breaking news
Laila Majnu
-
ఆ ప్రేమ జంట టీ దుకాణానికి వినియోగదారుల క్యూ!
మన దేశంలో టీ అంటే ఇష్టపడనివారు ఎవరూ ఉండరేమో.. తేనీరులో అనేక రకాలు ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కో రుచి అంటే ఇష్టం. ఏదిఏమైనా టీ లేకుండా చాలామందికి రోజు గడవదంటే అతిశయోక్తి కాదు. అయితే ఒక ప్రేమ జంట విక్రయిస్తున్న టీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ఈ ప్రేమ జంట తయారు చేసే టీ, వారు ఏర్పాటు చేసిన టీ స్టాల్ ఎంతో ప్రత్యేకంగా ఉంటూ, అందరినీ ఆకట్టుకుంటున్నాయి. జార్ఖండ్లోని రాంచీలో వీరు ఈ వినూత్న టీ దుకాణాన్ని నడుపుతున్నారు. ప్రేమ జంట మనీష్, పుతుల్ కుమారి ఇద్దరూ కలసి ఈ టీ స్టాల్ను ప్రారంభించారు. ఓ కంపెనీలో కలుసుకున్న వీరు ఈ రోజు సొంతగా టీ దుకాణాన్ని నిర్వహిస్తున్నారు.మనీష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ తాను శారదా గ్లోబల్ యూనివర్సిటీ నుంచి బీటెక్ చేశానని, ఆ తర్వాత గోద్రెజ్ టెక్ మహీంద్రాలో పనిచేశానని తెలిపారు. అదే సమయంలో పుతుల్ను కలిశానని, తాము ప్రస్తుతం రిలేషన్షిప్లో ఉన్నామన్నారు. తాము ఏదో ఒక వ్యాపారం చేయాలని నిర్ణయించుకుని ఈ టీ స్టాల్ ప్రారంభించామన్నారు. ప్రస్తుతం రాంచీలోని తమ స్టాల్ ఎంతో ఆదరణ పొందుతున్నదని, ఇక్కడికి టీ తాగడానికి చాలామంది వస్తుంటారని తెలిపారు.తమ పాకెట్ మనీతో ఈ స్టాల్ ఓపెన్ చేశామని మనీష్ తెలిపారు. చిన్నగా వ్యాపారం ప్రారంభించి, క్రమంగా దానిని విస్తరించాలనుకున్నామన్నారు. తాము మట్టి కుండలో రకరకాల టీలను అందిస్తామని తెలిపారు.ప్రస్తుతం తాము రోజూ సాయంత్రం టీ దుకాణం తెరిచి, 500 కప్పుల టీలు విక్రయిస్తున్నామని తెలిపారు. రాంచీలో మరిన్ని టీ స్టాల్స్ తెరవాలనేది తమ కల అని, ఏ పని అయినా ప్రాణం పెట్టి చేస్తే విజయం సాధిస్తామని మనీష్ తెలిపారు. తాము ఐదేళ్లుగా రిలేషన్షిప్లో ఉన్నామని, భవిష్యత్తులో ఈ సంబంధాన్ని కొనసాగిస్తామని మనీష్ పేర్కొన్నారు. -
లైలా..మజ్ను
చరిత్రలో నిలిచిపోయిన అమర ప్రేమికులలో లైలా, మజ్నుల జంటది ప్రత్యేక స్థానం. అమర ప్రేమికుడు మజ్ను అసలు పేరు కైస్ ఐబిన్ అల్ ముల్లా. కైస్ పుట్టిన వెంటనే అతడి తండ్రి షా అమారి ఓ జ్యోతిష్కుడి దగ్గరకు తీసుకెళతాడు. అప్పుడా జ్యోతిష్కుడు ‘నీ కొడుకు ప్రేమ కోసమే పుట్టాడు’ అని చెప్తాడు. పేదవాడైన అమారికి ఈ ప్రేమ, దోమా అంటే నచ్చదు. అందుకే కుమారుడ్ని ప్రేమ జోలికి పోకుండా చూసుకుంటుంటాడు. కైస్ పెరిగి పెద్దవాడైన తర్వాత.. ఓ రోజు మసీదు వద్ద లైలాను చూసి తొలిచూపులోనే ప్రేమలో పడతాడు.. ఆమెను మెప్పించి తన ప్రేమలో పడేస్తాడు. స్వతహాగా కవి అయిన కైస్..లైలా మీద ప్రేమ పద్యాలు, కవితలు రాసి ఆమెకు అంకితమిస్తుంటాడు. అతడి స్నేహితులకు విషయం తెలిసి కైస్ను ఆటపట్టిస్తుంటారు. ఇద్దరూ తలమునకలయ్యే ప్రేమలో తేలిపోతుంటారు. ఆమె తండ్రి దగ్గరకు వెళ్లి కూతుర్ని తనకిచ్చి పెళ్లి చేయమని కైస్ అడుగుతాడు. కానీ, ఒకే జాతికి చెందినప్పటికి హోదాలు వేరైన కారణంగా వీరి పెళ్లికి లైలా తండ్రి అంగీకరించడు. ఒకరినొకరు చూసుకోకుండా దూరం చేస్తాడు. ఆ వెంటనే సంపన్నుడైన వ్యక్తికి లైలాను ఇచ్చి పెళ్లిచేస్తాడు. లైలాకు పెళ్లి జరిగిపోయిందని తెలుసుకున్న కైస్ గుండె ముక్కలవుతుంది. ఆమె కోసం పిచ్చివాడిలా తయారవుతాడు. రేయి, పగలు అని తేడా లేకుండా ఇసుకలో లైలా పేరును రాస్తూ గడుపుతుంటాడు. అక్కడ లైలా పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. రాజభోగాల మధ్య ఉన్నా ముళ్లమీద కూర్చున్నట్లుగానే ఉంటుంది ఆమెకు. మనసు ఎల్లపుడూ కైస్ చుట్టూనే తిరుగుతుంటుంది. కొన్నేళ్లకు భర్తతో కలిసి ఆమె ఇరాక్ వెళ్లిపోతుంది. కొద్దిరోజులకే అక్కడ అనారోగ్యం కారణంగా లైలా కన్నుమూస్తుంది. లైలా మరణవార్త తెలుసుకున్న కైస్ మిత్రులు విషయం అతడికి చెప్పాలని ఎంతో ప్రయత్నిస్తారు. కానీ, కైస్ జాడ దొరకదు. కొద్దిరోజుల తర్వాత ఓ చోట కైస్ ఆచూకీని కనుగొంటారు. వాళ్లు అక్కడికి వెళ్లి చూడగా.. కైస్! లైలా సమాధి దగ్గర ప్రాణం లేకుండా పడి ఉంటాడు. లైలా కోసం పిచ్చివాడిలా తిరగటం వల్లే కైస్కు మజ్ను అనే పేరు వచ్చింది. ‘‘మజ్ను లైలా’ అంటే లైలా కోసం పిచ్చివాడిలా తిరిగిన వాడు అని అర్థం వస్తుంది. లైలా.. మజ్నులు మరణించి వందల ఏళ్లు అవుతున్నా.. ప్రేమ రూపంలో శాశ్వత స్మరణీయులే. -
అక్కినేని చిత్రాలు...మేలిమి ముద్రలు
తెలుగు చలనచిత్ర చరిత్రలో లెజెండ్ ఏఎన్నార్. 255 చిత్రాల కథానాయకుడు(‘మనం’ మినహాయించి). వాటిల్లో 25 మేటి భూమికల అభినయ విశేషాలను తెలిపే చిరు ప్రయత్నమిది. భరణీ సంస్థ నిర్మించిన తెలుగు, తమిళ భాషల్లో తొమ్మిది చిత్రాల్లో నటించారు అక్కినేని. చిత్రత్రయం లైలా-మజ్ను, విప్రనారాయణ, బాటసారి తన నట జీవితంలో చిరస్మరణీయమని పలుమార్లు ఆయనే చెప్పారు. 1. లైలా మజ్ను (1949): అక్కినేని హీరోగా నటించిన పదవ చిత్రం. సమ వయస్కురాలైన భానుమతి కాంబినేషన్లో విషాద ఛాయలున్న ఖయస్ నటనలో పరిణతి కోసం, హీరోలో ఉన్న బిడియం పోవటం కోసం వీరిద్దరినీ బీచ్లో షికార్లు చేయమని, చనువు ఏర్పడటంతో నటన బాగుంటుందని ప్రోత్సహించారు దర్శకులు రామకృష్ణ. ‘పలుకవే నా ప్రేమ సితార’ అంటూ లైలాతో తిరుగుతూ గీతం పాడినప్పుడు ఎంత హుషారుగా ఉంటాడో, ఆమె మరొకరిని వివాహమాడి ఇరాక్కు వెళ్లినప్పుడు ఆమెను జనానా వద్ద చూసి ఖిన్నుడై, ‘జీవన మధు భాండమే పగిలె తునాతునకలై’ అని విషాద భావాలు అంత గొప్పగా పలికించారు. 2. విప్రనారాయణ (1954): ‘తార్కిక భావాలున్న నువ్వు భక్తుడైన విప్రనారాయణ పాత్ర ధరించడమేమి’టని విమర్శించిన దర్శకులు కె.వి.రెడ్డి అంచనాలను తారుమారు చేస్తూ ఆనాటి విప్రనారాయణుడు అక్కినేనే అన్నంత ఘనంగా ఆ పాత్రను పోషించారు. శుశ్రూషలు చేసిన దేవదేవి నయగారాలకు వివశుడై, ‘మధురమధురమీ చల్లని రేయి’ అని ఆనందాన్ని వ్యక్తం చేసిన విప్రనారాయణుడు... తనపై మహారాజు దొంగతనం నేరం మోపినప్పుడు, ఈ శిక్ష తనకు తగినదేనని పశ్చాత్తాపపడినప్పుడు పాత్రలో లీనమైపోయారు. 3. బాటసారి (1961): శరత్చంద్ర బెంగాలీలో రాసిన ‘బడదీది’ ఆధారం. సురేంద్ర జమీందారు బిడ్డ. ఉన్నత చదువులున్నా లోకజ్ఞానం అంతంతే! చిత్రమంతా కలిపి కేవలం రెండు మూడు పేజీల డైలాగులే! అవి కూడా పొడి పొడి మాటలు. తనవల్ల తన ఆరాధ్య దేవత మాధవికి అన్యాయం జరిగిందని తెలిసినప్పుడు ఆవేశం పతాక స్థాయిని చేరి, ఆమె ఒడిలో తలదాల్చి, తన మనసును ఆవిష్కరించి అంతిమ శ్వాస విడిచిన సన్నివేశం అమోఘం. 4. పౌరాణికం - భూకైలాస్ (1958): అక్కినేని పౌరాణికాల్లో ‘భూకైలాస్’లోని నారద పాత్ర యెన్నదగినది. శివభక్తి పరాయణుడైన రావణబ్రహ్మను నిలువరించి, హెచ్చరించి, లోకానికి మేలు చేసే విధంగా రచయిత మలచిన, నారద పాత్రలోని యుక్తి, ఛలోక్తి అన్నిటినీ రసవత్తరంగా తన నటనలో చూపారు. 5. జానపదం- సువర్ణసుందరి (1957): ‘సువర్ణ సుందరి’లోని జయంత్ పాత్ర సాదాసీదా అంటారు అక్కినేని. కానీ ఎన్నో షేడ్స్ ఉన్నాయి. తొలి దశలో అందాల రాకుమారుడు. సువర్ణ సుందరిని దివి నుంచి భువికి రప్పించిన శృంగార నాయకుడు. దుష్ట త్రయానికి (కైలాసం, చాదస్తం, ఉల్లాసం) బుద్ధి చెప్పిన ధీరోదాత్తుడు. అంజలీ సంస్థ ఈ చిత్రాన్ని హిందీలో నిర్మించినప్పుడు అక్కినేనిని బలవంతంగా ఒప్పించారు నిర్మాత. సూపర్ హిట్టయిన ఆ చిత్రం అక్కినేని నట జీవితంలో ఏకైక హిందీ చిత్రంగా నిలిచిపోయింది. 6. జయభేరి (1959): జానపదం అనగానే మంత్రాలు, మాయలు, కత్తియుద్ధాలు అనే నానుడిని పూర్వ పక్షం చేస్తూ సంగీత, సాహిత్యాలతో కూడా జానపదం తీసి రంజింపచేయొచ్చు అని నిరూపించిన చిత్రం ‘జయభేరి’. సంగీత విద్వాంసుడు కాశీనాథ్ పాత్రకు ప్రాణప్రతిష్ట చేశారు అక్కినేని. ‘రసికరాజ తగువారము కామా’ పాట చిత్రీకరణలో, చరణదాసి సంగీత ఆరోహణ అవరోహణ విన్యాసాలకు తగ్గట్టు పెదవుల కదలిక కోసం ఇంటివద్ద అద్దం ముందు నిలబడి రెండు రోజులు ప్రాక్టీస్ చేశారు. 7. చారిత్రకం- అనార్కలి (1955): మొగల్ యువరాజు సలీం సామాన్య నర్తకి అనార్కలిని ప్రేమించి, తండ్రితో యుద్ధానికి తలపడ్డ సన్నివేశాల్లో శృంగారం, ఆవేశం సమపాళ్లలో అభినయించారు. అక్బరు చక్రవర్తి స్వయంగా మరణశిక్ష అమలుపరచటానికి సిద్ధపడ్డ సన్నివేశంలో ‘బలహీనులు కాకండి జహాపనా’ అంటూ సెంటిమెంటుతో తండ్రిని కలవర పరచిన సన్నివేశంలో ఎస్.వి.రంగారావుకు దీటుగా నటించారు అక్కినేని. 8. తెనాలి రామకృష్ణ (1956): చతుర చమత్కార కవి తెనాలి రామకృష్ణుని తన అభినయంతో ఆంధ్ర ప్రేక్షకులకు అందించారు అక్కినేని. తెలివిగా రాజసభలో ప్రవేశించి, క్లిష్టమైన ఏనుగుల పంపకాన్ని యుక్తితో పరిష్కరించటం, కృష్ణసాని ద్వారా రాయలకు కలగబోయే ముప్పును ఆడ వేషంలో పరిష్కరించటం, ‘మేక తోకకు మేక’ అంటూ ముప్పతిప్పలు పెట్టటం, పతాక సన్నివేశంలో తోటమాలి వేషంలో ‘చేసేది ఏమిటో చేసెయ్యి సూటిగా’ అంటూ పాడి చక్రవర్తి బాబరు మెప్పు పొంది రాజ్యాన్ని రక్షించటం - ఈ సన్నివేశాల్లో తెనాలి రామకృష్ణుని సాక్షాత్కరింపజేశారు. 9. మహాకవి కాళిదాసు (1960): అజ్ఞానుడైన కాళునిగా ‘ఛాంగుభళా వెలుగు వెలగరా నాయనా’ అంటూ ఎంత అమాయకంగా నటించారో... దేవి కటాక్షంతో విజ్ఞాన దీపం వెలిగి, శ్యామలా దండకం చదివిన పండితునిగానూ ఓహో అనిపించారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ‘కాళిదాస కౌస్తుభ’ పురస్కారంతో అక్కినేనిని సత్కరించింది. 10. అమరశిల్పి జక్కన (1964): ‘ఈ నల్లని రాళ్లలో ఏ కన్నులు దాగెనో’ అని కీర్తించి, నర్తకి మంజరిని ఆరాధించి, పెళ్లాడి, ఆ తర్వాత మహారాజు ఎదుట నర్తించినందుకు అనుమానించి, దూరంగా వెళ్లిపోయి, కాలం గడిచాక కుమారుడి చేతిలో శిల్పిగా ఓటమినంగీకరించి, చేతులు నరుక్కుని పరితపించిన జక్కనగా ఆ పాత్రకు ప్రాణం పోశారు. 11. చాణక్య-చంద్రగుప్త (1977): ఎన్టీయార్ ఈ చిత్రాన్ని తలపెట్టి, తను చాణక్యుడిగా వెయ్యాలని, అక్కినేని చంద్రగుప్తునిగా నటించాలని తెలుపగా, అక్కినేని తనకు చాణక్యుడు కావాలని పట్టుబట్టారు. మెట్ల మీద నుంచి చాణక్యుని నవనందులు పడదోసినప్పుడు శిగ ముడి విడివడగా, వారి అంతం చూస్తానని శపథం చేసిన సన్నివేశంలో పింగళి రాసిన సంక్లిష్ట సమాసాలను భావస్ఫోరకంగా పలికి అందానికి తగ్గట్టు కళ్లల్లో చండ్ర నిప్పులు కురిపించిన తీరు అపూర్వం. 12. నవలా చిత్ర నాయకుడు- దేవదాసు (1953): భారతీయ భాషల్లో ఓ డజను ‘దేవదాసు’లు రాగా, అగ్రగామిగా నిలిచింది అక్కినేని ‘దేవదాసు’. దేవదాసు పాత్ర పోషణలో మద్యం మత్తుతో కళ్లు మూతపడుతుంటాయి. ఈ ఎఫెక్టు కోసం ఆ సన్నివేశాలను రాత్రి వేళల్లో చిత్రించారు. నాగేశ్వరరావు పెరుగు అన్నంతో సుష్టుగా భోంచేసి షూటింగ్కు వెళ్లేవారు. నిద్రమత్తుతో కళ్లు తూగిపోయేవి. మైండ్ను కంట్రోల్లో ఉంచుకుని నటించటంతో ఆ సన్నివేశాలు రాణించాయని తెలిపారు అక్కినేని. 13. అర్ధాంగి (1955): ‘స్వయంసిద్ధ’ బెంగాలీ నవలకు తెర రూపం. జమీందారు పెద్దకొడుకు రాఘవేంద్రరావు పెళ్లాం మెడలో తాళి కట్టేటంతటి అమాయకుడు. ఈ సన్నివేశాల్లో అమాయకత్వం... అర్ధాంగి రాధ స్వయంకృషి వల్ల మార్పు చెందాక పెద్దరికం... పాత్రలో వచ్చిన మార్పుల గ్రాఫ్కు తగ్గట్టుగా బాలెన్స్డ్గా నటించారు. 14. పూజాఫలం (1964): మునిపల్లెరాజు ‘పూజారి’ నవల ఆధారం. బి.ఎన్.రెడ్డి- అక్కినేని కాంబినేషన్లో ఏకైక చిత్రం. లోకజ్ఞానం లేని కథానాయకుడు మధు. తన జీవితంలోకి ప్రవేశించిన ముగ్గురమ్మాయిలు వాసంతి (జమున), సీత (సావిత్రి), వేశ్య నీలనాగిని (ఎల్.విజయలక్ష్మి). వారివల్ల తన జీవన విధానంలో వచ్చిన మార్పును స్పష్టంగా చూపారు. క్యారెక్టరైజేషన్ అనే దానిని అభినయం ద్వారా నిర్వచించారు. 15. డాక్టర్ చక్రవర్తి (1964): కోడూరి కౌసల్యాదేవి ‘చక్ర భ్రమణం’ నవలకు తెర రూపం. పాఠకుల సూచన మేరకు అన్నపూర్ణ సంస్థ వారు పాత్రధారులను ఎంపిక చేశారు. చక్రవర్తికి పూర్వాశ్రమంలో ప్రేమించిన శ్రీదేవి దూరం కావటం, పెద్దలకిచ్చిన మాట ప్రకారం నిర్మలను పెళ్లాడి అశాంతికి లోనవడం, చనిపోయిన చెల్లెలు సుధను నవలా రచయిత్రి మాధవిలో చూసుకొని మురిసిపోవటం - ఫలితంగా అపార్థాలు; మానసిక సంఘర్షణను సంయమనంతో నటించి నట చక్రవర్తి అనిపించారు. 16. ప్రేమనగర్ (1971): ఇదీ కోడూరి కౌసల్యాదేవి నవలే. ‘అనుభవించు, సుఖించు, తరించు’ అనే ఉమరఖయ్యూం ఫిలాసఫీని నమ్మిన కథానాయకుడు కల్యాణ్. లత రాకతో అతని జీవితం ప్రభావితమౌతుంది. ఒకానొక సందర్భంలో ఆమె ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తాడు. ప్రేమ మందిరాన్ని నిర్మించి, అందులో ప్రేయసిని ప్రతిష్టించి, ఆ ప్రేమ భగ్నమైనప్పుడు ‘ఎవరి కోసం ఈ ప్రేమ మందిరం’ అని విలపిస్తాడు. ఆత్రేయ రచనతో దృశ్యకావ్యంగా నిలిచింది. 17. విభిన్న భూమికలు- రోజులు మారాయి (1955): అభ్యుదయ భావాలు గల రైతు నాయకుడు వేణు పాత్రలో పల్లెటూరి నుంచి వచ్చిన అక్కినేని సహజంగా ఒదిగిపోయారు. 18. ఇలవేలుపు (1956): దర్శకులు ఎల్.వి.ప్రసాద్, వైద్యం పొందిన ప్రకృతి ఆశ్రమం నేపథ్యంలో రూపొందిన కథ. శేఖర్ ఆశ్రమవాసి అయిన శారదను ప్రేమిస్తాడు. విదేశాలకు వెళ్లి తిరిగి వచ్చేసరికి తన తండ్రి శారదను పెళ్లాడటం, ప్రేయసిని తల్లిగా చూడాల్సి రావడం, తర్వాత లక్ష్మిని పెళ్లి చేసుకోవటం, భర్తను ఆమె అనుమానించడం, మానసికంగా సంఘర్షణకు లోనైన శేఖర్ పాత్ర అక్కినేనికి అగ్నిపరీక్ష. తట్టుకుని నిలబడ్డారాయన. 19. భార్యాభర్తలు (1961): నెగెటివ్ టచ్ ఉన్న కథానాయకుడి పాత్ర ఆనంద్. అమ్మాయిలతో ఆడీపాడీ... ఆనంద్ కోరి, వెంటాడి, శారదను పెళ్లిచేసుకుంటాడు. తొలిరాత్రి ఆమె నుంచి ఎదురైన ప్రతిఘటనకు బదులుగా ఆమెలో మార్పువచ్చేదాకా వేచి ఉంటాడు. మబ్బులన్నీ తొలగిపోయాక, హత్యానేరంపై జైలుకు వెళ్లి భార్య సహకారంతో బయటపడతాడు. 20. ఇద్దరు మిత్రులు (1961): కథానాయకుని పరంగా తొలి ద్విపాత్రాభినయం. ఆస్తీ అంతస్తూ ఉన్నా శాంతి లేని జమీందారు అజయ్బాబు. ఆత్మవిశ్వాసం పుష్కలంగా ఉన్నా పేదరికంతో అల్లాడే విజయబాబు. ఈ రెండు పాత్రల వైవిధ్యాన్ని సున్నితంగా ఆవిష్కరించారు. రాజేశ్వరావు అందించిన సుమధుర సంగీతం ఈ చిత్రానికి అండగా నిలిచింది. 21. మూగమనసులు (1964): ఆదుర్తి అద్భుత సృష్టిగోదావరిపై పడవ నడిపే సరంగు గోపి. అమ్మాయిగారంటి సావిత్రికి గోపీపై ఉన్నది ఆరాధనా? ఆప్యాయతా? ఆకర్షణా? వీటన్నిటనీ కలగలిపిన విలక్షణ భావమా? అక్కినేని, సావిత్రి పోటీపడి తెరపై పండించారు. అందుకే తెలుగువారి సజీవ స్రవంతిలో ‘గోదావరి’లా మిగిలిపోయిందీ చిత్రం. 22. దసరాబుల్లోడు (1971): పులి వేషాలు, నెమలి వేషాలు, బావా మరదళ్ల సరదాలు, సరసాలు, ప్రేయసీ ప్రియుల చేలగట్ల ప్రణయరాగాలు, సెంటిమెంట్లు... ఇవన్నీ కలగలిసిన పల్లెలూరి కుటుంబ కథాచిత్రంలో కీలకమైన గోపీ పాత్ర ద్వారా సగటు ప్రేక్షకుడికి దసరా బుల్లోడు ఎలా ఉంటాడో చూపించారు దర్శక నిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్. 23. ప్రేమాభిషేకం (1981): దేవి ప్రేమను దక్కించుకోవటం కోసం వేశ్య జయంతితో కలిసి నాటకమాడిన రాజేష్, దేవి ప్రేమ సఫలమయ్యాక, క్యాన్సర్ కారణంగా ఆ దేవిని దూరం చేసుకోవటానికి జయంతితో కలిసి మరో నాటకమాడటం - అద్భుతమైన దాసరి రూపకల్పన రాజేష్ పాత్ర. 24. మేఘసందేశం (1982): దాసరి మరో అద్భుత సృష్టి. కవి రవీంద్ర తనలో చైతన్యాన్ని కలిగించిన నర్తకి పద్మకు చేరువై, భార్య పార్వతికి దూరమై, ఆ పద్మ దూరమైనప్పుడు ‘విన్నవించు నా చెలికీ విరహ వేదనా’ అంటూ మేఘాలతో తన బాధలను నివేదించి, తుదకు ఇంటికి వచ్చి తనువు చాలించి ఆత్మ పద్మ వద్దకు చేరడం... భార్యను అన్యాయం చేశానన్న భావన, పద్మ పట్ల అనురక్తి... వీటిని ఆవిష్కరించటం అక్కినేనికే చెల్లింది. 25. సీతారామయ్యగారి మనవరాలు (1991): అరవై ఏడేళ్ల వయసులో అక్కినేనికి లభించిన సహజమైన పాత్ర. కోనసీమ యాస, పల్లెటూరి పెద్దమనిషి - మానవ జీవితంలోని భావోద్వేగాలను హృదయాలకు హత్తుకునేలా ఆవిష్కరించారు. తెలుగుతెరపై అక్కినేని నిజంగా నటసమ్రాట్. - ఎస్.వి.రామారావు -
నేడు అక్కినేని 90 పుట్టినరోజు
అక్కినేని పుట్టింది భారతీయ సినిమా పుట్టిన పదేళ్లకు. ఆయన సినీ నటునిగా పుట్టింది తెలుగు సినిమా పుట్టిన పదేళ్లకు. ఈ తీరుని బట్టి చూస్తే.. సినిమా కోసమే ఈయన్ని దేవుడు పుట్టించాడా? అనిపిస్తుంది.నేడు ఆ మహానటుడు 90వ పడిలోకి అడుగుపెడుతున్నారు -
అక్కినేని అభినయ కిరీటంలో నవరత్నాలు
అక్కినేని పుట్టింది భారతీయ సినిమా పుట్టిన పదేళ్లకు. ఆయన సినీ నటునిగా పుట్టింది తెలుగు సినిమా పుట్టిన పదేళ్లకు. ఈ తీరుని బట్టి చూస్తే.. సినిమా కోసమే ఈయన్ని దేవుడు పుట్టించాడా? అనిపిస్తుంది. కుటీర పరిశ్రమగా మొదలైన ‘సినిమా’ మహా పరిశ్రమగా ఎదగడానికి కారకులైన మహానుభావులు ఎందరో. వారిలో అక్కినేని తప్పకుండా ముందు వరుసలో ఉంటారు. సినిమాను తెలుగు ప్రేక్షకులు అమితంగా ఇష్టపడుతున్నారంటే, తెలుగు సినిమా ఈ రోజు దక్షిణాదిలోనే అత్యధిక చిత్రాలు నిర్మించే స్థాయికి ఎదిగిందంటే అందులో అక్కినేని పాత్ర ఎంతో ఉంది. అందుకే ఆయన్ను తెలుగు సినిమా తల్లి రెండు కళ్లలో ఓ కన్నుగా అభివర్ణిస్తుంటారు సినీ పండితులు. నేడు ఆ మహానటుడు 90వ పడిలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా నటసమ్రాట్ అభినయ కిరీటంలోని నవ రత్నాలను ఒకసారి స్మరించుకుందాం. లైలామజ్ను (1949) ఈ సినిమా వచ్చే నాటికి అక్కినేని సినీ నటనానుభవం ఎనిమిదేళ్లు. కానీ వంద సినిమాల నటుడికి కూడా సాధ్యపడనంత అమోఘమైన నటన కనబరిచారు. ‘ప్రేమికుడి పాత్రను ఇంత అద్భుతంగా చేయొచ్చా?’ అని సాటి నటులు సైతం విస్తుపోయేలా నటించారు అక్కినేని. లైలాతో పెళ్లి.. నిశ్చితార్థం దాకా వచ్చి ఆగిపోయిన సన్నివేశంలో లోకులందరూ ‘మజ్ను... మజ్ను’ అంటూ రాళ్లతో కొడుతుంటే... దెబ్బలను కూడా ఖాతరు చేయకుండా ఖైస్(అక్కినేని) నవ్విన నవ్వు చరిత్రలో నిలిపోయింది. ఒక్క నవ్వుతో జనహృదయాలపై గాఢమైన ముద్రను వేశారు అక్కినేని. దేవదాసు (1953) ధనమదానికి, పెద్దరికానికీ తన ప్రేమనే బలిపెట్టిన పిరికివాడు దేవదాసు. అందుకే తనపై తనకు అసహ్యం. కావాలనే తన శరీరాన్ని హింసించుకున్నాడు. చేవ లేక, చేసేది లేక చావుకు దగ్గరయ్యాడు. ఈ పాత్రలో అక్కినేని నటన నభూతో నభవిష్యత్. మరొకరు టచ్ చేయడానికి కూడా ధైర్యం చేయని పాత్ర ఇది. దేవదాసుగా అక్కినేని నటనకు దిలీప్కుమార్ సైతం జోహార్లు అర్పించారు. ‘‘దేవదాసు’ అంటే అక్కినేని మాత్రమే’ అని పత్రికాముఖంగా అంగీకరించారు. ఆ పాత్ర జనాలను ఏ స్థాయిలో ప్రభావితం చేసిందంటే.. అప్పట్లో ప్రతి మద్యం దుకాణంపై అక్కినేనే కనిపించేవారట. విప్రనారాయణ (1954) ఈ సినిమాను అక్కినేని ఒప్పుకున్నప్పుడు.. ‘దేవదాసు పాత్ర చేసిన నీకు ఈ హరిదాసు పాత్ర ఎందుకయ్యా. నీవు నాస్తికుడవు. భక్తిని ఎలా పలికిస్తావ్?’ అన్నారట చక్రపాణి. ‘తాగుబోతు పాత్ర పోషించేవాడు తాగుబోతే కానవసరం లేదు. భక్తుడి పాత్ర పోషించేవాడు భక్తుడే కానవసరం లేదు. నేను పాత్ర చేసి చూపిస్తాను’ అని చక్రపాణిగారితో ఛాలెంజ్ చేసి మరీ అక్కినేని ఈ పాత్ర చేశారు. విమర్శకులను సైతం విస్తుపోయేలా చేశారు. అటు భక్తునిగా, ఇటు స్త్రీ మోహంలో చిక్కుకున్న మానసిక బలహీనుడిగా అక్కినేని నటన అదరహో. అనార్కలి (1955) ఈ కథతో బాలీవుడ్లో అప్పటికే సినిమా వచ్చింది. సలీంగా ప్రదీప్కుమార్ నటించారు. కానీ ఆ సలీం వేరే, ఈ సలీం వేరే. ఈ సలీంలో అమరప్రేమికుడు కనిపిస్తాడు. ప్రేమకోసం తండ్రి అక్బర్ బాదుషాని సైతం ఎదిరించే సన్నివేశంలో అయితే... వీరాధి వీరుడు అగుపిస్తాడు. అనార్కలిని జీవ సమాధి చేసే పతాక సన్నివేశంలో ‘అనార్.. అనార్..’ అంటూ అక్కినేని భావోద్వేగపూరితమైన నటన పతాకస్థాయిలో ఉంటుంది. ఇదీ మరొకరు టచ్ చేయలేని పాత్రే. తెనాలి రామకృష్ణ (1956) రామకృష్ణ కవి అలాగే బిహేవ్ చేసేవారేమో! తన పాండిత్యంతో అందరినీ అలాగే నవ్వించేవారేమో! కోపం వస్తే పండితులను సైతం అలాగే తిట్టేవారేమో! ‘తెనాలి రామకృష్ణ’లో అక్కినేనిని చూస్తే ఇలాంటి భావాలే కలుగుతాయి. కళ్లను పెద్దవిగా చేసి విచిత్రంగా వాటిని కదిలిస్తూ, ఒక రకమైన డైలాగ్ డిక్షన్తో, వైవిధ్యభరితమైన శారీరక భాషతో ఆ పాత్రకు ప్రాణ ప్రతిష్ట చేశారు. ‘తెనాలి రామకృష్ణ ఎలా ఉంటారు?’ అని కళ్లు మూసుకుంటే తెలుగువాళ్లకు కనిపించే రూపం అక్కినేని. మహాకవి కాళిదాసు (1960) నటునిగా అక్కినేనిని ఆకాశమంత ఎత్తులో నిలబెట్టిన సినిమా ఇది. ఇందులో ప్రథమార్ధం వెర్రిబాగులోడు. ద్వితీయార్థం మహాకవి. ఉత్తర దక్షిణ ధృవాల్లాంటి పాత్రలు. అక్కినేని లాంటి మహానటులు మాత్రమే అలాంటి పాత్రను పోషించగలరు. అమాయకుడు, అమేయ జ్ఞాన సంపన్నుడిగా మారే పరిణామ క్రమంలో అక్కినేని అభినయం అనితర సాథ్యం. బాటసారి (1961) మానసిక రుగ్మత కలిగిన మేధావి కథ ఇది. అభిప్రాయాలు, అభిమతాలు, ఇష్టాఇష్టాలు.. ఇలా ఏ భావాన్నీ ఆ పాత్ర వ్యక్తం చేయలేదు. ఈ పాత్ర పోషణ నిజంగా కత్తిమీద సామే. సినిమా మొత్తం మీద అక్కినేని డైలాగులు రెండు పేజీలకు మించవు. ఇందులో అక్కినేని ఆహార్యం భిన్నంగా ఉంటుంది. కళ్లద్దాలు, పంచ, ధోవతితో అడపాదడపా కళ్లు ఆర్పుతూ భిన్నంగా కనిపిస్తారాయన. అప్పటికే అక్కినేని సూపర్స్టార్డమ్ని ఎంజాయ్ చేస్తున్నారు. అలాంటి టైమ్లో ఈ పాత్ర చేయడానికి ఒప్పుకోవడం ఆయన తెగువకు దర్పణం. శ్రీకృష్ణార్జున యుద్ధం (1963) ఇందులోని అర్జున పాత్రను అక్కినేని చేశారు కాబట్టే ఆ సినిమాకు ఓ విలువ ఏర్పడింది. వేరే ఎవరు పోషించినా... ఎన్టీఆర్ స్టార్ స్టేటస్ ముందు తేలిపోయేవారు. ఆయన్ను తట్టుకొని ఢీ కొట్టేంత స్థాయి ఉన్న నటుడు ఒక్క ఏఎన్నార్ మాత్రమే. కాబట్టే... కేవీరెడ్డి ఆయన్ను అర్జునుడిగా ఎంచుకున్నారు. అనుకున్నట్టే ఎన్టీఆర్తో నువ్వా-నేనా అనే స్థాయిలో నటించారు అక్కినేని. అర్జునుడి పాత్రకు ఓ నిండుదనం తెచ్చారు. ప్రేమాభిషేకం (1981) దేవదాసు పాత్రకు పూర్తి విరుద్ధమైన పాత్ర రాజేష్ పాత్ర. దేవదాసు పిరికివాడు. రాజేష్ ధైర్యానికి మరో రూపం. దేవదాసుది త్యాగం కాదు. చేతకాని తనం. రాజేష్ది నిజమైన త్యాగం. ప్రియురాలి శ్రేయస్సు కోసం తనకు తాను చెడ్డవాడిగా చిత్రీకరించుకున్న త్యాగమూర్తి రాజేష్. ఆ తేడాను ఇందులో అక్కినేని అద్భుతంగా పలికించారు. దేవదాసు ధైర్యవంతుడైతే ఎలా ఉంటుందో ‘ప్రేమాభిషేకం’లోని రాజేష్ పాత్రలో చూపించారు అక్కినేని. పైగా ఈ సినిమా టైమ్లో అక్కినేని వయసు 58. కానీ టీనేజర్లు సైతం విస్తుపోయేంత చలాకీగా కనిపిస్తారాయన. ఈ తొమ్మిది సినిమాలు మచ్చుకు మాత్రమే. ఈ మహానటుడు నటించిన సినిమాల గురించి మాట్లాడాలంటే... ఒక గ్రంథమే అవుతుంది. అర్థాంగి, పునర్జన్మ, మూగమనసులు, మనసేమందిరం, ప్రేమనగర్, ధర్మదాత, సుడిగుండాలు, అనుబంధం, సీతారామయ్యగారి మనవరాలు... ఇలా చెప్పుకుంటే ఎన్నో ఎన్నెన్నో.. అయితే నేడు ఆయన పుట్టిన రోజు కాబట్టి చంద్రునికి ఓ నూలుపోగులా ఈ వ్యాసం. - బుర్రా నరసింహ