breaking news
Mile-stone
-
Jasmin Paris: ఒకే ఒక్కరు!
100 మైళ్ల దూరం.. 60 గంటల వ్యవధి. మధ్యలో ఎవ్వరూ మనకు సాయపడరు. పరుగెత్తుతూనే ఉండాలి. ట్రెజర్ హంట్ తరహాలో అక్కడక్కడా ఉన్న పుస్తకాలను వెతికి పట్టుకుంటూ పరుగు ఆపకుండా గమ్యం దిశగా దూసుకెళ్లాల్సిందే. మారథాన్లో భాగంగా పార్క్ చుట్టూతా మొత్తంగా దాదాపు 60,000 అడుగుల ఎత్తును ఎక్కి దిగాలి. అలసటతో ఆగితే ఔటే ఇక. ధృఢ శరీరం మాత్రమే కాదు అంతకుమించిన మనో సంకల్పం తోడుంటేనే మారథాన్లో జయకేతనం ఎగరేయగలం. ప్రపంచంలోనే అత్యంత కఠోరమైన మారథాన్లలో ఒకటిగా పేరొందిన ప్రతిష్టాత్మక బాక్లీ మారథాన్స్లో పురుషులకు దీటుగా మొట్టమొదటిసారిగా ఒక అతివ ఈ రేసులో గెలిచి అబ్బురపరిచింది. అమెరికాలోని టెన్నిస్సీ రాష్ట్రంలోని ఫ్రెజెన్ హెడ్ స్టేట్ పార్క్ ఈ మారథాన్కు వేదికైంది. బ్రిటన్కు చెందిన జాస్మిన్ ప్యారిస్ అనే 40 ఏళ్ల వెటర్నరీ వైద్యురాలు ఈ ఫీట్ సాధించి చరిత్రలో నిలిచిపోయారు. 55 మైళ్లుగా ఉన్న మారథాన్ను 1989 సంవత్సరంలో 100 మైళ్లకు పెంచాక ఇన్నేళ్లలో నిరీ్ణత గడువులోగా మారథాన్ను కేవలం 20 మంది మాత్రమే పూర్తిచేయగలిగారు. వీరిలో జాస్మిన్ ప్యారిస్ ఒక్కరే మహిళ కావడం విశేషం. మారథాన్ను 60 గంటల్లోపు పూర్తిచేయాల్సి ఉండగా ఇంకా 99 సెకన్లు ఉండగానే ఆమె విజయతీరాన్ని తాకారు. 59 గంటల 58 నిమిషాల 21 సెకన్లలో జాస్మిన్ ఈ రేసును శుక్రవారం పూర్తిచేశారు. రాత్రంతా సరైన దారీతెన్నూ లేకున్నా ముళ్లు, పొదల గుండా పరుగెడుతూ ఫినిషింగ్ లైన్ను చేరుకున్న జాస్మిన్ను వేలాది మంది ఔత్సాహికులు తమ హర్షధ్వానాలతో ఉత్సాహపరిచారు. ఈ సంవత్సరం 20 మంది బరిలో దిగగా జాస్మిన్తో కలిపి మొత్తంగా కేవలం ఐదుగురే మారథాన్ను పూర్తిచేయగలిగారు. ‘ ఈ రేసు ఉత్సాహం, ఆందోళనల కలబోత. దాదాపు అసాధ్యమైన రేసు అని తెలుసు. ఆ అసాధ్యమనే భావనే నన్ను ఈ రేసులో పరుగెత్తేలా చేసింది’ అని జాస్మిన్ అన్నారు. అథ్లెట్ గాయాలపాలైనా మధ్యలో ఎవరూ ఎలాంటి సాయం చేయరు. ఫోన్లు ఉండవు, జీపీఎస్ ట్రాకింగ్ ఉండదు. ఎలాంటి నావిగేషన్ వ్యవస్థలు ఉండవు. రెండు చోట్ల మాత్రం తాగు నీరు సదుపాయం ఉంటుంది. ఇద్దరు పిల్లల తల్లి అయిన జాస్మిన్ వృత్తిరీత్యా పశువైద్యురాలు. బ్రిటన్లోని మిడ్లోటియన్లో ఉండే జాస్మిన్ వైద్యవృత్తిని కొనసాగిస్తూనే ఎడిన్బర్గ్లో పరిశోధనా శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. ఆఫ్రికన్–అమెరికన్ పౌరహక్కుల ఉద్యమకారుడు మారి్టన్ లూథర్ కింగ్ జూనియర్ హత్యకేసులో దోషి అయిన జేమ్స్ ఎర్ల్ రే అనే ఖైదీ 1977 ఏడాదిలో అమెరికా జై లు నుంచి పారిపోతూ ఆగకుండా 12 మైళ్లు పరుగెత్తిన ఘటన నుంచి స్ఫూర్తి పొ ంది ఈ మారథాన్ను గ్యారీ క్యాంట్రెల్, కార్ల్ హెన్లు 1986లో ప్రారంభించారు. -
పొవాయి జలాశయంలో బుద్ధుడి విగ్రహం
సాక్షి, ముంబై: దేశ ఆర్థిక రాజాధానిగా వెలుగొందుతున్న ముంబై నగరం త్వరలో మరో మైలు రాయిని అధిగమించనుంది. నగరానికి నీటి సరఫరా చేస్తున్న పొవాయి జలాశయంలో గౌతమ బుద్ధుడి భారీ విగ్రహం త్వరలో సందర్శకులను కనువిందు చేయనుంది. అరేబియా సముద్రంలో మెరైన్డ్రైవ్ వద్ద తీరం నుంచి మూడు కి.మీ. దూరంలో మరాఠీ ప్రజల ఆరాధ్యదైవమైన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన తుది దశకు చేరుకున్న విషయం తెలిసిందే. అయితే పొవాయిలో ఏర్పాటు చేయనున్న బుద్దుని విగ్రహం అందుకు భిన్నంగా ఉంటుంది. హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్లో ఏర్పాటు చేసినభారీ బుద్ధుని విగ్రహంలాగే ఇక్కడా బుద్ధుడి పూర్ణాకార విగ్రహం నెలకొల్పాలని ముంబై శివారు ప్రాంత జిల్లాధికారి నసీంఖాన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్లోని హుస్సేన్సాగర్లో శాంతికి ప్రతీకగా నిలిచిన బుద్ధుని విగ్రహం 105 అడుగుల ఎత్తు ఉంది. దేశ ఆర్థిక నగరంలో ఇలాంటి భారీ విగ్రహాన్ని నెలకొల్పాలని కొన్ని సంస్థలు చాలారోజులుగా డిమాండ్ చేస్తున్నాయి. బీఎంసీకి అనేక అడ్డంకులు ఎదురుకావడంతో ఈ ప్రతిపాదనపై అంతగా ఆసక్తి కనబర్చలేదు. అయితే రాష్ట్ర మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి, శివారు ప్రాంత జిల్లా ఇన్చార్జి మంత్రి నసీంఖాన్ దీనిపై చొరవతీసుకున్నారు. ఇటీవల బీఎంసీ కమిషనర్ సీతారాం కుంటే, సంబంధిత పదాధికారులతో ప్రధాన కార్యాయంలో ఖాన్ సమావేశమయ్యారు. ఇందులో బుద్ధుని విగ్రహాన్ని పొవాయి జలాశయంలో ఏర్పాటుచేయడానికి ఎదురయ్యే ఇబ్బందులపై చర్చించారు. ఇందు మిల్లు స్థలంలో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పేందుకు వివిధశాఖల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకున్నారో అదే తరహాలో సంబంధిత శాఖలతో సంప్రదింపులు జరిపి పొవాయిలో విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నసీమ్ఖాన్ సూచించారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి లభించాల్సిన అన్ని రకాల అనుమతులు లభిస్తాయని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. దీంతో విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ఎట్టకేలకు మార్గం సుగమమైంది.