breaking news
panjam sukumar reddy
-
వైఎస్సార్సీపీ సీనియర్ నేత పంజం సుకుమార్రెడ్డి మృతి
రైల్వేకోడూరు అర్బన్: అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు మండల వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు, వ్యవసాయ సలహా మండలి మాజీ చైర్మన్ పంజం సుకుమార్రెడ్డి (64) మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు పార్టీ నేతలు సంతాపం తెలిపారు. సుకుమార్రెడ్డి రాజకీయాల్లో తొలి నుంచి వైఎస్ కుటుంబంతోనే ఉన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతూ మండలంలో గుర్తింపు తెచ్చుకున్నారు. 2000–2011 మధ్య అనంతరాజుపేట పంచాయతీ సర్పంచ్గా రెండు పర్యాయాలు ఎన్నికై గ్రామాభివృద్ధికి కృషి చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పంచాయతీలో వైఎస్సార్ హార్టికల్చర్ కళాశాల ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. గత ప్రభుత్వంలో వ్యవసాయ సలహా మండలి జిల్లా చైర్మన్గా నియామకమై ప్రభుత్వ పథకాలను రైతులకు అందించడంలో ఎంతో కృషి చేశారు. కోడూరు డాల్ఫిన్ డేల్ పేరిట విద్యాసంస్థను ప్రారంభించి నాణ్యమైన విద్య అందించారు. -
ఢాల్ఫిన్ డేల్ పాఠశాలలో పూల అలంకరణ
రైల్వేకోడూరు రూరల్: పట్టణంలోని ఢాల్ఫిన్ డేల్ పాఠశాలలో శనివారం సాయంత్రం ఫ్లవర్స్ డే ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ పంజం సుకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు వివిధ రకాల పూలతో పలు అలంకరణలు ప్రదర్శించారు. ముఖ్యంగా ఈనెలలో రానున్న చిల్డ్రన్స్ డేను పురష్కరించుకుని నెహ్రూ చిత్రాన్ని గీసి చుట్టూ పూలతో అలంకరించారు. అనంతరం విద్యార్థినీ విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ పంజం సుకుమార్ రెడ్డి మాట్లాడుతూ శనివారం ఫ్లవర్స్ డే కావడంతో విద్యార్థులు కార్తీక మాసంలో దొరికే వివిధ రకాలు పూలతో పలు ఆకృతులలో అలంకరించారన్నారు. అలాగే విద్యార్థులకు బెలున్, నిమ్మకాయ లాంటి ఆటల పోటీలు నిర్వహించామన్నారు. ఈ పోటీలలో విజేతలకు చిల్ట్రన్స్ డే సందర్భంగా బహుమతులు అందిస్తామన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బాలా కుమార్, పంజం శ్రీనిధి, పీఈటీ రహంతుల్లా, విద్యార్థులకు సహకారం అందించిన ఉపాధ్యాయుడు చెంగయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
గాలి బీభత్సం
జమ్మలమడుగు/జమ్మలమడుగు రూరల్, రైల్వేకోడూరు : జమ్మలమడుగు, రైల్వేకోడూరు మండలాల్లో శుక్రవారం రాత్రి, శనివారం ఈదురు గాలులతో కూడిన వర్షం రైతులను చావు దెబ్బతీసింది. చేతికి వచ్చిన ఆరటి తోట నేలకు ఒరిగిపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. జమ్మలమడుగు మండల పరిధిలోని 10 గ్రామాల్లో 22 ఇళ్లు పూర్తిగా, 39 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. పి.బోమ్మెపల్లి, గూడెంచెరువు గ్రామాల్లోని రైతులు ముర్రామధుసూధనరెడ్డి తోటలో 3400 అరటి చెట్లు, టంగుటూరు పార్వతమ్మ తోటలో 2500, నాగశెట్టిగారి విజయలక్షి్ష్మ తోటలో ఆరువేలు, లక్షి్ష్మనారాయణ తోటలో 1500 చెట్లు నేలకొరిగాయి. రూ.30 లక్షల నష్టం వాటిల్లిందని రైతులు కన్నీటిపర్యంతమయ్యారు. పది రోజుల్లో పంట చేతికొస్తుండగా వాన గాలి ఇలా నాశనం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. పలుచోట్ల భారీ వృక్షాలు పడిపోయి మూడు కార్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. జమ్మలమడుగు,మైలవరం, పెద్దముడియం మండలాల్లో ఈదురు గాలులకు 150 దాకా విద్యుత్ స్తంభాలు, 15 వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నట్లు విద్యుత్ శాఖాధికారులు వెల్లడించారు. పలు గ్రామాల్లో అంధకారం నెలకొంది. శనివారం ముమ్మరంగా మరమ్మతులు ప్రారంభించారు. వీలైనంత త్వరగా విద్యుత్ సరఫరాను పునరుద్దరిస్తామని ఏడి కృష్ణదేవా పేర్కొన్నారు. జమ్మలమడుగులోని రామిరెడ్డిపల్లె రహదారిలో గౌస్మోద్దీన్కు చెందిన నాలుగు వేల కోళ్లు, మైలవరం మండలం వేపరాల గ్రామంలో జ్యోతి రెడ్డికి చెందిన 1200 కోళ్లు మృతి చెందాయి. పెద్దపసుపల రహదారిలో ఉన్న బీఎల్ఆర్ గోదాము వీపరితమైన గాలుల ధాటికి పైకప్పు పూర్తిగా ఎగిరిపోయి రైతులు దాచుకున్న శనగ, జొన్నల బస్తాలు తడిసిపోయాయి. కోటి రూపాయలకు పైగా నష్టం వాటిల్లినట్లు రెవిన్యూ అధికారుల ప్రాథమిక అంచనా. రైల్వేకోడూరు మండలంలో పచ్చని పొలాలు, పేదల ఇండ్లపై ప్రకృతి కన్నెర్ర చేసింది. శనివారం సాయంత్రం గాలి దెబ్బకు దాదాపు వంద ఎకరాలకు పైబడి అమృతపాణి అరటి నేలమట్టం అయినట్లు బాదిత రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. అరటి తోటల్లో కొన్ని చె ట్లు సగానికి విరగ్గా, మరికొన్ని చెట్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. కోడూరు నుంచి చిట్వేలికి వెళ్లే దారిలో వీవీ కండ్రిక సమీపంలో ఉన్న ఓ భారీ వేప వృక్షం కూలిపోయింది. ఓబనపల్లె మొదలుకుని తిమ్మిశెట్టిపల్లె వరకు పలు చోట్ల వేప చెట్లు విరిగి రోడ్డుకు అడ్డంగా పడ్డాయి. సమీప గ్రామాల ప్రజలు రోడ్డుకు అడ్డం తొలగించారు. తురకపల్లె సమీపంలో అరటిలోడుతో వెళతున్న ఐచ ర్ వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కన పడిపోయింది. పిట్లావాండ్లపల్లెకు చెందిన సంటి శంకరమ్మ రేకుల ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. గాలికి పైనున్న రేకులు లేచి సమీపంలోని బొప్పాయి తోటలో పడిపోయాయని భాదితులు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షం వచ్చిన సమయంలో తాము ఇంటిలోనే ఉన్నామని ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చిందని, తేరుకుని చూసేలోపే రేకులు, పైపులు, ఫ్యానుతో సహా పంట పొలంలో పడిఉన్నాయన్నారు. ఇంటిలో ఉన్న సరుకులు, ఇతర సామగ్రి తడిచి ముద్దయ్యాయని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. అదే గ్రామానికి చెందిన గంగయ్య ఇంటి రేకులు కూడా గాలికి కొట్టుకుపోయాయి. యానాదయ్య, మాజీ సర్పంచ్ వెంకటయ్య, సుబ్బయ్య, జయమ్మ తదితర దళిత రైతులకు చెందిన అరటి తోటలు ధ్వంసమయ్యాయి. పొలాల్లోని కొబ్బరి చెట్లు సగానికి విరిగి పడ్డాయని వారు తెలిపారు. అనంతరాజు పేట పంచాయితీ తూర్పుపల్లెకు చెందిన పంజం వేణుగోపాల్ రెడ్డి, దేశు శ్రీనివాసులు రెడ్డి, దేశు మనోహర్ రెడ్డి, దేశఉ రవీంద్రారెడ్డి, శివశంకర్రెడ్డి తదితర రైతులకు చెందిన అరటి తోటలు దెబ్బతిన్నాయి. శివారెడ్డి ఇంటి రేకులు గాలికి కొట్టుకుపోయాయి. రైల్వేకోడూరులోని పలు వీధుల్లో విద్యుత్ స్తంభాలు ఒరిగిపోయాయి. రాత్రి 8 గంటగలైనా విద్యుత్ పునరుద్దరణ జరగలేదు. కాగా, దెబ్బతిన్న అరటి తోటలను వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పంజం సుకుమార్రెడ్డి పరిశీలించి భాదితులకు ధైర్యం చెప్పారు.