breaking news
professor kancha ilaiah
-
రైతు ప్రయోజనాలకు ఆమడదూరంలో...
భారతీయ ప్రాచీన సాహిత్యంలో రైతుకు, వ్యవసాయ రంగానికి ఎలాంటి ప్రాధాన్యతా లేదన్నది వాస్తవం. కౌటిల్యుడు, మనువు ఈ దేశంలోని వ్యవసాయదారులను మనుషులుగా కూడా వ్యవహరించడానికి వీలులేని శూద్రులుగా తోసిపుచ్చారు. ప్రస్తుత నూతన వ్యవసాయ చట్టాలు కూడా ఆర్ఎస్ఎస్, బీజేపీ వ్యవసాయ వ్యతిరేక తాత్వికతనే ప్రతిబింబిస్తున్నాయి. మహాత్మా జ్యోతిరావు ఫూలే సేద్యానికి, రైతుకు ప్రాధాన్యతను ఇచ్చిన తొలి శూద్ర చింతనాపరుడు. కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాల ఉపసంహరణతోనే రైతుల ఆందోళన నిలిచిపోయినట్లయితే ఎలాంటి మార్పూ సంభవించదు. రైతుల పిల్లలు మంచి ఇంగ్లిష్ విద్యను పొందుతూనే హరప్పా నాగరికత కాలం నాటి వ్యవసాయ ప్రాధాన్యత నుంచి మన ప్రాచీన భారత నాగరికతను తిరిగి అక్కున చేర్చుకోవలసి ఉంది. తమ ఆత్మగౌరవాన్ని, తరతరాలుగా చేస్తూవస్తున్న వృత్తి భవిష్యత్తును కాపాడుకోవడానికి భారీ స్థాయిలో రైతులు ఆందోళన జరుపుతున్న నేపథ్యంలో పాలక ఆరెస్సెస్ భావజాలం.. దాని వాణిజ్య అనుకూల సిద్ధాంతాలకు భిన్నంగా వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడానికి లేశమాత్రంగా అయినా అవకాశం ఉందా? 1925 నుంచి ఆర్ఎస్ఎస్ సాంస్కృతిక హిందుత్వ జాతీయవాద విధాన పత్రాల కేసి చూసినట్లయితే, వ్యవసాయ అభివృద్ధి విధానాన్ని శాస్త్రీయంగా రూపొందించిన దాఖలాను అవి ఏమాత్రం చూపించవు. ఒక సంస్థగా ఆర్ఎస్ఎస్.. సారాంశంలో వ్యవసాయ వ్యతిరేకతను పుణికిపుచ్చుకున్న మనుధర్మం, కౌటిల్యుడి అర్థశాస్త్ర భావజాలానికి సంబంధించిన బలమైన సైద్ధాంతిక మూలాలను కలిగివుంది. ఆధునిక కాలంలో సావర్కర్, గోల్వాల్కర్ తమ రచనల ద్వారా కౌటిల్యుడు, మనువు పరంపరను కొనసాగించారు. ఇస్లాం వ్యతిరేతను నిలువెల్ల పుణికిపుచ్చుకున్న భావజాలంతో హిందుత్వ ప్రాపంచిక విధానం వ్యవసాయ వ్యతిరేకతను నిగూఢంగా పొందుపర్చుకుంది. జాతీయవాదం పేరిట తమ భావజాలాన్ని నిర్మించుకున్నప్పటికీ వ్యవసాయ ఉత్పత్తిని ముందుకు తీసుకుపోవడం వారి చర్చల క్రమంలో ఎన్నడూ భాగం కాలేదు. అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని అఖిల భారత జమాత్–ఇ–ముస్లిమిన్ లేక జమాత్ ఇస్లామ్ హింద్ నేతృత్వంలోని వెల్పేర్ పార్టీ ఆఫ్ ఇండియా వంటి ముస్లిం సంస్థలు, రాజకీయ పార్టీలకు కూడా ఇది వర్తిస్తుంది. ఏ మత సంస్థకైనా లేక మత రాజకీయ పార్టీకైనా.. వ్యవసాయ ఉత్పత్తి, రైతుల ప్రయోజనంపై దృష్టి సారించిన చరిత్ర లేదు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్/బీజేపీలే భారతదేశాన్ని ఏలుతూ, రైతు వ్యతిరేక చట్టాలను రూపొందిస్తున్న తరుణంలో వీరి చరిత్రను మరింత జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. పాంచజన్య, ఆర్గనైజర్ వంటి ఆరెసెస్ సిద్ధాంత పత్రికలను కానీ, వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వంటి వాటి పరిశోధనా సంస్థల కార్యకలాపాలను కానీ గమనించిన ఎవరికైనా సరే భారతీయ వ్యవసాయంపై వీరు ఎన్నడూ దృష్టి సారించినట్లు కనబడదు. వీరు ఎల్ల ప్పుడూ ద్వేషిస్తూ ఉండే చైనాతో (అది కమ్యూనిస్టు దేశమైనా కాకున్నా సరే..) పోటీ పడేలా వ్యవసాయంలో సానుకూల సంస్కరణ, అభివృద్ధి తీసుకురావటం పట్ల వీరు ఎన్నడూ దృష్టి పెట్టలేదు. కౌటిల్యుడు, మరింత అధికంగా మనువు ఈదేశంలోని వ్యవసాయదారులను మనుషులుగా కూడా వ్యవహరించడానికి వీలులేని శూద్రులుగా తోసిపుచ్చారు. ఆర్ఎస్ఎస్ కానీ, దాని రాజకీయ విభాగమైన బీజేపీ కానీ ఆ భావజాలంతో ఎన్నడూ తెగతెంపులు చేసుకోలేదు. ప్రస్తుత నూతన వ్యవసాయ చట్టాలు కూడా వారి వ్యవసాయ వ్యతిరేక తాత్వికతనే ప్రతిబింబిస్తూండటం గమనార్హం. ప్రధాని నరేంద్రమోదీ కానీ, అమిత్ షా కానీ తమ నిఘంటువులోనే లేని ప్రగతిశీల వ్యవసాయ తాత్వితతను ఎలా ముందుకు తీసుకొస్తారు? చిన్నదైనా, పెద్దదైనా వాణిజ్య అనుకూల విధానమే వారి పరంపరగా ఉంటోంది. ఢిల్లీలో అధికారం స్వీకరించిన కొన్నేళ్లలోనే ఆ పరంపర మార్పుచెందుతుందా? ఆర్ఎస్ఎస్/బీజేపీల నియంత్రణలో ఉన్న ఒక్కటంటే ఒక్క సంస్థ కూడా ఆహార ఉత్పత్తిదారుల వ్యతిరేక తాత్వికతను కలిగి ఉన్న మనుధర్మ నుంచి కాస్తయినా పక్కకు తొలగడానికి సంసిద్ధత చూపడం లేదు. ఆనాడు ప్రధాన ఆహార ఉత్పత్తిదారులుగా ఉన్న శూద్రుల గురించి మనువు ఏం చెప్పాడో చూడండి. వ్యవసాయంలో వారి కృషిని ఎన్నడూ మనువు ఒక శ్రమగా గుర్తించలేదు. 1. 123. బ్రాహ్మణులకు సేవ చేయటం ఒక్కటే శూద్రుడి అద్భుతమైన వృత్తిగా ప్రకటించడమైనది. దీనికి వెలుపల శూద్రులు ఎలాంటి పని చేసినా అది ఫలితాలను ఇవ్వకపోవచ్చు. 2. 129. శూద్రుడికి శక్తి ఉన్నప్పటికీ అతడు సంపదను సృష్టించకూడదు. శూద్రుడు సంపదను కలిగి ఉండటం బ్రాహ్మణుడిని నొప్పిస్తుంది. హిందుత్వ శక్తులు ఎన్నడూ అద్యయనం చేసి ఉండని చైనాలో, క్రీస్తు పూర్వం 770, 221 మధ్య కాలంలో వ్యవసాయప్రాధాన్యతా వాదం (అగ్రికల్చరిజం) అనే ప్రాపంచిక తత్వం ఉనికిలో ఉండేది. ఈ తాత్వికతకు ప్రాతినిధ్యం వహించిన ప్రధాన తత్వవేత్త జు జింగ్ (372–289 బీసీఈ). ప్రజల ప్రవృత్తి, ఇచ్ఛ అనేవి ఏ ఇతర వృత్తికంటే వ్యవసాయంమీదే ఆధారపడి ఉంటాయన్నది ఇతని ప్రధాన సిద్ధాంతం. క్రీస్తు పూర్వం మూడు, నాలుగు శతాబ్దాల నాటికి చైనా సమాజం పశుపాలన నుంచి బయటపడి ఈ అగ్రికల్చరిజం దన్నుతో వ్యవసాయ ఉత్పత్తివైపు అడుగేసింది. జూ జింగ్ తాత్విక రంగంలో వ్యవసాయదారుడిని ’పవిత్రమైన రైతు’గా భావించేవారు. మత గురువుల కంటే పవిత్ర రైతుకే అత్యధిక విలువ ఇచ్చేవారు. వ్యవసాయ వ్యతిరేక తత్వశాస్త్రమైన బ్రాహ్మనిజం కారణంగానే భారతదేశంలో రైతులకు ఏనాడు అలాంటి ప్రాధాన్యత లభించలేదు. వ్యవసాయం అంటే ఏమిటో కూడా తెలీని బ్రాహ్మణ రుషికి వ్యవసాయ సమాజంలో అత్యంత ప్రాధాన్యత ఇచ్చేవారు. వీరికి ఎన్నడూ తాత్విక, గౌరవనీయ పవిత్ర స్థానాన్ని దక్కనీకుండా చేశారు. శూద్రులు తమవైన వ్యవసాయ ఆధ్యాత్మిక విధులను నిర్వర్తించేవారు కానీ వీరి దేవతలకు బ్రాహ్మణ సాహిత్యంలో ఎలాంటి విలువా చూపేవారు కాదు. బ్రాహ్మణిజం శూద్రులను బానిసలుగా వ్యవస్థీకరించి వారిని ఉద్దేశపూర్వకంగా విద్యకు దూరం చేయడంతో వీరి తాత్విక అభివృద్ధి కూడా నిలిచిపోయింది. బ్రాహ్మణులు రూపొం దించిన వేదాలు, ఉపనిషత్తులు, రామాయణం, మహాభారతం, కౌటిల్యుడి అర్థశాస్త్రం, మను ధర్మశాస్త్రం వంటివాటిలో వ్యవసాయానికి కించిత్ చోటు లేదు. కానీ భారతదేశంలోని ప్రతి రచయితా వీటినే భారతీయ నాగరికత, సంస్కృతికి ఆకరాలుగా భావిస్తూ వచ్చేవారు. కానీ ఈ పుస్తకాల్లో ఏ ఒక్కటీ వ్యవసాయ ప్రాధాన్యత గురించి చాటిన పాపాన పోలేదు. ఆర్ఎస్ఎస్/బీజేపీ భావజాలమైన భారతీయ సాంస్కృతిక వారసత్వం వ్యవసాయం నుంచి తీసుకున్నది కాదు. అసలు వ్యవసాయాన్ని సంస్కృతిలో భాగంగానే వీరు గుర్తించలేదు. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 1వ శతాబ్ది వరకు మన దేశంలోనూ వ్యవసాయం కాస్త అభివృద్ధి చెంది వ్యవసాయ ఉత్పత్తి ఒకమేరకు ప్రారంభమైన కాలంలోనే వ్యవసాయ ఉత్పత్తిని కించపరుస్తూ కౌటిల్యుడు అర్ధశాస్త్రం, మనువు ధర్మశాస్త్రం రాశారు. కులాన్ని ఆచరించే రుషులను, సన్యాసులను భారతీయ సంస్కృతి వారసత్వానికి సంబంధించి తిరుగులేని నమూనాగా బ్రాహ్మణవాదం ప్రోత్సహిస్తూ వచ్చింది. కానీ వీరికి ఉత్పత్తిలో, వ్యవసాయంలో ఏ పాత్రా లేదని గమనించాలి. శూద్ర రైతులను తమదైన ప్రత్యామ్నాయ చింతనను ఏర్పర్చుకోవడానికి కూడా అనుమతించలేదు. 19వ శతాబ్ది మధ్య కాలంలో పుట్టిన మహాత్మా జ్యోతిరావు పూలే వ్యవసాయానికి, రైతుకు ప్రాధాన్యతను ఇచ్చిన మొట్టమొదటి శూద్ర చింతనాపరుడు. శూద్రులకు తాత్విక స్థాయి లేకుండా చేశారని, వారిని బానిసల స్థాయికి కుదించి వేశారని పూలే గుర్తించారు. బానిసగానే ఉన్నంత కాలం ఏ శూద్రుడు కూడా తన సొంత తాత్విక దృక్పథాన్ని నిర్మించుకోలేడు. కాబట్టే పూలే శూద్ర రైతుకు కేంద్ర స్థానమిచ్చి ‘గులాంగిరి’ (బానిసత్వం) పుస్తకం రచించారు. అయితే ఫూలేకి నిరంతరం రచనలు చేస్తూ, తాత్విక దృక్పథాన్ని నిర్మించగల చారిత్రక వారసత్వం లేనందున గతకాలపు చైనా ప్రాపంచిక దృక్పథం వంటి పూర్తి స్థాయి వ్యవసాయ ప్రాధాన్యతా వాదాన్ని ఆయన పెంపొందించలేకపోయారు. వ్యవస్థీకృతంగా రాయకుండా, ఎలాంటి ప్రాపంచిక దృక్పథం కూడా అభివృద్ధి చెందదు. ఆర్ఎస్ఎస్/బీజేపీ శక్తులు పూలే వ్యవసాయ తాత్వికతను పురోగమన స్థాయికి అనుమతించకుండా వేదవాడనే కొనసాగిస్తూ వచ్చాయి. కాబట్టి వేదకాలానికి ముందటి వ్యవసాయ ప్రాధాన్యతా వాదాన్ని తిరిగి కనిపెట్టడం ద్వారా మన నిజమైన ప్రాచీన మూలాలపై చర్చను తప్పక కొనసాగించాలి. కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాల ఉపసంహరణతోనే రైతుల ఆందోళన నిలిచిపోయినట్లయితే ఎలాంటి మార్పూ సంభవించదు. ప్రభుత్వ పాఠశాలల్లో రైతుల పిల్లలు మంచి ఇంగ్లిష్ విద్యను పొందుతూనే హరప్పా నాగరికత కాలం నాటి వ్యవసాయ ప్రాధాన్యత నుంచి మన ప్రాచీన భారత నాగరికతను తిరిగి అక్కున చేర్చుకోవలిసి ఉంది. అలాగే మన పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు భారతీయ వ్యవసాయ ప్రాధాన్యతను ఆధిక్యతలో ఉంచుతూ పునర్నిర్మాణం చెందటం అవసరం. వ్యవసాయ రంగంలో ఉన్నతమైన అభివృద్ధి, మెరుగైన మార్కెట్ దిశగా అలాంటి మార్పును ఆర్ఎస్ఎస్/బీజేపీ శక్తులు వ్యతిరేకించినట్లయితే, యూనివర్శిటీల్లోని రైతాంగ యువత నాయకత్వంలో నిజమైన అజాదీ కోసం సమరం ప్రారంభమవడం ఖాయం. వ్యాసకర్త ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ ఇంగ్లిష్ తెలుగు భాషల్లో ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
దేశంలోనే ఐలయ్య ప్రమాదకరమైన వ్యక్తి
హైదరాబాద్: సామాజిక స్మగ్లర్లు ‘కోమటోళ్లు’ పుస్తక రచయిత కంచ ఐలయ్య దేశంలోనే అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి అని ఆయనను ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో చేర్పించాలని నిజామాబాద్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా డిమాండ్ చేశారు. ఐలయ్య పుస్తకానికి కౌంటర్గా వైశ్య ఐక్య కార్యాచరణ సమితి (ఐకాస) వేదిక కన్వీనర్, తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కాచం సత్యనారాయణగుప్తా ‘సామాజిక సేవకులు వైశ్యులు’ అనే పేరుతో రాసిన పుస్తకాన్ని ఐజేయూ సెక్రటరీ దేవులపల్లి అమర్ శనివారం ఆవిష్కరించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే గణేశ్గుప్తా మాట్లాడుతూ..ఐలయ్య ప్రధాని మోదీ గురించి కూడా తప్పుగా మాట్లాడిన వ్యక్తి అని..అతనిపై రాజద్రోహం కేసు పెట్టి దేశం నుంచి బహిష్కరించాలన్నారు. ఆర్యవైశ్యులు మాంసం తింటారంటూ పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్న ఐలయ్య సరైన చికిత్స తీసుకుని బయట ప్రపంచంలోకి రావాలన్నారు. ఐలయ్య అనే పెద్ద పిచ్చోడు బయట తిరుగుతుంటే ఎర్రగడ్డ పిచ్చాసుపత్రి వాళ్లు ఎందుకు చేర్చుకోవడం లేదో అర్థం కావడం లేదని..ఐలయ్యను త్వరగా ఆస్పత్రిలో చేర్పించుకోవాలని ఆ ఆస్పత్రి సూపరింటెండెంట్ను కోరుతున్నామన్నారు. ఆర్యవైశ్యులపై ఐలయ్య చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ అన్ని పార్టీలు స్పందించినప్పటికీ కాంగ్రెస్ మాత్రం ఇంత వరకు నోరు మెదపలేదన్నారు. ఐలయ్య బేషరతుగా క్షమాపణలు చెప్పకుంటే మా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. నిందించే హక్కు లేదు.. ఐజేయూ సెక్రటరీ దేవులపల్లి అమర్ మాట్లాడుతూ..ఐలయ్య గతంలో కూడా చాలా పుస్తకాలు రాసి ఎన్నో కులాల్ని దూషించారన్నారు. ఇప్పుడు కూడా అదే ధోరణిలో ఉన్నట్లు స్పష్టమవుతుందన్నారు. ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయని.. ఒకర్ని నిందించే హక్కు ఇంకొకరికి లేదన్నారు. ఎదుటి వ్యక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తించడం చాలా ప్రమాదకర మన్నారు. ఆయన రాసిన ఈ పుస్తకాన్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. పుస్తక రచయిత కాచం సత్యనారాయణగుప్తా మాట్లాడుతూ.. ఐలయ్య రాసిన పుస్తకంలో ఉన్న ప్రతి అక్షరానికి జవాబుగా తాను కూడా ఈ పుస్తకాన్ని రాశానన్నారు. ఉపాధ్యాయ ముసుగులో ఉన్న ఉన్మాది ఐలయ్య అంటూ మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్గుప్తా, తెలంగాణ హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ బొల్లం సంపత్, వైశ్య ఐకాస వేదిక గౌరవ సలహాదారు సోమ భరత్కుమార్, ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ తదితరులు ప్రసంగించారు. ఐలయ్యను అడ్డుకున్న ఆర్యవైశ్యులు పోలీసులకు ఫిర్యాదు.. దళితులు, ఆర్యవైశ్యుల పోటాపోటీ నినాదాలు పరకాల: వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో ప్రొఫెసర్ కంచ ఐలయ్యను శనివారం ఆర్యవైశ్యులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. భూపాలపల్లిలో టీ–మాస్ కార్యక్రమం లో పాల్గొని హన్మకొండకు వెళ్తున్న క్రమంలో పరకాల అంబేడ్కర్ సెంటర్ వద్ద ఐలయ్యను ఆర్యవైశ్యులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఆయన పోలీస్స్టేషన్కు వెళ్లి ప్రాణభయం ఉందని ఫిర్యాదు చేశారు. ఠాణా వద్దకు వచ్చిన ఆర్యవైశ్యులు ఐలయ్య క్షమాపణ చెప్పాలని నినాదాలు చేశారు. దళితులు సైతం పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో ఐలయ్యను పోలీసులు ఎస్కార్ట్ మధ్య అక్కడి నుంచి పంపించారు. ఈ క్రమంలో దళితులు, ఆర్యవైశ్యులు పోటాపోటీగా నినాదాలు చేస్తూ ఊరేగింపుగా వెళ్లారు. పోలీసులు వారికి నచ్చజెప్పి పంపించారు. డ్రైవర్ అప్రమత్తం కావడంతో బతికిపోయా.. డ్రైవర్ అప్రమత్తమై కారును వేగంగా నడపడంతో బతికిపోయానని ప్రొఫెసర్ కంచ ఐలయ్య అన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. పరకాలలో ఆర్యవైశ్యులు దూసుకొచ్చి కారుపై బలంగా బాదుతూ బయటకు లాగి కొట్టే ప్రయత్నం చేశారన్నారు. అవి చీరలు కావు.. మసిబొంతకు వాడుకునేవి భూపాలపల్లి: ప్రభుత్వం చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ ఓ సామాజిక స్మగ్లింగేనని.. అవి చీరలు కావు.. మసిబొంతకు వాడుకునేవని భూపాలపల్లిలో ఐలయ్య అన్నారు. రూ.25 విలువ చేసే బతుకమ్మ చీరకు.. రూ.200 అని చెప్పి సీఎం కేసీఆర్ కుమారుడు కేటీఆర్, కుమార్తె కవిత రూ.100 కోట్లు దండుకున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో గద్దర్, తమ్మినేని వీరభద్రం, ప్రొఫెసర్ విశ్వేశ్వర్రావు పాల్గొన్నారు. ఐలయ్యపై సుప్రీంకోర్టులో పిటిషన్ ప్రపంచ ఆర్యవైశ్యమహాసభ అధ్యక్షుడు రామకృష్ణ వెల్లడి సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆర్యవైశ్యుల మనో భావాలను కించపర చడమే కాకుండా సమాజంలోని కొన్ని వర్గాలను దాడులకు పురిగొల్పే విధంగా వ్యవహరిస్తున్న కంచ ఐలయ్యపై తగిన చర్య తీసుకోవాల్సిం దిగా కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తున్నట్లు ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ (వామ్) అధ్యక్షుడు తంగుటూరి రామకృష్ణ తెలిపారు. ఐలయ్య పోకడలను ఖండిస్తూ ఆర్యవైశ్య మహాసభ తరఫున ఇటీవల నిర్వహించిన ఆందోళన కార్యక్రమాల్లో పొల్గొన్న వారికి కృతజ్ఞతలు తెలిపేందుకు శనివారమిక్కడ∙వామ్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఐలయ్యపై కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్కు ఫిర్యాదు చేసి సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తున్నట్లు ఆయన చెప్పారు. అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షాను కూడా కలవబోతున్నామని తెలిపారు. -
బర్రెను జాతీయ జంతువుగా ప్రకటించాలి
ప్రొఫెసర్ కంచ ఐలయ్య హైదరాబాద్: దేశంలో బర్రెలే అత్యధికంగా పాలు ఇస్తున్నందున బర్రెనే జాతీయ జంతువుగా ప్రకటించాలని ప్రొఫెసర్ కంచ ఐలయ్య పేర్కొన్నారు. దళితులు సైతం జాతీయ జంతువుగా పూజించాలన్నారు. శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని అమలు చేయటంతో పాటు ప్రతి గ్రామంలో కిండర్ గార్డెన్ స్కూల్ను ఏర్పాటు చేయాలని, గర్భస్థ శిశువు నుంచి ప్రభుత్వమే పోషకాహారం అందించాలన్నారు. కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్వెస్లీ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం,సీనియర్ జర్నలిస్టు సతీష్ చంద్ర, సామాజికవేత్త సాంబశివరావు, రచయిత జయరాజు, ప్రజాశక్తి మాజీ సంపాదకులు వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.