breaking news
Operation Parivartan
-
శాంతిభద్రతలు భేష్
సాక్షి, అమరావతి: క్షేత్రస్థాయికి పోలీసు వ్యవస్థ.. స్నేహపూర్వక పోలీసు విధానం.. దశాబ్దాలుగా బ్రహ్మపదార్థంగా అంతుచిక్కకుండా ఉన్న ఈ రెండు లక్ష్యాలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం సాధించి చూపించింది. అందుకోసం పోలీసు యంత్రాంగాన్ని వ్యవస్థాగతంగా బలోపేతం చేసింది. విధానపరంగా తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలను అందిస్తున్నాయి. శాంతిభద్రతలు గణనీయంగా మెరుగుపడ్డాయి. ప్రజలు భయ పడకుండా, శాంతి భద్రతలతో జీవించేలా ప్రభుత్వం పోలీసు వ్యవస్థను తీర్చిదిద్దింది. అక్రమ వ్యాపారాల నిరోధానికి కొత్తగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ)ని నెలకొల్పింది. దశాబ్దాలుగా వేళ్లూనుకుపోయిన గంజాయి సాగును కూకటివేళ్లతో సహా పెకలించివేసింది. నాటు సారా దందాను సమర్థంగా కట్టడి చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం సత్ఫలితాలు సాధిస్తోంది. రాష్ట్రంలో నేరాల కట్టడికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఆంధ్రప్రదేశ్లో నేరాలు, అల్లర్లు గణనీయంగా తగ్గాయని జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్సీఆర్బీ) నివేదికలే చెబుతున్నాయి. జాతీయ స్థాయిలో 36 అవార్డులు సాధించడం రాష్ట్ర పోలీసుల సమర్థ పనితీరుకు నిదర్శనం. వ్యవస్థాగతంగా బలోపేతం రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రభుత్వం పోలీసు యంత్రాంగాన్ని వ్యవస్థాగతంగా బలోపేతం చేసింది. జిల్లాల పునర్విభజనతో 13 జిల్లా పోలీసు కార్యాలయాలు 26కు పెరిగాయి. క్షేత్రస్థాయిలో పోలీసు వ్యవస్థ బలోపేతానికి కొత్తగా 16 సబ్ డివిజన్లు, 19 పోలీసు సర్కిళ్లను ఏర్పాటు చేసింది. 2019కు ముందు 98 సబ్ డివిజన్లు ఉండగా ఇప్పుడు 114కు పెరిగాయి. 2019కు ముందు 197 పోలీస్ సర్కిళ్లు ఉండగా ప్రస్తుతం 216కు చేరాయి. ఇక ఏడాదికి 6,500 పోలీసు పోస్టుల భర్తీకి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది 6,511 పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టింది. దేశంలోనే విప్లవాత్మక రీతిలో గ్రామ, వార్డు సచివాలయాల్లో 15 వేల మంది మహిళా పోలీసులను నియమించి క్షేత్రస్థాయిలో శాంతి భద్రతల పరిరక్షణకు కొత్త వ్యవస్థను సృష్టించింది. రాష్ట్రంలో నేరాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలను జియో ట్యాగింగ్ చేసి గస్తీ విధులు కేటాయిస్తోంది. అసాంఘిక శక్తులను ముందుగానే గుర్తించి కౌన్సెలింగ్ నిర్వహించడం, రౌడీషీట్లు తెరవడం మొదలైన చర్యలతో నేరాలకు ఆస్కారం లేకుండా చేస్తోంది. ఎస్సీ, ఎస్టీలకు మెరుగైన భద్రత రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీల భద్రతకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తోంది. వారిపై దాడులు, వేధింపులకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటోంది. ప్రజల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. దాడులు, వేధింపుల కేసుల్లో తక్షణం ఎఫ్ఐఆర్లు నమోదవుతున్నాయి. దర్యాప్తు వేగంగా చేస్తూ త్వరితగతిన చార్జిషీట్లు దాఖలు చేస్తోంది. దాంతో గతంతో పోలిస్తే రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలపై దాడులు, వేధింపుల కేసులు గణనీయంగా తగ్గాయి. 2019లో 2,382 కేసులు నమోదు కాగా 2022లో 2,229 కేసులకు తగ్గాయి. 2022 మొదటి త్రైమాసికంతో పోలిస్తే 2023 మొదటి త్రైమాసికంలో 15 శాతం కేసులు తగ్గాయి. గంజాయి, నాటు సారాపై ఉక్కుపాదం గంజాయి, నాటుసారా, అక్రమ మద్యం, ఇసుక అక్రమ రవాణా కట్టడిని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకోసం కొత్తగా ‘స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(ఎస్ఈబీ)ని ఏర్పాటు చేసి మరీ పటిష్ట కార్యాచరణకు ఉపక్రమించింది. ఆంధ్ర – ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో దశాబ్దాలుగా వేళ్లూనుకున్న గంజాయి దందాను కూకటివేళ్లతోసహా పెకలించి వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ పరివర్తన్ దేశంలోనే రికార్డు సృష్టించింది. ముందుగా గిరిజనులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. గంజాయి సాగు ప్రాంతాలను శాటిలైట్ మ్యాపింగ్ చేసి ప్రత్యేక బృందాలను నియమించి మరీ కట్టడి చేసింది. మొత్తం 384 గ్రామాల్లో మూడు దశల్లో ఆపరేషన్ పరివర్తన్ నిర్వహించింది. మొత్తం 9,093 ఎకరాల్లో ఏకంగా రూ.11,659 కోట్ల విలువైన గంజాయి సాగును ధ్వంసం చేసింది. స్మగ్లింగ్ను అడ్డుకుని భారీగా స్వాధీనం చేసుకున్న గంజాయిని కాల్చివేసింది. 2022లో 2 లక్షల కేజీలు, 2023లో ఇప్పటివరకు 3.32 లక్షల కేజీల గంజాయి నిల్వలను కాల్చి బూడిద చేసింది. ♦ దశాబ్దాలుగా గంజాయి సాగే జీవనాధారంగా చేసుకున్న గిరిజనుల జీవితాల్లో రాష్ట్ర ప్రభుత్వం కొత్త వెలుగులు తీసుకొచి్చంది. ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా వారిని ప్రోత్సహిస్తోంది. గతంలో గంజాయి సాగు చేసిన 7,328 ఎకరాల్లో కాఫీ, నిమ్మ, జీడి, కొబ్బరి, రాజ్మా, బత్తాయి వంటి పంటలు సాగు చేస్తుండటం ప్రభుత్వం తీసుకువచ్చిన మార్పునకు నిదర్శనం. ♦ అదే రీతిలో నాటుసారా దందాపై కూడా ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. నాటుసారా తయారీ కేంద్రాలుగా గుర్తింపు పొందిన మొత్తం 2,202 గ్రామాల్లో ఏకంగా 2,184 గ్రామాల్లో సారా బట్టీలన్నవే లేకుండా చేసింది. నాటు సారా కాచే వారిని ప్రత్యామ్నాయాల వైపు మళ్లిస్తోంది. మిగతా కొద్ది గ్రామాల్లోనూ త్వరలోనే నాటు సారా రూపుమాపడానికి చర్యలు చేపట్టింది. ఈ నాలుగేళ్లలో నాటు సారా, అక్రమ మద్యం దందాపై విస్తృతంగా దాడులు నిర్వహించి పెద్ద ఎత్తున కేసులు నమోదు చేసింది. 2019లో 527 కేసులు, 2020లో 922 కేసులు, 2021లో 1,691 కేసులు, 2022లో 1,379 కేసులు నమోదు చేయడం విశేషం. దాంతో రాష్ట్రంలో నాటుసారా, అక్రమ మద్యం దందా గణనీయంగా తగ్గింది. 2023లో ఇప్పటివరకు 497 కేసులే నమోదు కావడమే దీనికి నిదర్శనం. పదే పదే అక్రమ రవాణాకు పాల్పడేవారిపై పీడీ యాక్ట్ కింద ఇప్పటివరకు 705 కేసులు నమోదు చేయడం గమనార్హం. రహదారి భద్రతకు ప్రాధాన్యం ఎక్కువమందిని బలిగొంటున్న రోడ్డు ప్రమాదాల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం పోలీస్, రవాణా, ఆర్ అండ్ బి, వైద్య – ఆరోగ్య శాఖలతో సంయుక్త కార్యాచరణ చేపట్టింది. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రదేశాలను గుర్తించి దిద్దుబాటు చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా రహదారులపై బ్లాక్ స్పాట్లను జియో ట్యాగింగ్ చేసి ట్రాఫిక్ను పర్యవేక్షిస్తోంది. ఆ ప్రదేశాల్లో ప్రత్యేక బోర్డులు ఏర్పాటు, ట్రాఫిక్ నియంత్రణ, ప్రత్యేకంగా అంబులెన్స్ల ఏర్పాటు మొదలైన చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. రాష్ట్రంలో 2019లో 20,575 రోడ్డు ప్రమాదాలు నమోదు కాగా 2022నాటికి 19వేలకు తగ్గాయి. హత్యలు, ఘర్షణలు కట్టడి ప్రభుత్వ చర్యలతో రాష్ట్రంలో నాలుగేళ్లుగా హత్యలు, ఘర్షణలు గణనీయంగా తగ్గాయి. 2018తో పోలిస్తే 2022కి రాష్ట్రంలో హత్యలు 6 శాతం తగ్గగా, అల్లర్లు 36 శాతం తగ్గాయి. 2022 మొదటి త్రైమాసికంతో 2023 మొదటి త్రైమాసికాన్ని పోలిస్తే హత్యలు 15 శాతం తగ్గాయి. సైబర్ నేరాల కట్టడి యావత్ ప్రపంచానికే సవాల్గా మారిన సైబర్ నేరాల కట్టడిలోనూ రాష్ట్ర పోలీసు శాఖ ముందుంది. సైబర్ నేరాల కట్టడికి పోలిసు శాఖ ప్రత్యేక కార్యాచరణను చేపట్టింది. రాష్ట్ర, జిల్లా స్థాయిలో సైబర్ సెల్స్, సోషల్ మీడియా సెల్స్ ఏర్పాటు చేసింది. ప్రత్యేకంగా సైబర్ మిత్ర యాప్, 1930 రిపోర్టింగ్ సెల్ సెంటర్లను నెలకొల్పింది. సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్లను ఏర్పాటు చేసింది. లోన్ యాప్ల వేధింపుల కట్టడికి ప్రత్యేక సెల్ను ఏర్పాటు చేసి పకడ్బందీగా పర్యవేక్షిస్తోంది. సైబర్ నేరాల బాధితులు గతంలో ఫిర్యాదు చేసేందుకు సరైన వ్యవస్థ ఉండేది కాదు. ఇప్పుడు బాధితులు ఫిర్యాదు చేసేందుకు ఓ వ్యవస్థను ఏర్పాటు చేయడంతోపాటు కేసుల దర్యాప్తు కోసం ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పింది. శాంత్రిభద్రతల పరిరక్షణకు అగ్ర ప్రాధాన్యం రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ యంత్రాంగం అత్యధిక ప్రాధాన్యమిస్తోంది. ఘర్షణలు, అల్లర్లు, హత్యలను సమర్థంగా కట్టడి చేస్తున్నాం. సైబర్ నేరాలు, లోన్ యాప్ మోసాల కట్టడికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టాం. గంజాయి, నాటు సారా కట్టడికి విజయవంతంగా నిర్వహించిన ఆపరేషన్ పరివర్తన్ దేశంలోనే రికార్డు సృష్టించింది. – డీజీపీ కేవీ రాజేంద్రానాథ్ రెడ్డి ప్రజల భద్రతకు భరోసానిస్తున్నారు రాష్ట్రంలో నాలుగేళ్లుగా శాంతి భద్రతలు గణనీయంగా మెరుగయ్యాయి. ఘర్షణలు, అల్లర్లకు అవకాశం లేకుండా పోలీసు వ్యవస్థ సమర్థంగా పని చేస్తోంది. బాధితుల ఫిర్యాదులపట్ల సానుకూలంగా స్పందిస్తూ తక్షణ చర్యలు తీసుకుంటున్నారు. అవసరానికి మేమున్నాం అనే నమ్మకాన్ని పోలీసు యంత్రాంగం కల్పిస్తోంది. – డా.ర్యాలీ శ్రీనివాస్, గోదావరి కవి, తెలుగు అధ్యాపకుడు, రామచంద్రాపురం, కోనసీమ జిల్లా ప్రశాంత పరిస్థితులు నెలకొల్పారు ప్రజలు ప్రశాంతంగా జీవనం సాగించే సానుకూల పరిస్థితులను రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా పోలీసుల ద్వారా పోలీసు వ్యవస్థను ప్రజల ముంగిటకు తీసుకురావడం గొప్ప విప్లవాత్మకమైన మార్పు. దాంతో ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే విధానం ఆచరణలోకి వచ్చింది. ఇది ప్రజలకు ఎంతో మేలు చేస్తుంది. –సి. స్వరాజ్యలక్ష్మి, రిటైర్డ్ ప్రిన్సిపల్, శ్రీ పద్మావతి డిగ్రీ–పీజీ కళాశాల, తిరుపతి -
ఏపీలో భారీగా గంజాయి దహనం
-
ఏపీ: ఆపరేషన్ పరివర్తన్ రెండోదశ సక్సెస్
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో గంజాయి సాగు, అక్రమ రవాణాను నిరోధించడానికి పోలీసు శాఖ కార్యాచరణను వేగవంతం చేసింది. అందుకోసం చేపట్టిన ఆపరేషన్ పరివర్తన్ రెండోదశను కూడా విజయవంతంగా నిర్వహించింది. మొత్తం 650 ఎకరాల్లో గంజాయి సాగును ధ్వంసం చేసింది. ఈ సందర్భంగా విశాఖ రేంజ్ డీఐజీ హరికృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. ఐదు జిల్లాలకు సంబంధించి దాదాపు 2 లక్షల కిలోల గంజాయిని పట్టుకున్నాము. దీనిలో 90 శాతం గంజాయి ఒరిస్సా నుండి వచ్చింది. పరేషన్ పరివర్తన ద్వారా గత ఏడాది 7500 ఎకరాల్లో గంజాయిని నిర్మిలించాము. ఈ ఏడాది 650 ఎకరాల్లో ఆపరేషన్ పరివర్తన ద్వారా గంజాయి నిర్మిలించాము. గంజాయి ధ్వంసం చేసిన 7500 ఎకరాల్లో ఆల్టర్ నేట్ పంటలు వేసుకునేలా ప్రోత్సహించడం జరుగుతుంది. 3500 మందిని గంజాయి కేసుల్లో అరెస్ట్ చేయడం జరిగింది. ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి తరలి రాకుండా 14 చెక్ పోస్టులు ఏర్పాటు చేశాము. ఒరిస్సా పోలీసులతో సమన్వయం చేసుకుంటూ గంజాయి రవాణా అరికడుతున్నాము. ఆపరేషన్ పరివర్తన్ నిరంతర ప్రక్రియ. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి గంజాయి తోటలను నాశనం చేస్తున్నాము. గతంలో కూడా 2 లక్షల ఎకరాల గంజాయిని ధ్వంసం చేశాము. ఆపరేషన్ పరివర్తన్ రెండోదశ విజయవంతం.. ఒడిశా సరిహద్దుల్లోని అత్యంత మారుమూల గిరిజన ప్రాంతాల్లో అక్కడక్కడ గుట్టుగా సాగుతున్న గంజాయి సాగును కూడా పూర్తిగా నిర్మూలించడానికి పోలీసు శాఖ ఆపరేషన్ పరివర్తన్ రెండోదశను తాజాగా విజయవంతంగా పూర్తిచేసింది. ఈ నెలలో ఆంధ్రా–ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లోని మారుమూల ప్రాంతాల్లో ఐదురోజులపాటు ఒడిశా అధికారుల సమన్వయంతో ఈ ఆపరేషన్ను విజయవంతంగా నిర్వహించారు. మరోవైపు రాష్ట్రంలో గంజాయి అక్రమ రవాణాను పోలీసు శాఖ సమర్థంగా కట్టడి చేసింది. ఒడిశా అధికారులతో కలిసి ఏవోబీ పరిధిలో ఆరుమార్గాల్లో ప్రత్యేక చెక్పోస్టులు ఏర్పాటుచేసి తనిఖీలు ముమ్మరం చేసింది. ఇలా వివిధ మార్గాల్లో అక్రమంగా రవాణా చేస్తున్న 2,45,832 కిలోల గంజాయిని పోలీసు శాఖ స్వాధీనం చేసుకుంది. అందులో 70 శాతం గంజాయి ఒడిశా నుంచి మన రాష్ట్రం ద్వారా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నదే కావడం గమనార్హం. ఈ విధంగా ఆపరేషన్ పరివర్తన్ కింద ధ్వంసం చేసిన గంజాయి, దాడులు నిర్వహించి స్వాధీనం చేసుకున్న గంజాయిని పోలీసు శాఖ దహనం చేస్తోంది. ఏలూరు రేంజ్ పరిధిలో శుక్రవారం కాల్చేసింది. -
ఆపరేషన్ పరివర్తన్ విజయవంతం
నెల్లూరు(క్రైమ్): నాటు సారారహిత గ్రామాలే లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ పరివర్తన్–2 జిల్లాలో విజయవంతమైంది. ప్రభుత్వ ఆదేశాలతో ఏప్రిల్ 15వ తేదీ నుంచి రెండునెలలపాటు ఎస్పీ సీహెచ్ విజయారావు పర్యవేక్షణలో సెబ్ జేడీ కె.శ్రీలక్ష్మి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా సారా తయారీ, విక్రయ, అక్రమరవాణా అధికంగా జరిగే ప్రాంతాలను గుర్తించారు. పక్కా ప్రణాళికతో ఆయా ప్రాంతాల్లో సెబ్, పోలీసు అధికారులు సంయుక్తంగా దాడులు చేసి నాటు సారాను స్వాధీనం చేసుకోవడంతోపాటు బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. మరోవైపు కార్డన్ సెర్చ్లు చేశారు. అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. నాటుసారా నిర్మూలనతోపాటు వ్యాపారుల్లో మార్పు తీసుకొచ్చేందుకు అవగాహన సదస్సులు నిర్వహించారు. సారాకు బానిసలు కావొద్దని యువతకు సూచించారు. తమ ప్రాంతాల్లో సారా తయారీకి ఒప్పుకోమని గ్రామస్తులతో ప్రమాణాలు చేయించారు. సారా వ్యాపారం మానుకున్న వారికి ఉన్నతాధికారులతో మాట్లాడి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపిస్తామని ఇచ్చిన హామీలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. 81 కేసులు ఏప్రిల్ 15వ తేదీ నుంచి ఇప్పటివరకు 81 కేసులు నమోదు చేసి 79 మంది నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 238 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకుని 23 వేల లీటర్ల బెల్లపుఊటను ధ్వంసం చేశారు. 75 కేజీల బెల్లం, రెండు వాహనాలను సీజ్ చేశారు. కొందరు సారా తయారీదారులకు బెల్లం సరఫరా చేసిన ఇద్దరు వ్యాపారులను అరెస్ట్ చేశారు. వారిపై పీడీ యాక్ట్ తొలిసారిగా ఇద్దరిపై పీడీ యాక్ట్ నమోదు చేశారు. పదేపదే నేరాలకు పాల్పడుతున్న బోగోలు మండలం కప్పరాళ్లతిప్పకు చెందిన సముద్రాల దుర్గారావు, మేకల హరీష్పై పీడీ యాక్ట్ పెట్టి కడప కేంద్ర కారాగారానికి తరలించారు. అధికారుల చర్యలతో అక్రమార్కుల వెన్నులో వణుకు మొదలైంది. ఉక్కుపాదం మోపాం ఆపరేషన్ పరివర్తన్–2లో భాగంగా సారా తయారీ, విక్రయాలపై రెండునెలలపాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాం. నిందితులపై కేసులు నమోదుచేయడంతోపాటు తొలిసారిగా ఇద్దరిపై పీడీ యాక్ట్లు నమోదు చేశాం. ఆత్మకూరు ఉప ఎన్నిక పూర్తయింతే వరకు దాడులు కొనసాగుతూనే ఉంటాయి. మత్తు పదార్థాలు, నిషేధిత పొగాకు ఉత్పత్తుల విక్రయాలు, చట్టవ్యతిరేక కార్యకలాపాలపై నిఘా పెంచాం. ఈ తరహా నేరాలు జరుగుతన్నట్లు ప్రజలు గుర్తిస్తే డయల్ 100 లేదా స్థానిక పోలీసులు, సెబ్ «అధికారులకు సమాచారం అందిస్తే తగిన చర్యలు తీసుకుంటాం. – శ్రీలక్ష్మి, సెబ్ జేడీ