుగు వైపులా ఆంగ్ల అక్షరం ‘వి’ ఆకారంలో రంధ్రాలు వేస్తారు. హుండీ మధ్యలో చుట్టిన తాడుపై ఏడు టీటీడీ సీళ్లు, మరో ఆరు జీయంగార్ సీళ్లు వేస్తారు. మూడు అడుగుల ఎత్తు కలిగిన రాగి గంగాళంతోపాటు మరో రెండు అడుగుల వరకు కానుకలు నిండాక, ఆ హుండీ పైకప్పు తాళ్లను విప్పి సీలు వేసి పరకామణికి తరలిస్తారు. తర్వాత అదే స్థానంలో కొత్త హుండీని ఏర్పాటు చేస్తారు. కరెన్సీ నోట్లు, బంగారం, వెండి, విలువైన రాళ్లు హుండీ ద్వారా నగదు కానుకల్లో చిల్లర నాణేల నుంచి అన్ని రకాల కరెన్సీ నోట్ల రూపంలో ఏడాదికి సుమారు రూ.వెయ్యి కోట్లు, 1,000 నుంచి 1,500 కిలోల బంగారం, 2,000 కిలోల వెండి, వజ్రాలు, కెంపులు, పచ్చలు, గోమేధికాలు, ఇతర విలువైన రంగురాళ్లు అందుతున్నాయి. పదవీ విరమణ చేసిన దర్జీతో కుట్టిస్తాం ‘‘హుండీ వస్త్రాలు కుట్టే దర్జీ ఉద్యోగ విరమణ చేశారు. ఆయన స్థానంలో ఔట్సోర్సింగ్ కింద ఒకరిని తీసుకునేందుకు ఉన్నతాధికారులు అనుమతి ఇచ్చారు. హుండీ వస్త్రాలను కుట్టి కొరత లేకుండా సరఫరా చేసేందుకు అవసరమైతే ఉద్యోగ విరమణ చేసిన దర్జీనే కాంట్రాక్ట్ విధానం కింద కొనసాగిస్తాం’’ అని అధికారులు చెప్పారు. కొప్పెర (హుండీ) అంటే? భక్తులు కానుకలు వేసే పాత్ర లేదా రాగి గంగాళాన్ని కొప్పెర(హుండీ) అంటారు. చెన్నైలోని ఆర్కియాలజీ విభాగం నుంచి సేకరించిన ఆధారాల ప్రకారం క్రీ.శ.17 శతాబ్దం ముందు నుంచే తిరుమల ఆలయంలో ఈ కొప్పెర ఉన్నట్లు తేల్చారు. టీటీడీ వద్ద అప్పటి నుంచి హుండీ లెక్కలున్నాయి. అయితే, ఈస్టిండియా కంపెనీ పాలన కాలంలో 1821 జూలై 25న కొప్పెర (హుండీ)ని ఏర్పాటు చేశారని ఆలయ పరిపాలనా విధానాలను నిర్దేశించే చట్టం బ్రూస్కోడ్-12 ఆధారం కూడా ఉంది. అప్పట్లో ఆలయ పోషణకు హుండీ తప్ప మరొక ప్రధాన ఆదాయ మార్గం ఉండేది కాదు. కొప్పెరను తిరుమల ఆలయంలోని తిరుమామణి మండపం (ఘంటా మండపం)కు ఉత్తర పార్శ్వంలో నాలుగు రాతి స్తంభాల నడుమ ఏర్పాటు చేశారు. ఇక్కడ జగద్గురు ఆది శంకరాచార్యులవారు ‘శ్రీచక్రం’ ప్రతిష్టించారని.. అందువల్లే అంతులేని ధన, కనక, వస్తు, ద్రవ్య కానుకలతో స్వామివారి హుండీ నిండుతోందని భక్తుల విశ్వాసం. ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా హుండీ స్థలం ఎత్తు పెంచేందుకు అక్కడి నేలను తవ్వినప్పుడు కొందరు శ్రీచక్రాన్ని ప్రత్యక్షంగా దర్శించారని టీటీడీ రికార్డుల్లో పొందుపరిచారు. దీన్ని ఆలయ జీయంగార్లు, అర్చకులు, అధికారులు, చరిత్రకారులు కూడా విశ్వసిస్తున్నారు. అందువల్లే ఆలయంలో ఎన్ని మార్పులు చేర్పులు చేసినా హుండీ స్థలాన్ని మాత్రం అంగుళం కూడా మార్చలేదు.