సీక్రెట్ లవర్తో ఎన్నారైను చంపించింది
మెల్బోర్న్: ఆమె ఒక మాజీ సెక్స్ వర్కర్. మెలెన్దినార్ బ్రోతల్ హౌజ్లో తనకు రెగ్యులర్ విటుడైన ఓ ఎన్నారై వ్యాపారవేత్తను ఆమె ప్రేమించింది. పెళ్లి కూడా చేసుకోవాలనుకుంది. కానీ, వారు పెళ్లి చేసుకొనేలోపే.. అతను దివాలా తీయడం.. అతనితో సంబంధం బెడిసికొట్టడంతో.. తన రహస్య ప్రేమికుడిని రంగంలోకి దింపి ఎన్నారైనే దారుణంగా హత్య చేయించింది ఆ కిలాడి లేడీ. ఈ కేసులో ఆస్ట్రేలియా కోర్టు 30 ఏళ్ల మెలిస్సా లీ షాకు యావజ్జీవ శిక్ష విధించింది. ఎన్నారై వ్యాపారవేత్త శ్యామ్ సామ్ ధోడీ హత్య కేసులో ఆమెను గతవారమే బ్రిస్బేన్ సుప్రీంకోర్టు దోషిగా తేల్చింది. అత్యంత పిరికితనంతో తన ప్రేమికుడిని వినియోగించి శ్యామ్ను ఆమె హత్య చేయించిందని, ఆమె 20 ఏళ్ల వరకు పెరోల్ కూడా ఇవ్వకూడదని న్యాయమూర్తులు తమ తీర్పులో స్పష్టం చేశారు.
ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్కు చెందిన దివాలా తీసిన వ్యాపారవేత్త అయిన శ్యామ్ 2013 జూలైలో అతని ఇంట్లోనే విగతజీవిగా కనిపించాడు. అతని తలపై పదిసార్లు కాల్చి హత్య చేశారు. తనను పెళ్లిచేసుకోబోయే మాజీ సెక్స్ వర్కర్ లీ షానే అతన్ని చంపించిందని విచారణలో తేలింది. తన రహస్య ప్రియుడు ఆడం గూలీని వినియోగించి శ్యామ్ను చంపించినట్టు తేలింది. శ్యామ్తో కొంతకాలం వరకు ప్రేమ వ్యవహారాన్ని నడిపిన లీషా.. 2013 మార్చిలో ఆ అనుబంధం పెటాకులవ్వడంతో ఈ కిరాతకానికి తెగబడిందని ప్రాసిక్యూషన్ కోర్టుకు తెలిపింది. శ్యామ్ను తానే చంపినట్టు ఒప్పుకున్న ఆడం గూలీకి కూడా కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. అయితే తనకు ఈ హత్య కుట్ర గురించి తెలియదని, తీర్పు తనను నిరాశపరిచిందని ఆమె అనంతరం తెలిపింది.