breaking news
Inter Education Intermediate Advanced Supplementary Results
-
‘ప్రథమ’లో 66%, ‘ద్వితీయ’లో 42% ఉత్తీర్ణత
* ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల * ఫలితాలు విడుదల చేసిన డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి * రీకౌంటింగ్, రీవెరిఫికేషన్కు జూలై 4 చివరి తేదీ సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్మీడియెట్ బోర్డు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఫలితాలను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి విడుదల చేశారు. ప్రథమ సంవత్సరంలో (జనరల్) 3,02,349 మంది పరీక్షలకు హాజరుకాగా 2,00,253 మంది (66.23 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఇందులో ఇంప్రూవ్మెంట్ కోసం పరీక్షలు రాసి ఉత్తీర్ణులైన వారు 1,50,685 మంది ఉండగా మార్చిలో జరిగిన వార్షిక పరీక్షల్లో ఫెయిలై అడ్వాన్స్డ్ సప్లిమెంటరీలో ఉత్తీర్ణులైన విద్యార్థులు 49,588 మంది ఉన్నారు. ఇక ప్రథమ సంవత్సరం వొకేషనల్లో 12,392 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 6,342 మంది (51.17 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరంలో 1,61,294 మంది పరీక్షలకు హాజరవగా 68,996 మంది (42.77 శాతం) ఉత్తీర్ణులయ్యారు. వొకేషనల్లో 9,508 మంది పరీక్షలకు హాజరుకాగా 4,668 (49.15 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఈ ఫలితాల్లోనూ బాలికలే అత్యధిక ఉత్తీర్ణతను సాధించారు. ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలవారీగా చూస్తే ప్రథమ సంవత్సరంలో 52 శాతం మంది ప్రభుత్వ కాలేజీలకు చెందిన విద్యార్థులు ఉత్తీర్ణత సాధిస్తే ప్రైవేటు కాలేజీలకు చెందిన 69 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరంలో 45 శాతం మంది ప్రభుత్వ కాలేజీల విద్యార్థులు ఉత్తీర్ణులైతే ప్రైవేటు కాలేజీలకు చెందిన 69 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. మూడు రోజుల్లో మార్కుల జాబితాలు మార్కుల జాబితాలను కాలేజీలకు అందించేందుకు వాటిని మూడు రోజుల్లో ప్రాంతీయ ఇన్స్పెక్షన్ అధికారులకు పంపనున్నారు. ప్రిన్సిపాళ్లు వాటిని జూలై 1న తీసుకొని వీలైనంత త్వరగా విద్యార్థులకు అందించాల్సి ఉంటుంది. మార్కుల మెమోల్లో తేడాలు, తప్పులుంటే ప్రిన్సిపాళ్ల ద్వారా జూలై 27లోగా బోర్డుకు తెలియజేయాలి. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్కు ఆన్లైన్లోనే దరఖాస్తులు మార్కుల రీకౌంటింగ్, రీవెరిఫికేషన్తోపాటు జవాబు పత్రాల ఫొటో కాపీ కోసం విద్యార్థులు జూలై 4లోగా దరఖాస్తు చేసుకోవాలి. రీకౌంటింగ్ కోసం ఒక్కో పేపరుకు రూ. 100, రీవెరిఫికేషన్తోపాటు జవాబు పత్రాల ఫొటో కాపీ కోసం ఒక్కో పేపరుకు రూ. 600 చొప్పున ఆన్లైన్ www.tsbie.cgg.gov.in ద్వా రా, మీసేవా లేదా ఏపీ ఆన్లైన్ ద్వారా చెల్లించవచ్చు. ఈ ఫీజును చెల్లించాక వెబ్సైట్ ద్వారా లేదా ఏపీ ఆన్లైన్ లేదా మీసేవా కేంద్రాల్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను సమర్పించాలి. -
ఇంటర్ విద్య పటిష్టతకు చర్యలు
డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి * ఎంసెట్కు హాజరయ్యే వారికి ప్రత్యేక శిక్షణ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటర్ విద్య పటిష్టానికి పక్కా చర్యలు చేపట్టనున్నట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. శుక్రవారం ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రైవేటు కాలేజీల విద్యార్థులు ఎక్కువ శాతం ఉత్తీర్ణత సాధించిన నేపథ్యంలో ప్రభుత్వ కాలేజీల్లోనూ ఉత్తీర్ణత శాతం పెంచేందుకు కృషి చేస్తామని, ప్రైవేటు కాలేజీలకు దీటుగా ప్రభుత్వ కాలేజీలను అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఇందులో భాగంగా లెక్చరర్లకు ఓరియంటేషన్ తరగతులను నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. లెక్చరర్లు కూడా బాగా పని చేయాలని, ప్రభుత్వ కాలేజీల్లోనే ఎక్కువ మంది విద్యార్థులు చేరేలా చర్యలు చేపట్టాలన్నారు. వార్షిక పరీక్షల్లో ఫెయిలైన ప్రభుత్వ కాలేజీల విద్యార్థుల కోసం నిర్వహించిన ప్రత్యేక తరగతుల నిర్వహణ కార్యక్రమం సత్ఫలితాలిచ్చిందన్నారు. ఈ విద్యా సంవత్సరంలోనూ మరిన్ని ప్రయోగాలు చేపట్టనున్నామని, వచ్చే ఏడాది పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ప్రత్యేక తరగతులను నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నామని చెప్పారు. అలాగే ఎంసెట్కు సిద్ధమయ్యే ప్రభుత్వ కాలేజీల విద్యార్థులకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తామన్నారు. ఇంజనీరింగ్ కాలేజీలకు అనుబంధ గుర్తింపు, అందుబాటులోకి వచ్చే సీట్ల వివరాలను ఈనెల 28న తెలుస్తాయన్నారు. త్వరలోనే వర్సిటీలకు వీసీల నియామకంపై చర్యలు చేపడతామన్నారు. రాష్ట్రంలో చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టం (సీబీసీఎస్) అమలుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్న కడియం... ఆ విధానం అమలుపై పరిస్థితులకు అనుగుణంగా వర్సిటీలే నిర్ణయం తీసుకుంటాయన్నారు. ఈ విధానాన్ని దశలవారీగా అమలు చేస్తామన్నారు. జేఎన్టీయూలో కెమికల్ ఇంజనీరింగ్ కోర్సును రద్దు చేయబోమని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. ఓయూ పీజీ కోర్సుల్లో సీబీసీఎస్ను పూర్తి స్థాయిలో అమలు చేస్తామని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్.ఆచార్య వెల్లడించారు. డిగ్రీ స్థాయిలో సీబీసీఎస్ అమలుకు ఏర్పాట్లపై దృష్టి సారించామన్నారు. ఏపీ ఇంటర్ బోర్డు డబ్బును విజయవాడకు తరలించిన వ్యవహారంలో కేసు పెడతామన్నారు. కాగా, ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఉచిత విద్య అందించాలని నిర్ణయించినందుకు కడియంకు ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు మధుసూదన్రెడ్డి, విద్యార్ధులు ధన్యవాదాలు తెలిపారు.