breaking news
Rajivsagar
-
దుమ్ముగూడేనికి కొత్త టెండర్లే!
రూ.7,967 కోట్ల తుది అంచనాతో ఆర్థిక శాఖకు ఫైలు సాక్షి, హైదరాబాద్: సమీకృత ఇందిరాసాగర్, రాజీవ్సాగర్ దుమ్ముగూడెం ప్రాజెక్టులను పాత కాంట్రాక్టర్లకు అప్పగించకుండా కొత్తగా టెండర్లు పిలవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఏడేళ్ల కింద నిర్ణయించిన స్టాండర్డ్ షెడ్యూల్డ్ రేట్లు(ఎస్ఎస్ఆర్)ల ప్రకారం మారిన డిజైన్లకు అనుగుణంగా పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు అనాసక్తి చూపుతున్న నేపథ్యంలోనే ప్రభుత్వం కొత్త టెండర్ల వైపు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. ఇందిరాసాగర్, రాజీవ్సాగర్ల కింద ఇప్పటివరకూ చేసిన పనులను అనుసంధానం చేస్తూ ఖమ్మం జిల్లా సాగునీటి వ్యవస్థను మెరుగుపరిచేలా దుమ్ముగూడెం తుది ప్రణాళిక ఖరారైన విషయం తెలిసిందే. దుమ్ముగూడెం ఆనకట్ట నుంచి 5 వేల క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యంతో గ్రావిటీ ద్వారా 46.30 కిలోమీటర్ల దూరం గల కోయగుట్ట పంపు హౌజ్ వరకు నీటిని తరలించి అక్కడినుంచి జగన్నాథపురంలో కట్టే బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వరకు నీటిని తరలిస్తారు. అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా బయ్యారం చెరువు(రిజర్వాయర్) దాకా నీటిని తరలిస్తారు. ఈ రెండు రిజర్వాయర్ల ద్వారా ఖమ్మం జిల్లాతో పాటు వరంగల్ జిల్లా మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాలకు నీరు అందుతుంది. ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి నది నుంచి 50 టీఎంసీల నీటిని తరలిస్తారు. పాల్వంచ మండలం కోయగుట్ట, ముల్కంపల్లి మండలం కమలాపురం, తోగ్గూడెం, టేకులపల్లి మండలం రోళ్లపాడు గ్రామాల్లో నాలుగు పంపు హౌజ్లు, ఆరు లిఫ్టులు ఏర్పాటు చేసేలా ప్రణాళిక సిద్ధం చేయగా, మొత్తం నిర్మాణానికి రూ.7,967 కోట్లతో తుది అంచనా వేశారు. ఈ అంచనాను ఆమోదానికి ఆర్థిక శాఖకు పంపారు. ఇదే సమయంలో పనులను ఎవరికి అప్పగించాలన్న అంశమై ఉన్నతస్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. మొత్తంగా బ్యారేజీలు, పంప్హౌజ్లు, ఇతర నిర్మాణాల కోసం 2007-08లో నిర్ణయించిన స్టాండర్ట్ షెడ్యూల్డ్ రేట్లు(ఎస్ఎస్ఆర్)తో పోలిస్తే ప్రస్తుత రేట్లు 30 నుంచి 40 శాతం పెరిగే అవకాశం ఉంది. గతంలో ఈపీసీ విధానంతో పాత కాంట్రాక్టులకు అప్పగించగా, ప్రస్తుతం ఆ విధానం లేదు. దీంతో పాటే డిజైన్లో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా టెండర్లు పిలవడం సుముచితమనే అభిప్రాయం నీటి పారుదల శాఖ వర్గాల్లో వ్యక్తమవుతోంది. -
ఆయకట్టు 7.50 లక్షలు
- రాజీవ్-ఇందిరాసాగర్ పరిధిలో పెరగనున్న సాగు భూమి - సీఎం ఆదేశాలతో నీటిపారుదల శాఖ కసరత్తు - ఈనెలలో తుదిరూపం తీసుకురావాలని నిర్ణయం - కేసీఆర్ విదేశాల నుంచి రాగానే మళ్లీ సమీక్ష సాక్షిప్రతినిధి, ఖమ్మం: రాజీవ్సాగర్ (దుమ్ముగూడెం), ఇందిరాసాగర్ ప్రాజెక్టులను ఒక్కటిగా చేసి ఆయకట్టును మరింతగా పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇటీవల ఈ రెండు ప్రాజెక్టులను కలిపి 4 లక్షల ఎకరాలు సాగులోకి తేవాలని ప్రాథమికంగా నిర్ణరుుంచింది. దీన్ని కాస్త పెంచి 7.50 లక్షల ఎకరాలు చేయాలని ఇటీవల ముఖ్యమంత్రి చేసిన సమీక్షలో చర్చకు వచ్చింది. జిల్లాను సస్యశ్యామలం చేయాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఆ శాఖ అధికారులు సర్వే పనిలో నిమగ్నమయ్యారు. జిల్లాలో జలయజ్ఞంలో రాజీవ్సాగర్తో 2 లక్షల ఎకరాలు, ఇందిరాసాగర్తో 1.32 లక్షల ఎకరాలకు డిజైన్ చేశారు. ప్రస్తుతం ఇందిరాసాగర్ హెడ్వర్క్ పనులు ఆంధ్రప్రదేశ్లో కలిసిన వేలేరుపాడు మండలం రుద్రంకోటలో చేయూల్సి ఉంది. ప్రాజెక్టు పనుల కొనసాగింపుపై అక్కడి ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసినా స్పందన లేదు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ముగిసిన ఇందిరసాగర్ పనులకు రాజీవ్సాగర్ పనులను అనుసంధానం చేసి ఒకే ప్రాజెక్టుతో సాగు నీళ్లు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది. దీనిపై ఇప్పటికే పలుమార్లు కసరత్తు చేసింది. రెండు ప్రాజెక్టులకు రూ.1700 కోట్లు ఖర్చు చేశారు. దుమ్ముగూడెం ప్రాజెక్టు ఎత్తిపోతల ప్రధాన కేంద్రం అశ్వాపురం మండలం పాములపల్లిలో ఉంది. ఇక్కడ నుంచి తొలుత కుమ్మరిగూడెం, గొల్లగూడెం, కరకవాగు, రోళ్లపాడు, లలితాపురం, సింగభూపాలెం, మద్దుకూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లుగా డిజైన్చేశారు. రెండు ప్రాజెక్టులను కలిపితే పాలేరు, ఇల్లెందు నియోజకవర్గాలకు కూడా పూర్తి స్థాయిలో నీరు అందించాలని ప్రభుత్వం సంకల్పించింది. నాగార్జునసాగర్ నీరు జిల్లాలోని ఆయకట్టు అందకపోతే ప్రత్యామ్నాయంగా గోదావరి నీటిని రాజీవ్-ఇందిరాసాగర్తో అందించాలని ప్రభుత్వం నూతన డిజైన్ పనిలో నిమగ్నమైంది. ప్రాథమికంగా ఈ రెండు ప్రాజెక్టుల అనుసంధానంతో సుమారు 4 లక్షల ఎకరాలు సాగులోకి తేవాలని నిర్ణయించారు. అయితే భారీ వ్యయంతో ఒకే ప్రాజెక్టుతో జిల్లాలోని అన్ని మండలాలకు సాగు నీరు అందేలా ఇంకా ఎన్ని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు అవసరమవుతాయో నివేదిక తయారి చేసే పనిలో యంత్రాంగం నిమగ్నమైంది. సీఎం సమీక్షలో 7.50 లక్షల ఎకరాలు.. ఈనెల 2,3 తేదీలో ముఖ్యమంత్రితో కేసీఆర్.. రాజీవ్, ఇందిరాసాగర్ ప్రాజెక్టు పనులను పర్యవేక్షిస్తున్న ఉన్నతాధికారులతో సమీక్షించారు. ప్రాజెక్టు వ్యయం పెరిగే అవకాశం ఉన్నా సీఎం సమీక్షలో సుమారు 7.50 ఎకరాల వరకు సాగు నీటిని ఇచ్చేలా డిజైన్ చేయాలని చర్చకు వచ్చినట్లు సమాచారం. ఎంత మేరకు సాగు ఆయకట్టు పెరుగుతుందో దాని డిజైన్ పూర్తిగా తయారు చేయాలని సీఎం ఇచ్చిన ఆదేశాలతో ఆశాఖల అధికారులు పరుగులు పెడుతున్నారు. గత నెలవరకు 4 లక్షల ఎకరాలకు చేసిన డిజైన్, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు తదితర విషయాలన్నీ సంబంధిత అధికారులు సీఎంకు వివరించారు. ఆయకట్టు పెంచే విషయమై నూతన డిజైన్ చేయాలన్న ఆదేశాలతో అధికారులు క్షేత్ర స్థాయిలో సర్వే ప్రారంభించారు. సీఎం విదేశాల నుంచి రాగానే పూర్తి స్థాయి నివేదిక అందించేందుకు ఈ ప్రాజెక్టు పర్యవేక్షణ అధికారులు సమాయత్తమవుతున్నారు. ఆయకట్టుకు జీవం పోసేనా..? కృష్ణా, గోదావరి రెండు నదులకు మహారాష్ట్రలోని పశ్చిమ కనుమలు జన్మస్థానం. జీవనదులుగా ఇవి పేరొందాయి. ఇక్కడి నుంచి రెండు నదులు ప్రవహిస్తున్నా తెలంగాణలోకి వచ్చేసరికి రెండు నదుల పరీవాహక ప్రాంతంలో విభిన్నత కనిపిస్తుంది. కృష్ణా నదిలో నీరు లేకపోతే నాగార్జునసాగర్ నిండక నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు సాగు నీరు అందదు. కరువు పరిస్థితులుంటే కృష్ణా పరీవాహక ప్రాంతాలు సాగు, తాగు నీటి కోసం తహతహ లాడుతాయి. గోదావరి పరీవాహక ప్రాంతంలో ఖరీఫ్ సీజన్లో ఈ ఇబ్బంది ఉండడం లేదు. జిల్లా విషయానికి వస్తే..ఛత్తీస్గఢ్ రాష్ట్రం గోదావరికి సమీపాన ఉంది. దండకారణ్యంలో భారీ వర్షాలతో ఈ నది ఉధృతంగా ప్రవహిస్తుంది. రాజీవ్సాగర్ ద్వారా ఈ నీటిని మళ్లించే సాగు నీటి అందించాలని జలయజ్ఞంలో డిజైన్ చేశారు. ప్రస్తుతం సాగర్లో నీరులేక ఎన్నెస్సీ ఆయకట్టు బీడుభూమిగా మారింది. భవిష్యత్లో ఇదే పరిస్థితులు ఉంటే సాగర్ ఆయకట్టుకు గోదావరి నది జీవం పోయనుంది. నూతన డిజైన్తో సాగర్ ఆయకట్టుకు నీరందించాలంటే భారీ వ్యయం కానుంది. ప్రభుత్వం ప్రచారం ఆర్భాటం చేస్తుందా..? లేక గతంలో కిరణ్కుమార్రెడ్డి ప్రభుత్వం మాదిరిగా ప్రాజెక్టులను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తుందా? అనేది చూడాలి.