breaking news
impeached
-
దక్షిణ కొరియా అధ్యక్షుని అభిశంసన
సియోల్: ఎమర్జెన్సీ ప్రకటించినందుకు దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ పర్యవసానాన్ని అనుభవించారు. ఆయనపై విపక్షాలు ప్రవేశపెట్టిన రెండో అభిశంసన తీర్మానం శనివారం పార్లమెంటు అమోదం పొందింది. 300 మంది సభ్యుల్లో అభిశంసన తీర్మానం నెగ్గాలంటే 200 ఓట్లు రావాల్సి ఉండగా 204 మంది ఓటేశారు. 85 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. దాంతో యోల్ పదవీచ్యుతుడయ్యారు. ప్రధాని హాన్ డక్ సో తాత్కాలిక దేశాధినేతగా వ్యవహరించనున్నారు. యోల్ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలా, పూర్తిగా తొలగించాలా అన్నది రాజ్యాంగ న్యాయస్థానం నిర్ణయిస్తుంది. ఇందుకు ఆర్నెల్లు పట్టవచ్చు. తొలగించే పక్షంలో 60 రోజుల్లో ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. పీపుల్ పవర్ పార్టీ సభ్యుల గైర్హాజరీతో గత శనివారం తొలి అభిశంసన తీర్మానం నుంచి ఆయన గట్టెక్కారు. ఈసారి మాత్రం ఆయన సొంత పార్టీ సభ్యుల్లో పలువురు అభిశంసన తీర్మానం ఆమోదం పొందడానికి సహకరించారు. ఇది దక్షిణ కొరియా ప్రజలకు, ప్రజాస్వామ్యానికి దక్కిన విజయమని విపక్ష డెమొక్రటిక్ పార్టీ ఫ్లోర్ లీడర్ పార్క్ చాన్ డే అన్నారు. ఫలితాలపై యోల్ స్పందించలేదు. పాలనపై కోల్పోతున్న పట్టును నిలుపుకునేందుకు ఆయన ఇటీవల అనూహ్యంగా ‘మార్షల్ లా’ ప్రకటించడం, గంటల్లోనే పార్లమెంటు దాన్ని ఎత్తేయడం తెలిసిందే. యోల్, ఆయన భార్య, కుటుంబీకులు, సన్నిహితులపై భారీ అవినీతి ఆరోపణలున్నాయి. తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ప్రధాని హాన్ డక్–సో సాంకేతిక నిపుణుడు. పారీ్టలకతీతంగా వైవిధ్యమైన కెరీర్ ఆయనది. పాలనాపరంగా విస్తృతమైన అనుభవముంది. ఐదుగురు వేర్వేరు అధ్యక్షుల ఆధ్వర్యంలో మూడు దశాబ్దాలకు పైగా నాయకత్వ పదవుల్లో పనిచేశారు. -
శాంసంగ్తో అవినీతి.. దేశాధ్యక్ష పదవి ఊడింది
సియోల్: దక్షిణ కొరియా అధ్యక్షురాలు పార్క్ గెన్ హే(65)పై పార్లమెంటు ఆమోదించిన అభిశంసన తీర్మానాన్ని ఆ దేశ సుప్రీం కోర్టు సమర్ధించింది. దీంతో పార్క్ పదవి నుంచి తప్పుకోనున్నారు. అభిశంసనతో ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నుకున్న ఒక దేశ అధ్యక్షురాలిని తొలగించడం దక్షిణ కొరియాలో ఇదే తొలిసారి. పార్క్ కొందరు వ్యాపారవేత్తలతో చేతులు కలిపి అవినీతికి పాల్పడటం వల్ల దక్షిణ కొరియాలో కొద్ది నెలలుగా రాజకీయ అనిశ్చితి నెలకొంది. తన స్నేహితురాలైన చోయ్ సూన్ సిల్తో కుమ్మక్కై పార్క్ శాంసంగ్ గ్రూప్ హెడ్కు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంది. 2015లో దేశంలో రెండు చోట్ల ఉన్న శాంసంగ్ కార్యాలయాలను ఒకే చోటుకు మార్చడం వెనుక కూడా పార్క్ హస్తం ఉంది. గతేడాది డిసెంబర్ 9న పార్క్పై ఉన్న ఆరోపణల కారణంగా ఆమె పదవిలో కొనసాగడానికి అనర్హురాలని దక్షిణ కొరియా పార్లమెంటు పేర్కొంది. అయినా వెనక్కు తగ్గని ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించింది. కేసును విచారించిన ఎనిమిది మంది జడ్జిలతో కూడిన ధర్మాసనం పార్క్ అవినీతి పాల్పడ్డారని.. అధ్యక్ష పదవిలో కొనసాగడానికి ఆమె అనర్హురాలని తేల్చి చెప్పింది. దక్షిణ కొరియా రాజ్యాంగం ప్రకారం అధ్యక్ష పదవి ఖాళీ అయితే 60 రోజుల్లోగా కొత్త అధ్యక్షుడిని/అధ్యక్షురాలిని ఎన్నుకోవాల్సివుంటుంది.