రజకుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి
కంకిపాడు: రజకులపై జరుగుతున్న దాడులు, సాంఘిక బహిష్కరణలను నిరోధించేందుకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్టు మాదిరిగా ప్రత్యేక రక్షణ చట్టం చేయాలని ఏపీ రజక వృత్తిదారుల సంఘం కృష్ణాజిల్లా అధ్యక్షుడు చిక్కవరపు వెంకట రెడ్డియ్య డిమాండ్ చేశారు. శనివారం కంకిపాడు రజక రామాలయం సెంటరులో మీడియాతో మాట్లాడుతూ బీసీలకు ప్రభుత్వం రూ. 8836 కోట్లు కేటాయించినట్లు గొప్పలు చెప్పుకుంటున్నా ఒక్క బీసీ కి కూడా ఆ కోటా నుంచి రుణం మంజూరు చేయలేదని విమర్శించారు. ప్రకటనలతో సరిపెట్టారే తప్ప ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోవటం లేదని ఆరోపించారు. రజక ఫెడరేషన్కు రూ. 200 కోట్లు కేటాయించి 15 మంది సభ్యులతో ఉన్న ప్రతి గ్రూపునకూ రుణం మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో రజక బాలలు, విద్యార్థులకు రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. 50 సంవత్సరాలు పైబడిన వృత్తిదారులకు నెలకు రూ. 2500 పింఛను ఇవ్వాలని డిమాండ్ చేశారు. రజకులకు కేటాయించిన చెరువులు రజకులకే చెందాలని విజ్ఞప్తిచేశారు.
15, 16 తేదీల్లో జిల్లా మహాసభలు
ఏపీ రజక వృత్తిదారుల సంఘం కృష్ణాజిల్లా మూడో మహాసభలు ఈనెల 15, 16 తేదీల్లో కంకిపాడులో నిర్వహించనున్నట్లు వెంకట రెడ్డియ్య తెలిపారు. మహాసభల పోస్టరును ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు బాపట్ల సుబ్బారావు, రొయ్యూరు రాధాకృష్ణమూర్తి, కంకిపాటి వీరరాఘవయ్య, కోడూరు పరశురామయ్య, చాగంటిపాటి నాంచారయ్య, దోసకాయలపాటి నాగేశ్వరరావు, కూడేటి సాయి పాల్గొన్నారు.