breaking news
new substations
-
పట్టణాలకు వెలుగులు
మెరుగైన విద్యుత్ సరఫరా కోసం ఏర్పాట్లు ఎన్పీడీసీఎల్ పరిధిలో రూ.200 కోట్లతో పనులు 33 నగరాలు, పట్టణాల్లో కొత్త సబ్స్టేషన్లు, అదనపు ట్రాన్స్ఫార్మర్లు కేంద్రం సాయంతో ప్రత్యేక ప్రాజెక్టు అమలు వరంగల్ : దేశంలోని ప్రతీ ఇంటికి మెరుగైన విద్యుత్ సరఫరా చేయడం లక్ష్యంగా కేంద్రప్రభుత్వం సమగ్ర విద్యుత్ అభివృద్ధి పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాలకు భారీగా మేలు జరగనుంది. ప్రతీ నగరం, పట్టణంలో అవసరాలకు సరిపడా విద్యుత్ సరఫరా కోసం మెరుగైన ఏర్పాట్లను ఈ పథకం ద్వారా చేపడుతారు. ప్రస్తుత, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు, ప్రతీ కాలనీలో విద్యుత్ సరఫరా లైన్లను ఏర్పాటు చేయనున్నారు. ఇలా కేంద్రప్రభుత్వ పథకం ద్వారా డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ సరఫరా చేసేలా వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ఉత్తర మండల విద్యుత్ పంపిణీ సంస్థ(ఎన్పీడీసీఎల్) ఇప్పటికే ప్రణాళికలు రూపొందించింది. ప్రతీ ఇంటికి విద్యుత్ దేశంలోని ప్రతీ ఇంటికి విద్యుత్ సరఫరా చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ విద్యుదీకరణ ప్రాజెక్టును అమలు చేస్తోంది. నగరాలు, పట్టణాలు, పల్లెల్లోని ప్రతీ ఇంటికి కరెంట్ ఇవ్వడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఈ పథకం కింద చేపట్టే పనులకు 60 శాతం నిధులను కేంద్రం మంజూరు చేస్తోంది. మిగిలిన మొత్తాన్ని విద్యుత్ పంపిణీ సంస్థలు(డిస్కం) భరించాల్సి ఉంటుంది. అయితే, విద్యుత్ పంపిణీ సంస్థలు భరించే మొత్తాన్ని రుణాల రూపంలో సమకూర్చుకునే సదుపాయాన్ని కల్పిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ పూచీకత్తుతో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి విద్యుత్ పంపిణీ సంస్థలు ఈ రుణాలను సమకూర్చుకుంటాయి. 17 జిల్లాలు.. 33 పట్టణాలు సమగ్ర విద్యుత్ అభివృద్ధి పథకం కింద తెలంగాణ ఉత్తర మండల విద్యుత్ పంపిణీ సంస్థ(ఎన్పీడీసీఎల్) పరిధిలో విద్యుత్ సరఫరా వ్యవస్థను మెరుగపరిచేందుకు పనులు చేపట్టనున్నారు. ఈ మేరకు 17 జిల్లాల్లోని 33 పట్టణాల్లో ఈ పథకం అమలు కానుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆరు పట్టణాల్లో ఈ పథకం పనులు చేపడుతారు. మొత్తం ప్రాజెక్టు కోసం రూ.200 కోట్లు ఖర్చవుతుందని ఎన్పీడీసీఎల్ ప్రణాళికలు రూపొందించింది. కేంద్ర ప్రభుత్వ వాటా కింద రూ.120 కోట్లు చెల్లిస్తుంది. ఎన్పీడీసీఎల్ మిగిలిన రూ.80 కోట్లను పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రుణాల రూపంలో సమకూర్చుకోనుంది. కాగా, కొత్త ప్రాజెక్టు అమలులో భాగంగా వరంగల్ పట్టణంలో రెండు 33/11 కేవీ సబ్స్టేషన్లు కొత్తగా నిర్మించనున్నారు. ఇంకా మిగిలిన జిల్లాల్లోనూ సబ్ స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లతో పాటు కొత్త లైన్లను ఏర్పాటుచేస్తారు. -
రాజధానికి కొత్త సబ్స్టేషన్లు
తుళ్లూరు, ఐనవోలు మధ్య 400 కేవీ సబ్స్టేషన్ అమరావతి, తాడేపల్లి, యూనివర్సిటీల దగ్గర 130 కేవీ రాజధాని జోన్ అంతటా భూగర్భ కేబుల్ లైన్లు నగరం పూర్తయితే పదేళ్ల వరకూ 500 మెగావాట్ల లోడ్ అంచనా రూ.800 కోట్లతో పూర్తయ్యే పనులకు విద్యుత్ శాఖ ప్రతిపాదనలు సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధాని కోసం కొత్తగా విద్యుత్ సబ్స్టేషన్లు రూపుదిద్దుకోనున్నాయి. రాగల పదేళ్లలో పెరిగే జనావాసాలు, నిర్మితమయ్యే ప్రభుత్వ కార్యాలయాలు, వాణిజ్య సముదాయాలకు సరిపడా విద్యుత్ను సరఫరా చేసేందుకు విద్యుత్శాఖ సిద్ధమవుతోంది. సుమారు 500 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ను అందుకునేందుకు వీలుగా తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి, అమరావతి ప్రాంతాల్లో నూతన సబ్స్టేషన్లు, భూ గర్భ కేబుల్ లైన్లు, విద్యుత్ ఫీడర్లు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు తయారు చేస్తోంది. రాజధాని జోన్లో మొత్తం రూ.800 కోట్ల విలువైన పనులు చేపట్టేందుకు డీపీఆర్ (డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు) సిద్ధం చేస్తోంది. రాజధాని ప్రతిపాదిత తుళ్లూరు, మంగళగిరి ప్రాంతాల్లో ల్యాండ్ పూలింగ్కు ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. వచ్చే నెలలో సింగపూర్ ప్రతినిధి ఖూ టెంగ్ షీ పర్యటన ముగిశాక నూతన రాజధాని రూపకల్పనకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ సిద్ధమవుతుంది. ప్రభుత్వ కార్యాలయాలు, రోడ్లు, వాణిజ్య సముదాయాలు, పరిపాలనా భవనాలు ఎక్కడ ఉంటాయో నిర్ణయించాక ఆ ప్రాంతాలకు ఎంతమేర విద్యుత్ అవసరమో ఒక అంచనా వస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న విద్యుత్ శాఖ అధికారులు కొత్త సబ్స్టేషన్ల ఏర్పాటుకు రంగంలోకి దిగారు. హైదరాబాద్కు చెందిన కన్స్ట్రక్షన్స్ విభాగం చీఫ్ ఇంజనీర్ దేవానంద్ బృందం రెండు రోజుల కిందట తుళ్లూరు మండలంలో పర్యటించి సబ్స్టేషన్ల నిర్మాణానికి అనువైన ప్రాంతాలను పరిశీలించింది. ఐనవోలు ప్రాంతంలో కనీసం 20 ఎకరాలన్నా అందిస్తే గ్యాస్ ఇన్సులేటెడ్ ఇండోర్ సబ్స్టేషన్ అయినా నిర్మించాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం రూ.300 కోట్లు ఖర్చు కావచ్చని సీఈ దేవానంద్ చెప్పారు. తాడేపల్లి దగ్గరున్న 130 కేవీ సబ్స్టేషన్ను 220 కేవీగా మార్చాలని నిర్ణయించారు. అమరావతి, అచ్చంపేట ప్రాంతాలతో పాటు అసెంబ్లీ సమావేశాలు జరుప నిశ్చయించిన నాగార్జునా యూనివర్సిటీ ప్రాంతంలో 130 కేవీ సామర్థ్యంగల 4 సబ్స్టేషన్లు నిర్మించేందుకు అధికారులు ప్రతిపాదనలు తయారు చేశారు. ప్రతిపాదిత రాజధాని జోన్లోని అన్ని క్లస్టర్లలోనూ అభివృద్ధి చేసే రోడ్ల కింద భూగర్భ కేబుల్ లైన్లు నిర్మించి విద్యుత్ సరఫరా చేయడానికి ప్రతిపాదనలు తయారు చేస్తున్నారు. అలాగే రాజధాని ప్రాంతంలోని వ్యవసాయ భూముల్లో సుమారు ఐదువేలకు పైగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిని ఐదేళ్ల పాటు అలాగే ఉంచి నీటి అవసరాలకు వినియోగించవచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ నెల 24, 25 తేదీల్లో మరోసారి రాజధాని జోన్లో పర్యటించే విద్యుత్ అధికారుల బృందం ఈ నెలఖారులోగా డీపీఆర్ నివేదికను ప్రభుత్వానికి అందజేసే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు.