అబ్బే.. ఏమీ జరగలేదట!
* పీతల ఇంట్లో నోట్ల కట్టల కేసు కొట్టేసిన పోలీసులు
* మంత్రికి సంబంధం లేదన్న డీఎస్పీ
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఊహించిందే జరిగింది. తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి ఓటుకు కోట్లు వ్యవహారంలో అడ్డంగా దొరికిపోవడం, సూత్రధారి ఏపీ సీఎం చంద్రబాబేనని టి.మంత్రులు చెబుతున్న నేపథ్యంలో.. మంత్రి పీతల సుజాత ఇంట్లో నోట్ల కట్టల సంచి ఉదంతం చోటు చేసుకోవడం.. ఏపీ ప్రభుత్వ పెద్దలను ఉక్కిరిబిక్కిరి చేసింది.
కనీసం ఈ కేసు నుంచైనా బయటపడి పోయిన పరువును కాస్తై కాపాడుకోవాలనే పథకం వేశారు. అంతే.. అసలేం జరగలేదనీ, నోట్ల కట్టలకు.. మంత్రికీ సంబంధం లేదని పోలీసులు తేల్చేశారు. ఈ కేసులో దర్యాప్తు పూర్తయ్యిందని, కేసును క్లోజ్ చేశామని నరసాపురం డీఎస్పీ పి.సౌమ్యలత శుక్రవారం చెప్పారు. ఈ వ్యవహారంతో మంత్రికి సంబంధం లేదని, ఆమె ఇంటివద్ద డబ్బు సంచి వదిలివెళ్లిన ఆదాల విష్ణువతి కూడా అమాయకురాలేనని తేలిందన్నారు.
ఇక మంత్రి తండ్రి డబ్బులు తీసుకుంటుండగా సెల్ఫోన్తో వీడియో తీశారన్న దానిపైనా విచారణ చేపట్టామని డీఎస్పీ చెప్పారు. కొన్ని రోజుల క్రితం మంత్రి తండ్రి ఏలూరులో డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో కొందరు సెల్ఫోన్తో వీడియో తీశారనే వదంతులు ఉన్నాయని చెప్పారు. అయితే, రూ.10 లక్షల బ్యాగ్ వ్యవహారానికి, దానికి సంబంధం లేదన్నారు.