చంపేస్తామంటూ ఎమ్మెల్యేకు బెదిరింపు
‘ నీవు దళితుడివి కాదు.. బుడగ జంగమ సముదాయానికి చెందిన వాడివి. వెంటనే నీ పదవికి రాజీనామా చేయాలి. లేకుంటే నిన్నూ.. నీ కుటుంబాన్ని చంపేస్తాం ’ అంటూ ముళబాగిలు ఎమ్మెల్యే కొత్తూరు మంజునాథ్కు దళిత రక్షణా సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణస్వామి రాసినట్లు ఓ బెదిరింపు లేఖ చేరింది. కర్ణాటక దళిత రక్షణా సమితి లెటర్ హెడ్లో టైపు చేసిన అక్షరాలతో ఈ లేఖ ఉంది. లెటరు కింద నారాయణస్వామి సంతకం కూడా ఉంది. ఈ లేఖ గత శుక్రవారమే ఎమ్మెల్యేకు అందింది. ఆయన ఫిర్యాదు మేరకు జిల్లా పోలీసులు సోమవారం ఉదయం నారాయణస్వామిని అదుపులోనికి తీసుకున్నారు.
అసెంబ్లీలో చర్చిస్తా : మంజునాథ్
దీనిపై ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ‘ ఆ లేఖ ముళబాగిలులోని నా కార్యాలయానికి చేరింది. దీనిపై దర్యాప్తు చేయాల్సిందిగా పోలీసులకు ఫిర్యాదు చేశాను. ఈ విషయాన్ని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లా. అసెంబ్లీలోనూ చర్చిస్తా’ అని చెప్పారు.
ఆ లేఖ నేను రాయలేదు : నారాయణస్వామి
దళిత రక్షణా సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ.. ‘ ఆ లేఖ నేను రాయలేదు. ఎవరో గిట్టని వారు చేసిన పని అది. అందులోని సంతకం నాది కాదు. ఎస్పీ కార్యాలయంలో జరిగిన విచారణలోనూ అది నా సంతకం కాదని తేలింది. దీనిపై ఇంకా సమగ్ర దర్యాప్తు జరిగితే నిజాలు వెలుగు చూస్తాయి’ అని చెప్పారు.