breaking news
Milk cooling center
-
పాడి రైతులకు గుర్తింపు కార్డులు
జహీరాబాద్ టౌన్: పాడి రైతులకు గుర్తింపు కార్డులు అందజేస్తామని తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య జనరల్ మేనేజర్ (మార్కెటింగ్), జిల్లా ప్రత్యేకాధికారి పవన్ కుమార్ తెలిపారు. జహీరాబాద్లోని పాలశీతలీకరణ కేంద్రంలో శనివారం నిర్వహించిన పాల ఉత్పత్తిదారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గుర్తింపు కార్డులు ఉన్న రైతులకు ప్రభుత్వ పథకాల్లో ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. కార్డుల వల్ల కలిగే ప్రయోజనాలను దాని వెనుక భాగం లో ముద్రించామని తెలిపారు. పాల ఉత్పత్తిదారుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం గిట్టుబాటు ధరతో పాటు లీటరుకు రూ.4 చొప్పున ప్రోత్సాహకాన్ని చెల్లిస్తోందన్నారు. దీనికోసం నిధులను కూడా మంజూరు చేసిందని చెప్పారు. లీడ్ బ్యాంక్ లీకేజీ ద్వా రా పాడి రైతులకు డైరీ యూనిట్లను మంజూరు చేస్తామన్నారు. దీని ద్వారా గ్రామీణ ప్రాంతంలోని యువతకు ఉపాధి లభిస్తుందని తెలిపారు. ముందుగా జిల్లాలోని గజ్వేల్, సిద్దిపేట, జహీరాబాద్, నారాయణఖేడ్, మెదక్లో యూనిట్లను మంజూరు చేయనున్నట్లు చెప్పారు. పాడి పరిశ్రమకు సంబంధించి ఎలాంటి సందేహాలు, సమస్యలు ఉన్నా (9493173769) నంబర్కు ఫోన్ చేయొచ్చని సూచించారు. జిల్లా డిప్యూటీ డైరక్టర్ కామేష్, పాలశీతలీకరణ కేంద్రం మేనేజర్ శంకర్సింగ్, పాల ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షకార్యదర్శులు రాంరెడ్డి, మాణిక్రెడ్డి, సామల నర్సింలు పాల్గొన్నారు. -
పాడి అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి
చెన్నూర్ : జిల్లాలో పాడి అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించింది. పాడి అభివృద్ధి కోసం ప్రతిపాదనలు పంపించాలని జిల్లా ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసింది. యాక్షన్ ప్లాన్ పంపించాలని మండల సమాఖ్యల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్ (పాల శీతలీకరణ కేంద్రం) నిర్వాహకులకు సూచించింది. పాడి రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో 2003లో జిల్లాలో 11 పాల శీతలీకరణ కేంద్రాలు ప్రారంభించారు. పాడి సంపద అంతరిస్తుండడంతో ఆసిఫాబాద్, కాగజ్నగర్, ఉట్నూర్, బోథ్, ఇచ్చోడలోని పాలడెయిరీ కేంద్రాలు మూతపడ్డాయి. ఆదిలాబాద్, నిర్మల్, లక్సెట్టిపేట, చెన్నూర్, భైంసా, కడెం మండలాల్లో కొనసాగుతున్నాయి. వీటి ద్వారా ప్రస్తుతం మూడు నుంచి నాలుగు వేల లీటర్ల పాల సేకరిస్తున్నారు. దీంతో వెయ్యి మందికి పైగా రైతులకు ఉపాధి లభిస్తోంది. రైతుకు మేలు.. పాడి సంపద అభివృద్ధితోనే రైతులకు మేలు జరుగుతోందని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకోసం రైతులకు డీఆర్డీఏ, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గేదెలు, ఆవులు మంజూరు చేసి 20 వేల లీటర్ల పాలు సేకరించాలని సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు పాల డెయిరీ జిల్లా మేనేజర్ గజ్జరామ్ తెలిపారు. పాడి సంపదను అభివృద్ధి చేస్తే జిల్లా వ్యాప్తంగా సుమారు ఐదు వేల మందికి లాభం చేకూరడంతోపాటు ఉపాధి మెరుగయ్యే అవకాశాలున్నాయి. పాల డెయిరీల ఆధునికీకరణ పాల డెయిరీల బలోపేతంలో భాగంగా జిల్లాలోని పాలడెయిరీలను ఆధునికరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. గతంలో పాల సామర్థ్యాన్ని పాల డెయిరీలో పనిచేసే ఉద్యోగులు పరీక్షించే వారు. ఈ పద్ధతికి స్వస్తి పలికి ఈఎంటీ(ఎలక్ట్రానిక్ మెనికో టైసర్) ద్వారా పాలను పరీక్షించాలని పరికరాలు పంపిణీ చేయనుంది. అవసరమైనంత మంది బాలమిత్రలను ఎంపిక చేసి గౌరవ వేతనంతోపాటు ఇన్సెంటివ్ ఇవ్వనుంది.