భారతదేశ ద్వీపకల్ప నదులు
ద్వీపకల్ప నదులు వర్షాకాలం మాత్రమే నీటి ప్రవాహం కలిగి ఉంటాయి. అందువల్ల వీటిని ‘వర్షాధార’ నదులు అని పిలుస్తారు. ఇవి కఠిన శిలల గుండా ప్రవహించడం వల్ల సాధారణ వేగంతో ‘అధోక్రమక్షయం’ చేస్తాయి.
ఈ నదులన్నీ అంతర్వర్తిత రకానికి చెందినవి.
ఇవి నౌకాయానానికి అనుకూలం కాదు. ఈ నదీ వ్యవస్థపై జలపాతాలు అధికంగా ఏర్పడతాయి.
ద్వీపకల్ప నదులను ముఖ్యంగా రెండు రకాలుగా వర్గీకరిస్తారు. అవి..
1. తూర్పు వైపు ప్రవహించే నదులు
ఉదా: గోదావరి, కృష్ణా, మహానది, కావేరి, పెన్నా మొదలైనవి.
2. పశ్చిమం వైపు ప్రవహించే నదులు
ఉదా: నర్మద, తపతి, సబర్మతి, మహి మొదలైనవి.
గోదావరి: దీన్ని దక్షిణ గంగ, వృద్ధ గంగ, ఇండియన్ రైన్ అనే పేర్లతో కూడా పిలుస్తారు. ఇది ద్వీపకల్పనదుల్లో అతిపెద్దది. దక్షిణ భారత నదుల్లో అతి పొడవైనది. ఇది పశ్చిమ కనుమల్లో మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా త్రయంబక్ సమీపంలో బీలే సరస్సు వద్ద జన్మిస్తోంది. అక్కడి నుంచి మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా సుమారు 1,465 కి.మీ. ప్రయాణించి చివరగా బంగాళాఖాతంలో కలుస్తోంది.
ఈ నది మహారాష్ట్రలోని నాందేడ్ను దాటి తెలంగాణలోకి ఆదిలాబాద్ జిల్లా బాసర వద్ద ప్రవేశిస్తోంది. అక్కడి నుంచి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల మీదుగా పోలవరం వద్ద ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తోంది. అనంతరం తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల ద్వారా ప్రవహించి చివరగా 7 పాయలుగా విడిపోయి బంగాళాఖాతంలో కలుస్తోంది.
గోదావరి.. సముద్రంలో కలిసే ముందు గౌతమి, వశిష్ట, వైనతేయ, తుల్య, భరద్వాజ అనే ప్రధాన శాఖలుగా విడిపోయి, తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రికి దిగువన యానాం, నరసాపురం మధ్య ప్రాంతంలో బంగాళాఖాతంలో కలుస్తోంది.
గోదావరి తెలంగాణలోకి ప్రవేశించే బాసర లో సరస్వతి ఆలయం ఉంది.
ఈ నది గౌతమి, వశిష్ట పాయల మధ్య ఏర్పరిచే దీవిని ‘కోనసీమ’ అంటారు.
ఈ నది పాపికొండల మధ్య బైసన్ గార్డ్ను ఏర్పరుస్తుంది.
ఈ నదికి అంతర్వేది సమీపంలో నదీ వంకరలు, ఆక్స్బౌ సరస్సులు ఉన్నాయి.
దీని పరివాహక ప్రాంతం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. ఇది దేశంలో రెండో అతిపెద్ద పరివాహక ప్రాంతం.
ఉప నదులు: మంజీరా, ప్రవర, కిన్నెరసాని, మూల, ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, సీలేరు.
కృష్ణానది: ఇది ద్వీపకల్ప నదుల్లో రెండో అతిపెద్ద, దక్షిణ భారత దేశంలో రెండో పొడవైన నది. ఇది పశ్చిమ కనుమల్లో మహారాష్ట్రలోని ‘మహాబలేశ్వర్’ వద్ద జన్మించి మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహించి, చివరగా ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా హంసలదీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తోంది.
కృష్ణానది మొత్తం పొడవు 1,400 కి.మీ.
ఇది తెలంగాణలోకి మొట్టమొదట మహబూబ్నగర్ జిల్లా మక్తల్ మండలం ‘తంగడి’ వద్ద ప్రవేశిస్తోంది.
ఈ నది శ్రీశైలం సమీపంలో ‘పాతాళగంగ’ గార్జ్ను ఏర్పరుస్తోంది.
ఇది విజయవాడకు దిగువన ‘పులిగడ్డ’ వద్ద రెండు పాయలుగా చీలి, మళ్లీ కొంత దూరం తర్వాత కలుస్తోంది. ఈ పాయల మధ్య భూభాగాన్ని ‘దివిసీమ’ అంటారు.
అత్యంత వివాదాస్పదమైన ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు ఈ నదిపైనే ఉన్నాయి.
ఉప నదులు: తుంగభద్ర, ఘటప్రభ, మలప్రభ, మూసీ, డిండి, భీమా, కొయనా, వర్ణ, మున్నేరు, పాలేరు ముఖ్యమైనవి.
ృష్ణానదికి అతిపెద్ద ఉప నది తుంగభద్ర.
కృష్ణానది పరివాహక ప్రాంతం మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాష్ట్రాల్లో విస్తరించి ఉంది.
కృష్ణా, గోదావరి నదుల మధ్య డెల్టాలో కొల్లేరు మంచినీటి సరస్సు ఉంది.
మహానది: ఇది ఛత్తీస్గఢ్లోని ‘దండకారణ్యం’లో ‘శిహావ’ అనే ప్రాంతం వద్ద జన్మిస్తోంది. ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల గుండా సుమారు 658 కి.మీ.ల దూరం ప్రయాణించి ఒడిశాలోని కటక్కు దిగువన ‘నారాజ్’ అనే ప్రాంతంలో బంగాళాఖాతంలో కలుస్తోంది.
ఇది కటక్ జిల్లాలో విశాలమైన డెల్టాను ఏర్పరుస్తోంది. ఈ డెల్టాను ఆనుకొని ‘చిల్కా’ అనే ఉప్పునీటి సరస్సు ఉంది.
ఈ నదికి బౌద్రోజ్, మందలి మధ్య ‘ర్యాపిడ్’లు ఉన్నాయి.
ఈ నదిపై అతి పొడవైన ‘హీరాకుడ్’ ఆనకట్ట నిర్మించారు.
మహానది, గోదావరి నదుల మధ్య ప్రాంతాన్ని కళింగ అంటారు.
ఉప నదులు:
మండ్, షియోనాథ్, లేవ్, ఇబ్, హసీడియో, ఓంగ్, జోంక్, టెల్ మొదలైనవి ప్రధాన
ఉప నదులు.
కావేరి నది: ఇది పశ్చిమ కనుమల్లో కర్ణాటకలోని కూర్గ్ జిల్లా బ్రహ్మగిరి కొండల్లో ఉన్న ‘తలై కావేరి’ వద్ద జన్మిస్తోంది. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల గుండా సుమారు 805 కి.మీ.ల దూరం ప్రయాణించి, చివరగా తమిళనాడులోని ‘కావేరి పట్నం’ వద్ద బంగాళాఖాతంలో కలుస్తోంది.
ఈ నది దక్షిణ కర్ణాటక పీఠభూమి నుంచి తమిళనాడు మైదానాల్లోకి ప్రవేశిస్తూ మధ్యలో ‘శివసముద్రం’ వద్ద జలపాతాన్ని ఏర్పరుస్తోంది.
దీని పరివాహక ప్రాంతం కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో విస్తరించి ఉంది.
ఈ నది తమిళనాడులోని ‘శ్రీరంగం’ వద్ద రెండు పాయలుగా చీలుతోంది.
ఉత్తరపాయను ‘కోలరూన్’ అని, దక్షిణ పాయను ‘కావేరి’ అని పిలుస్తారు.
తమిళనాడులో ఈ నది ప్రధానమైన డెల్టాను ఏర్పరిచింది. కాబట్టి ఈ నది తమిళనాడుకు అతి ముఖ్యమైంది.
ఈ నది ప్రవహించే ముఖ్యమైన జిల్లా
తంజావూరు.
ఉప నదులు: హేరంగి, హేమవతి, లోకపావని, భవాని, కబిని, సువర్ణవతి, అమరావతి, అర్కవతి, లక్ష్మణతీర్థ, ష్రింశ మొదలైనవి.
పెన్నా: ఈ నదిని ‘పినాకిని’ అని కూడా పిలుస్తారు. ఇది కర్ణాటకలోని ‘కోలార్’ జిల్లా ‘నందిదుర్గం’ గిరుల్లో ‘చెన్నకేశర’ కొండ వద్ద ఉద్భవించి, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా సుమారు 600 కి.మీ. దూరం ప్రవహిస్తోంది. చివరగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఊటుకూరు వద్ద బంగాళాఖాతంలో కలుస్తోంది.
ఇది ఆంధ్రప్రదేశ్లోకి అనంతపురం జిల్లాలో మొదట ప్రవేశిస్తోంది.
ఉప నదులు:
జయమంగళి, సగిలేరు, చెయ్యేరు, కుందేరు, చిత్రావతి, పాపాఘ్ని మొదలైనవి.
ఇది సముద్రంలో కలిసేచోటుకు దక్షిణంగా
సుమారు 100 కి.మీ.ల దూరంలో ‘‘పులికాట్’’ అనే ఉప్పునీటి సరస్సు ఏర్పడింది. ఇది నెల్లూరు జిల్లా, తమిళనాడు మధ్య ఉంది. ఈ సరస్సు వలస పక్షులకు నిలయంగా చెప్పొచ్చు.
తూర్పునకు ప్రవహించే ఇతర నదులు
1.నాగావళి: దీన్ని ‘లాంగ్యులా’ అని కూడా అంటారు. ఇది ఒడిశాలోని ‘రాయ్ఘడ్’ కొండల్లో పుట్టి ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా మోపసుబందరు వద్ద బంగాళాఖాతంలో కలుస్తోంది.
ఉప నదులు: ఒట్టిగడ్డ, జంఝావతి, స్వర్ణముఖి, వేదవతి మొదలైనవి.
2.వంశధార: ఈ నది తూర్పు కనుమల్లో పుట్టి బంగాళాఖాతంలో కలిసే నదుల్లో పెద్దది. ఇది ఒడిశాలోని ‘జయపూర్’ కొండల్లో జన్మించి ఆంధ్రప్రదేశ్లోకి శ్రీకాకుళం జిల్లా పాతపట్నం వద్ద ప్రవేశించి, అదే జిల్లా ‘కళింగపట్నం’ వద్ద బంగాళాఖాతంలో కలుస్తోంది.
3.సువర్ణ రేఖ: దీన్ని సుబర్ణరేఖ నది అని కూడా అంటారు. ఇది చోటానాగపూర్ పీఠభూమిలో జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీ వద్ద నగ్రిలో జన్మిస్తోంది. జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల గుండా ప్రవహించి ఒడిశాలోని ‘కిర్తానియా’ వద్ద బంగాళాఖాతంలో కలుస్తోంది.
4.తామ్రపాణి: ఇది కేరళ రాష్ట్రంలోని ‘అగస్త్యమలై’ కొండల్లో జన్మించి తమిళనాడులోని గల్ఫ్ ఆఫ్ మన్నార్లో కలుస్తోంది.
5.బ్రాహ్మణి: ఇది ఒడిశాలో మహానది తర్వాత 2వ పొడవైన నది. ఇది జార్ఖండ్లోని ‘లోహార్ధగా’ వద్ద జన్మించిన ‘సౌసత్ కోయిల్’ నది, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లో జన్మించిన ‘సాంక్’ నదుల కలయికతో ఏర్పడింది.
ఇది ఒడిశాలోని సుందర్ఘర్, కియోంజర్, డెంకనల్, కటక్, జైపూర్లలో ప్రవహించి, ‘ధర్మా’ వద్ద బంగాళాఖాతంలో కలుస్తోంది.
ఈ నది ఒడ్డున ‘రూర్కెలా’ ఇనుము– ఉక్కు కర్మాగారం ఉంది.
పశ్చిమం వైపు ప్రవహించే నదులు
నర్మద: ఇది పశ్చిమం వైపు ప్రవహించే నదుల్లో అతి పెద్దది. ఇది వింధ్య, సాత్పురా పర్వతాల మధ్యలో ప్రవహిస్తోంది.
ఇది విదీర్ణధరి గుండా ప్రవహిస్తుంది.
దీన్ని పగులులోయ నది, మార్బుల్ రివర్ అని కూడా పిలుస్తారు.
ఇది మధ్యప్రదేశ్లోని ‘అమర్ కంటక్’ వద్ద జన్మించి, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల గుండా సుమారు 1,312 కి.మీ. ప్రయాణించి చివరగా గుజరాత్లోని ‘గల్ఫ్ ఆఫ్ కంభట్’లోని బ్రోచ్ లేదా బారుచ్ వద్ద అరేబియా సముద్రంలో కలుస్తోంది.
ఈ నదిపై హందియా, మాంధాత మధ్య ర్యాపిడ్లు ఉన్నాయి. వీటిలో ‘కపిల్ధార’ ప్రధానమైంది. దీంతోపాటు మధ్యప్రదేశ్లోని జబల్పూర్ వద్ద ఉన్న ధువన్ధార జలపాతం అత్యంత ప్రసిద్ధిగాంచింది. ఈ జలపాతాన్ని క్లౌడ్ ఆఫ్ మిస్ట్ అంటారు.
ఈ నదిపైనే మార్బుల్ జలపాతం కూడా ఉంది. దీనిపై ఉన్న ఇతర జలపాతాలు మండార్, దర్డి, సహస్రధార.
ఈ నది ఏర్పరిచే దీవి ఆలియాబెట్.
ఈ నది పరివాహక ప్రాంతం అత్యధికంగా మధ్యప్రదేశ్లోనూ ఆ తర్వాత మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లోనూ విస్తరించి ఉంది.
ఉప నదులు: హిరన్, ఓర్సంగ్, తావా, దూది, వరిపాన్, షార్ బార్నెర్, బంజర్, కుంది, షక్కర్, కోలర్ మొదలైనవి.
తపతి: పశ్చిమం వైపు ప్రవహించే నదుల్లో ఇది 2వ అతిపెద్ద నది. ఇది సాత్పురా, అజంతా కొండల మధ్య ప్రవహిస్తోంది. ఇది మధ్యప్రదేశ్లోని బెతుల్ జిల్లా ముల్తాయ్ వద్ద జన్మించి, నర్మదానదికి సమాంతరంగా సుమారు 724 కి,.మీల దూరం మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తోంది. గుజరాత్లోని సూరత్ సమీపంలో ‘ఎష్యూరీ’ ద్వారా అరేబియా సముద్రంలోని క్యాంబే సింధూశాఖలో కలుస్తోంది.
దీని పరివాహక ప్రాంతం అత్యధికంగా మహారాష్ట్రలోనూ, ఆ తర్వాత మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో విస్తరించి ఉంది.
నర్మద, తపతి నదులను కవలలు అంటారు.
ఉప నదులు: పూర్ణ , బేతుల్, పాట్కి, కాప్రా, గిర్నా, గంజాల్, పలేర్, బోరి మొదలైనవి.
పశ్చిమానికి ప్రవహించే ఇతర నదులు
1.శరావతి: ఇది కర్ణాటకలో ఉంది. దేశంలోనే అత్యంత ఎత్తయిన జలపాతం జోగ్ లేదా జెర్సొప్పా ఈ నదిపైనే ఉంది.
2.పంబియార్: ఇది కేరళలో ఉంది. ఈ నది ఒడ్డునే శబరిమలై ఉంది.
3.పొన్నని: ఇది కేరళలో అతి పొడవైన నది.
4.పెరియార్: ఇది కేరళలో ఉంది. ఆది శంకరాచార్యుల జన్మస్థలం కాలడి ఈ నది ఒడ్డున ఉంది.
5.ఇడుక్కి: ఇది కేరళలో ఉంది.
6.గోవా రాష్ట్రంలో పశ్చిమానికి ప్రవహించే నదులు: జువారి, మాండవి, రాచోల్.
7.కర్ణాటకలో పశ్చిమానికి ప్రవహించే నదులు: నేత్రావతి, తాద్రి, కాళి, గంగవల్లి.
ఇతర నదులు
సబర్మతి: ఇది రాజస్థాన్లోని ఆరావళి పర్వతాల్లో ‘మేవార్’ అనే ప్రాంతంలో జన్మించి, జయసముద్ర సరస్సును తాకుతూ ఉదయ్పూర్ గుండా వెళుతూ, దక్షిణ గుజరాత్లోని కంభట్ సింధూ శాఖలో కలుస్తోంది.
దీని పురాతన పేరు ‘గిరికర్ణిక’
ఈ నది గురించి పద్మ, గౌడపురాణంలో ప్రస్తావించారు.
దీని పరివాహక ప్రాంతం రాజస్థాన్, గుజరాత్లలో విస్తరించి ఉంది.
ఉప నదులు: హరా, వాకల్, సీది, వేష్వా, హత్మతి మొదలైనవి.
మహినది: ఇది మధ్యప్రదేశ్లోని వింధ్య పర్వతాల్లో పశ్చిమ భాగంలో సర్దార్పూర్కు దక్షిణాన పుట్టి, మధ్యప్రదేశ్లో ఉత్తర వాయవ్యాన ప్రవహిస్తోంది. అక్కన్నుంచి రాజస్థాన్లో ప్రవేశించి, నైరుతివైపు తిరిగి గుజరాత్లోని కాంబే సింధు శాఖలో సంగమిస్తోంది.
ఈ నది ఒడ్డున ఉన్న ముఖ్యమైన నగరం వడోదర.
ఈ నది పరివాహక ప్రాంతం మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో విస్తరించి ఉంది.
ఉప నదులు: సోమ్, అనాస్, పనమ్.