breaking news
Pranjal Yadav
-
మోడీతో పెట్టుకున్న ప్రాంజల్ యాదవ్
వారణాసి: ఐఏఎస్ అధికారి ప్రాంజల్ యాదవ్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని ఢీకొట్టి ఆయన వార్తల్లో వ్యక్తిగా మారారు. వారణాసిలో మోడీ ఎన్నికల ర్యాలీకి అనుమతి నిరాకరించడం ద్వారా ఆయన దేశం దృష్టిని ఆకర్షించారు. బీజేపీ నాయకులు ఎంతగా ఒత్తిడి తెచ్చినా ఆయన వెనక్కు తగ్గలేదు. దీంతో వారణాసి రిటర్నింగ్ అధికారిగా ఉన్న యాదవ్పై కాషాయ దళాలు దాడికి దిగాయి. ఆయన ములాయం బంధువని, అందుకే ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని కొత్త రాగం అందుకున్నారు. ములాయంతో యాదవ్కు ఎలాంటి బంధుత్వంలేదని సమాజ్వాది పార్టీ తెలిపింది. యాదవ్ కులానికి చెందిన ప్రతిఒక్కరు ములాయంకు బంధువులు కాదంటూ గట్టిగా చెప్పింది. పక్షపాత వైఖరి ప్రదర్శించిన ప్రాంజల్ యాదవ్ను తొలగించాలని బీజేపీ సీనియర్ నాయకులు అరుణ్ జైట్లీ, అమిత్ షా డిమాండ్ చేశారు. ఆయన నేతృత్వంలో వారణాసిలో ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగవని ఆరోపించారు. కాగా ప్రాంజల్ యాదవ్కు కేంద్ర ఎన్నికల సంఘం బాసటగా నిలిచింది. ఆయనను తొలగించాలన్న బీజేపీ డిమాండ్ను తోసిపుచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ కూడా యాదవ్ మంచి అధికారి అంటూ కితాబిచ్చారు. 1980లో జన్మించిన ప్రాంజల్ యాదవ్ 2006 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. రూర్కీ ఐఐటీ నుంచి ఐఐటీ చేశారు. వారణాసికి వచ్చే ముందు అజాంగఢ్ డీఎంగా పనిచేశారు. ఆక్రమణలు తొలిగించి, రోడ్లు వెడల్పు చేయడం ద్వారా ప్రజల అభిమానాలను చూరగొన్నారు. తన సర్వీసులో ఆయనపై ఒక్క అవినీతి ఆరోపణ కూడా రాకపోవడం విశేషం. ఇప్పుడు మోడీకి 'నో' చెప్పి వార్తల్లో నిలిచారు. మోడీతో పెట్టుకున్న ప్రాంజల్ యాదవ్ మున్ముందు ఎలాంచి సంచలనాలకు కేంద్ర బిందువు కానున్నారో చూడాలి. -
ఈసీతో మో‘ఢీ’
* వారణాసిలో నిషేధాజ్ఞలు ఉల్లంఘించి రోడ్షో * తాము కోరుకున్న చోట సభ పెట్టుకునేం దుకు నిరాకరించటంపై ఆగ్రహం * రిటర్నింగ్ అధికారి ప్రాంజాల్యాదవ్ను తప్పించాలని బీజేపీ డిమాండ్ వారణాసి: ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో తాము కోరుకున్న ప్రాంతంలో ఎన్నికల సభ నిర్వహించుకునేందుకు అక్కడి ఎన్నికల అధికారి తనకు అనుమతి నిరాకరించటం పట్ల కేంద్ర ఎన్నికల సంఘంపై బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ యుద్ధం ప్రకటించారు. ఈసీ ఎవరి ఒత్తిడితోనో పనిచేస్తోందని, తనపట్ల వివక్ష చూపిస్తోందని ఆరోపిస్తూ.. గురువారం వారణాసిలో నిషేధాజ్ఞలను ఉల్లంఘించి మరీ రోడ్షో నిర్వహించారు. వారణాసి లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న మోడీ ప్రత్యేక హెలికాప్టర్లో గురువారం బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం ఆవరణలోని హెలీపాడ్లో దిగారు. అక్కడి నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలోని బీజేపీ ప్రధాన ఎన్నికల కార్యాలయం వరకూ అనుమతి లేకుండా రోడ్షో నిర్వహిస్తూ వెళ్లారు. దారిపొడవునా కాషాయ టోపీలు ధరించిన కార్యకర్తలు మోడీకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మోడీ ప్రసంగిస్తూ.. కాంగ్రెస్ పార్టీని ఓడించాలని ప్రజలు నిర్ణయించుకున్నారని.. ఆ పార్టీని ఈసీ గెలిపించజాలదని వ్యాఖ్యానించారు. తాము కోరిన ప్రదేశంలో సభ నిర్వహణకు అనుమతించకపోవటానికి భద్రతా కారణాలను చూపించటం గురించి మాట్లాడుతూ.. ‘‘నా భద్రత గురించి ప్రభుత్వానికి ఆందోళన అక్కర్లేదు.. నేను నా దేశం కోసం చనిపోవటానికి సిద్ధం. అయినా ఇది నా ప్రజాస్వామిక హక్కుల మీద దాడి’’ అని పేర్కొన్నారు. రోడ్షో అనంతరం మోడీ సిగ్రాలోని పార్టీ కార్యాలయానికి చేరుకుని సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మేధావులతో ఆంతరంగికంగా సమావేశమయ్యారు. అలాగైతే ఎన్నికలు నిర్వహించకండి: జైట్లీ అరుణ్జైట్లీ, అమిత్షా సహా బీజేపీ సీనియర్ నేతలు గురువారం ఉదయం నుంచీ వారణాసిలో బెనారస్ విశ్వవిద్యాలయం ఎదుట, ఢిల్లీలో ఈసీ ప్రధాన కార్యాలయం ఎదుట నిరసన చేపట్టి.. తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేశారు. ఈసీని ఉద్దేశించి మాట్లాడుతూ ‘‘భద్రత కల్పించలేకపోతే ఎన్నికలు నిర్వహించకండి’’ అని జైట్లీ వ్యాఖ్యానించారు. వారణాసి రిటర్నింగ్ అధికారి ప్రాంజాల్యాదవ్ను తొలగించాలని డిమాండ్ చేశారు. మరోవైపు.. వారణాసి నగరంలో సీఆర్పీసీలోని 144 సెక్షన్ కింద నిషేధాజ్ఞలను జారీ చేసినట్లు అదనపు జిల్లా మెజిస్ట్రేట్ (అదనపు కలెక్టర్) ఎం.సి.సింగ్ తెలిపారు. ఎవరికీ భయపడం: సీఈసీ మోడీ పట్ల వివక్షాపూరితంగా వ్యవహరిస్తున్నామన్న బీజేపీ ఆరోపణలను కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ వి.ఎస్.సంపత్ తీవ్రంగా ఖండించారు. ఆయన ఢిల్లీలో సహచర ఎన్నికల కమిషనర్లతో కలసి మీడియాతో మాట్లాడారు. వారణాసి రిటర్నింగ్ అధికారి ప్రాంజాల్యాదవ్ తీసుకున్న నిర్ణయాన్ని గట్టిగా సమర్థించారు. ఆయనను తొలగించాలన్న డిమాండ్ను తోసిపుచ్చారు. ఇటీవలి కాలంలో ఈసీ కఠిన నిర్ణయాలు తీసుకున్నపుడల్లా ఈ రాజ్యాంగ సంస్థపై విమర్శల దాడులు పెరుగుతుండటం, చాలా కఠినమైన వ్యాఖ్యలు, ఏకపక్ష ఆరోపణలు చేయటం గమనించామన్నారు. తమ విధి నిర్వహణలో ఎవరికీ, ఏ రాజకీయ పార్టీకీ, మరే సంస్థకూ భయపడబోమని స్పష్టంచేశారు. రాజకీయ పార్టీలు పరిపక్వతతో వ్యవహరించాలని హితవుపలికారు. ఇదిలావుంటే.. యూపీలో సీఎం అఖిలేష్యాదవ్, అరవింద్ కేజ్రీవాల్లకు సభల నిర్వహణకు అనుమతి ఇచ్చిన రిటర్నింగ్ అధికారి.. నరేంద్రమోడీ సభకు అనుమతి ఇవ్వకపోవటం వివక్షాపూరితమని, ఆయనను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఎం.వెంకయ్యనాయుడు నేతృత్వంలో బీజేపీ నేతల బృందం గురువారం ఢిల్లీలో సీఈసీని కలిసి ఫిర్యాదు చేసింది. ఇదీ వివాదం... వారణాసిలో మతపరంగా సున్నితప్రాంతమైన బేనియాబాగ్లో మోడీ ప్రచార సభ నిర్వహించేందుకు బీజేపీ అనుమతి కోరగా.. ఎన్నికల అధికారి తిరస్కరించారు. దీంతో వేరే ప్రదేశంలో మోడీ సభను నిర్వహించుకునేందుకు బీజేపీ అనుమతి కోరగా ఈసీ అనుమతులు మంజూరు చేసింది. అయితే.. బీజేపీ ఆ తర్వాత ఆ అనుమతులన్నిటినీ తిరస్కరిస్తూ తాము తొలుత కోరిన బేనియాబాగ్లోనే సభ నిర్వహిస్తామని పట్టుపట్టింది. ఇందుకు ఈసీ నిరాకరించటంతో ఆ సంఘంపై బీజేపీ నాయకత్వం తీవ్రంగా విరుచుకుపడుతోంది. ఐఐటీ గ్రాడ్యుయేట్ ప్రాంజాల్యాదవ్ ఈ నెల 12న పోలింగ్ జరగనున్న వారణాసిలో బీజేపీ పట్టుపట్టిన ప్రాంతంలో నరేంద్రమోడీ సభ నిర్వహణకు అనుమతి నిరాకరించిన జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి ప్రాంజాల్యాదవ్ ఈ వివాదానికి కేంద్ర బిందువుగా వార్తల్లోకెక్కారు. 34 ఏళ్ల ప్రాంజాల్యాదవ్ ఐఐటీ గ్రాడ్యుయేట్. తీర్థయాత్రా క్షేత్రమైన వారణాసికి కొత్త రూపు నిచ్చేందుకు కృషి చేస్తున్నారన్న పేరు ఆయనకు ఇప్పటికే ఉంది. గత ఏడాది వరదల సందర్భంగా నిర్విరామంగా గంటల తరబడి పనిచేశారన్న ఖ్యాతీ ఉంది. తాజాగా మోడీ సభ వివాదంలో ఆయనపై ఇటు రాజకీయ రంగంలోనూ, అటు సామాజిక వెబ్సైట్లలోనూ విమర్శలు, ప్రశంసలూ సమానంగా వచ్చాయి. ఈసీ నన్ను ఇబ్బంది పెడుతోంది ‘‘ఈసీ నన్ను, మా పార్టీనీ ఇబ్బంది పెడుతోంది. మోడీని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారో.. బీజేపీని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారో ఈసీ చెప్పాలి. నాకు చాలా ఇబ్బంది కలిగింది. కానీ ఇప్పుడు ఆ వివరాల్లోకి వెళ్లదలుచుకోలేదు. నేను ఈసీని లక్ష్యంగా చేసుకోలేదు. నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. .... ప్రియాంకాగాంధీ ‘నీచ రాజకీయాలు’ అన్న విమర్శలను కులంపై చేసిన విమర్శగా ఎందుకు అన్నానంటే.. నాకు బాగా తెలిసిన గుజరాతీ భాషలో ఆ మాటకు దగ్గరదగ్గరగా అటువంటి అర్థం వస్తుంది.’’ - టైమ్స్ నౌ ఇంటర్వ్యూలో నరేంద్రమోడీ -
ఈసీతో బీజేపీ ఢీ!
వారణాసిలో మోడీ సభకు అనుమతి నిరాకరణపై ఆగ్రహం వారణాసి: బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ గురువారం వారణాసిలోని బెనియాబాగ్లో తలపెట్టిన బహిరంగ సభకు.. మత ఘర్షణల వల్ల భద్రతా సమస్యలు తలెత్తే కారణాలరీత్యా రిటర్నింగ్ అధికారి అనుమతి నిరాకరించడం రాజకీయ దుమారం రేపింది. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ ఏకంగా ఎన్నికల కమిషన్ (ఈసీ)ని ఢీకొనేందుకు సిద్ధమైంది. రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న జిల్లా మేజిస్ట్రేట్ ప్రాంజల్ యాదవ్ను తక్షణమే తొలగించకుంటే బలప్రదర్శనకు దిగుతామని బుధవారం ఈసీకి రాసిన మూడు వేర్వేరు లేఖల్లో బీజేపీ నేత అరుణ్జైట్లీ హెచ్చరించారు. గురువారం బెనారస్ హిందూ వర్సిటీ వద్ద అమిత్ షా ఇతర నేతలతో కలిసి ధర్నా చేస్తామని, ఢిల్లీలోని ఈసీ కార్యాలయం వద్ద కూడా తమ నేతలు ధర్నాకు దిగుతారన్నారు. రిటర్నింగ్ అధికారి పక్షపాత వైఖరిని అడ్డుకోకుండా ఈసీ ప్రేక్షకపాత్ర పోషించిందన్నారు. ‘ఉన్నత స్థానాల్లో బలహీన వ్యక్తు లు కూర్చున్నప్పుడు ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడుతుంది’ అని ముగ్గురు సభ్యుల ఎన్నికల కమిషన్ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈసీ వైఖరికి నిరసనగా గురువారం వారణాసిలో మోడీకి సంబంధించిన అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకుంటున్నట్లు చెప్పారు. స్థానిక బీజేపీ ఎమ్మెల్యే దేవ్రాయ్ ఇప్పటికే ధర్నా ప్రారంభించారు. కాగా, తాము పక్షపాతంతో వ్యవహరించలేదని ఈసీ స్పష్టం చేసింది.