మేడారం జాతర ఆదాయం రూ. 6,43,79,489
ముగిసిన హుండీల లెక్కింపు
హెచ్డీఎఫ్సీ, ఆంధ్రా బ్యాంకుల్లో జమ చేసిన అధికారులు
హన్మకొండ కల్చరల్, న్యూస్లైన్ : హన్మకొండ లష్కర్బజార్లోని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కల్యాణ మండపంలో ఈ నెల 17న ప్రారంభమైన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర హుం డీల లెక్కింపు సోమవారంతో ముగిసింది. మొత్తం ఆదాయం రూ.6,43,79,489 వచ్చినట్లు దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ దూస రాజేశ్వర్ ప్రకటించారు. కుంకుమ భరిణలు, తొట్టెలు, కన్ను, చేతులు, ఇల్లు వంటి బొమ్మల రూపంలో 895 కిలోల 450 గ్రాముల వెండిని భక్తులు సమర్పించినట్లు తెలిపారు. ఆదాయంతోపాటు వీటిని కూడా ఆంధ్రా, హెచ్డీఎఫ్సీ బ్యాంకుల్లో జమచేసినట్లు వెల్లడించారు. గత ఏడాది కంటే రూ.1.30 కోట్లు ఆదాయం అధికంగా సమకూరినట్లు ఆయన వివరించారు. అదేవిధంగా జాతరలో తలనీ లాల ద్వారా రూ.1.05 కోట్లు, ప్రత్యేక దర్శనాల ద్వారా 69 లక్షలు వచ్చినట్లు పేర్కొన్నారు.
భక్తులు సమర్పించిన కానుకల్లో 50 పురాతన నాణేలు ఉన్నాయని, వీటిని దేవాదాయ శాఖ కార్యాలయంలో ప్రదర్శనకు పెట్టనున్నామ న్నారు. 21 దేశాలకు చెందిన విదేశీ కరెన్సీ నోట్లు వచ్చాయని, వీటిని ఇంకా లెక్కించలేదని వెల్లడించారు. కాగా, ఏడు రోజులుగా సాగిన లెక్కింపును దేవాదాయ, ధర్మాదాయశాఖ మల్టీ జోన్ జాయింట్ డెరైక్టర్ కృష్ణవేణి, దేవాదాయశాఖ ఐదో జోన్ డిప్యూటీ కమిషనర్ తాల్లూరి రమేష్బాబు, రెవెన్యూశాఖ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ డి.శంకర్, ఆర్డీఓ మధుసూదన్, అసిస్టెంట్ కమిషనర్ జి.మల్లేషం పర్యవేక్షించారు. నోట్లు, ఆభరణాల లెక్కింపులో 250 మంది రెవెన్యూ, దేవాదాయశాఖ సిబ్బంది, 30 మంది బ్యాంక్ సిబ్బంది, చిల్లరనాణేల లెక్కింపులో టీటీడీ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో 130 మంది శ్రీ శ్రీనివాస శరణాగతి భజన మండలి సభ్యులు పాల్గొన్నారు. కాగా, హుండీల్లో లభిం చిన బంగారం, వెండిని ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం లెక్కిస్తే మరో రూ.50 లక్షల దాకా ఆదాయం సమకూరే అవకాశం ఉంది.
లెక్కింపు ఇలా...
ఈ నెల 16వ తేదీన మేడారం నుంచి హన్మకొండలోని టీటీడీ కల్యాణమండపానికి హుండీలను ఆర్టీసీ వ్యాగన్ బస్సుల్లో తరలించారు. 17న లెక్కింపు కార్యక్రమాన్ని కలెక్టర్ కిషన్ ప్రారంభించారు.