breaking news
delhi police officer
-
కష్టం ఎక్కడికీ పోదు
నైపుణ్యం ఉన్నచోట వివక్షకు చోటుండదు.. అందరికీ అన్ని స్థాయుల్లోనూ సవాళ్లు ఎదురవుతాయి.. భయం వీడితే పరిష్కారం అదే దొరుకుతుంది.. లక్ష్యాన్ని చేరుకోవాలంటే క్రమం తప్పకుండా ప్రయత్నించాలి అంటారు అంజిత చేప్యాల... తెలంగాణకు చెందిన ఏజీఎంయూటీ క్యాడర్ ఐపీఎస్. దేశరాజధానిలో రాష్ట్రపతి భవన్, ప్రధాని, హోంమంత్రుల నివాసాలతోపాటు ఇండియా గేట్ వంటి అత్యంత ప్రాముఖ్య ప్రదేశాలున్న లుటియన్స్ జోన్లో శాంతిభద్రతల పర్యవేక్షణాధికారిగా ఆమె విధులు నిర్వర్తిస్తున్నారు. విజ్ఞాన్భవన్లో ఇటీవల కేంద్ర ప్రభుత్వం, రైతుల సమావేశాల సమయంలో శాంతి భద్రతలు పర్యవేక్షించిన న్యూ ఢిల్లీ జిల్లా అదనపు డీసీపీ (శాంతి భద్రతలు) అంజిత.. సాధనతోనే ఈ స్థాయి సాధించానని చెబుతున్నారు. ఆమె ప్రస్థానం ఆమె మాటల్లోనే.... శిక్షణ అనంతరం ఢిల్లీలోసైబర్ క్రైం విభాగంలో తొలి బాధ్యతలు స్వీకరించా. శిక్షణ, విధుల సమయంలో సహచరుల్లో ఎలాంటి వివక్ష కనిపించ లేదు... నైపుణ్యం ఉన్నచోట వివక్షకు చోటుండదు.. నా విశ్వాసానికి బలం చేకూరింది. అప్పుడప్పుడే సైబర్ నేరగాళ్ల విశ్వరూపం బయటపడుతోంది.. వందలాది ఫిర్యాదులు వచ్చేవి.. ఇంజినీరింగ్ నేపథ్యం కావడంతో సులభంగానే అనేక సవాళ్లు చేధించా.. సొమ్ములు కట్టించుకొని సరకు అందించని ఆన్లైన్ షాపింగ్ టిమ్టారా.కామ్, కాల్సెంటర్ మాదిరి ఫోన్ చేసి బ్యాంకు ఖాతా వివరాలు తెలుసుకొని సొమ్ములు కాజేసిన జిమ్తారా సంస్థ మోసాలు అరికట్టడంలో నా భాగస్వామ్యం కూడా ఉంది. మెట్రోపాలిటిన్ సిటీ.. రద్దీ రహదారులు.. వీటితోపాటు నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి నూతన సాంకేతిక ఏర్పాటుకు నేను ట్రాఫిక్ ప్రధాన కార్యాలయంలో డీసీపీగా బాధ్యతలు చేపట్టినప్పుడే అనుమతి వచ్చింది. రూ.1000 కోట్ల ప్రాజెక్టు అది. ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్, సీసీటీవీ, క్యూ లెంగ్త్ను చూసి పనిచేసే ఆటోమేటిక్ సిగ్నలింగ్ ఇవన్నీ భవిష్యత్తులో ఢిల్లీ రహదారులపైకి రానున్నాయి. ఈ ప్రాజెక్టు తొలిదశలో నేను కూడా భాగస్వామిని. రహదారులపై ట్రాఫిక్ ఒక ఎత్తు అయితే.. తాజా కరోనా సంక్షోభం నేపథ్యంలో రాజధాని నుంచి వలస కార్మికులు తిరిగి వెళ్లడం.. లక్షలాది మంది ఆనందవిహార్, ఐఎస్బీటీ ప్రాంతాలకు చేరుకోవడం చూస్తే హృదయం ద్రవించి వేసింది. ఈస్ట్జోన్ ట్రాఫిక్ డీసీపీగా ఉన్న నేను వారందరికీ కౌన్సెలింగ్ ఇచ్చే ప్రయత్నం చేశా. ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలను వివరించడంతోపాటు ఆహారం, వైద్య సదుపాయం అందజేశాం. మాస్కులు పంపిణీ చేశాం. నవంబరు 11న డీసీపీ (శాంతిభద్రతలు)గా బాధ్యతలు స్వీకరించా.. 25 నుంచే రాజధాని సరిహద్దుల్లో రైతు ఉద్యమం ప్రారంభమైంది... చాలా రోజులు సవాల్గానే గడిచాయి. నేను నమ్మిన మాట నిజమైంది! శిక్షణ సమయంలో కార్యాలయంలో వివక్ష ఎదురవుతుందన్న భావన నాకెప్పుడూ అనిపించలేదు. మహిళలు సాహసాలు, అద్భుతాలు చేయాలంటే నేర్పు, ఓర్పు కన్నా ధైర్యం అవసరం అని నమ్మేదాన్ని. తొలిసారే సివిల్స్కు ఎంపిక కాలేదని నిరుత్సాహం చెందలేదు. కాలంతో పోరాడి అనుకున్నది సాధించా.. లక్ష్యం చేరుకోవాలంటే క్రమం తప్పకుండా ప్రయత్నించాలన్న మావయ్య నర్సింగ్రావు మాటలు గుర్తొచ్చాయి. వారిద్దరూ ప్రత్యేకం... చదువుకొనే రోజుల నుంచి నన్నెంతగానో ప్రోత్సహించింది మా అన్న సంపత్ రావు. ఈ దిశగా వెళ్లు.. ఇలా చేయడం వల్ల నలుగురికీ ప్రయోజనం కల్పించొచ్చు అంటూ సహోదరిని సేవాదారిగా మార్చడంలో అన్ని వేళలా ప్రోత్సహించారు. ఇక నా భర్త నవీన్కుమార్.. సివిల్స్లో మంచి ర్యాంకు వచ్చి ఎంపిక కాలేకపోయిన నన్నెంతగానో ఓదార్చారు. కోర్టు తీర్పుతో తిరిగి ఎంపిక అయిన తర్వాత అమెరికాలో గృహిణిగా స్థిరపడిన నన్ను విధుల వైపు మళ్లేలా చేశారు. వారిద్దరూ నాకు ఎంతో ప్రత్యేకం. పెద్దపల్లి జిల్లా మేడిపల్లి మా స్వగ్రామం.. రామగుండం, తెనాలి, హైదరాబాద్లో ఇంజినీరింగ్ వరకూ చదివాక తల్లిదండ్రులు మంగ, సత్యనారాయణరావుల ప్రోత్సాహంతో సివిల్ సర్వీసెస్ లక్ష్యంగా ముందుకు సాగా.. మూడు ప్రయత్నాలు మిస్సయినా, నాలుగో యత్నంలో 2008 లో మంచి ర్యాంకు వచ్చింది. అయితే, ఆ సమయంలో జనరల్, రిజర్వేషన్ కేటగిరీల గందరగోళంతో నన్ను ఎంపిక చేయలేదు. తర్వాత ఏడాదే బాసరకు చెందిన నవీన్కుమార్తో వివాహం అయింది. మాకు ఇద్దరు పిల్లలు శాన్వి, మాహిర. పెళ్లి తర్వాత భర్త ఉద్యోగరీత్యా అమెరికా వెళ్లాల్సి వచ్చింది. 2010లో కోర్టు తీర్పుతో జనరల్ కేటగిరీ అభ్యర్థుల్ని తిరిగి ఎంపిక చేయడంతో ఐపీఎస్కు ఎంపికయ్యా. –సూర్యప్రకాశ్ కూచిభట్ల, సాక్షి, న్యూఢిల్లీ ఫొటో: ప్రమోద్ మాధుర్ -
సీమా.. తడాఖా.. సూపర్ కాప్
ఆమె పేరు సీమా ఢాకా.. ఢిల్లీ పోలీసు డిపార్ట్మెంటులోనే కాదు. ఇపుడు దేశవ్యాప్తంగా ఆమె ఓ సూపర్కాప్. ఢిల్లీలో తప్పిపోయిన చిన్నారులను ఒక్కరోజులో ఆచూకీ కనిపెట్టగల సత్తా ఆమె సొంతం. కేవలం మూడు నెలల కాలంలోనే ఏకంగా 76 మంది తప్పిపోయిన చిన్నారులను తిరిగి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చిన అరుదైన ఘనత ఆమె సొంతం. ప్రస్తుతం ఆమె పనిచేస్తోన్న సమయ్పూర్ బద్లీ పోలీస్స్టేషన్ సీమా ఢాకా పనితీరు వల్ల చాలా ప్రసిద్ధి చెందింది. ఎంతగా అంటే.. ఢిల్లీలో ఎక్కడ పిల్లలు తప్పిపోయినా.. ఈమెనే దర్యాప్తు చేయమనేంతగా..! సివంగి వేటకు దిగితే.. ఏ జంతువైనా తలవంచాల్సిందే.. ఈ సీమా ఢాకా దర్యాప్తుకు దిగితే.. తన తడాఖా చూపిస్తుంది ఎలాంటి మిస్సింగ్ కేసైనా 24 గంటల్లో పరిష్కారం కావాల్సిందే. హెడ్ కాన్స్టేబుల్గా పని చేస్తూ ఇటీవలే ఏఎస్ఐగా పదోన్నతి అందుకున్న సీమా ఢాకా తన విధులు, వ్యక్తిగత జీవితంపై పలు విషయాలు ‘సాక్షి’తో ప్రత్యేకంగా పంచుకున్నారు. ► ఒక్కసారిగా దేశవ్యాప్తంగా సూపర్ కాప్ అని పిలిపించుకోవడం ఎలా ఉంది? సీమ: చిన్నారుల జాడ కనిపెడితే కలిగే సంతృప్తి నాకెంతో ఇష్టం. ముఖ్యంగా ఆ పిల్లలను తిరిగి తల్లిదండ్రుల వద్దకు చేరిస్తే.. వారి కళ్లల్లో కనిపించే ఆనందం మాటల్లో వర్ణించలేనిది. నేనూ తల్లినే..! బిడ్డ కాసేపు కనబడకపోతే తల్లడిల్లిపోయే తల్లులు నా వద్దకు వస్తే.. నేను తట్టుకోలేను. వెంటనే రంగంలోకి దిగిపోతాను. ► మీ స్పీడ్ దర్యాప్తులోని సీక్రెట్ ఏంటి? సీమ: నాకంటూ కొన్ని పద్ధతులు ఉన్నాయి. టెక్నాలజీ, ఇంటలిజెన్స్ను సమర్థంగా వాడతా. ఠాణాలో పిల్లలు తప్పిపోయారన్న ఫిర్యాదు అందిన వెంటనే స్పందిస్తా. అలాగైతే.. పిల్లలు సరిహద్దులు దాటకముందే పట్టుకోవచ్చు. జాప్యం చేసే కొద్దీ వారు దూరం వెళ్లిపోతారు. ► తప్పిపోయిన పిల్లల విషయం లో మిమ్మల్ని కదలించిన ఘటన ఏదైనా ఉందా? ఉంది. 2016లో ఓ ముసలావిడ మా స్టేషన్కి వచ్చింది.. తన మనవరాలు తప్పిపోయిందని ఫిర్యాదు చేసింది. తన కొడుకు–కోడలు మరణించారని, మనవరాలు తప్ప ఈ లోకంలో తనకు ఎవరూ లేరని బోరుమంది. ఎంక్వైరీ చేస్తే నిజమే అని తెలిసింది. వాస్తవానికి హెడ్ కానిస్టేబుల్గా ఉన్న నాకు ఆ కేసు దర్యాప్తు చేసేందుకు అధికారాలు లేవు. కానీ, ఉన్నతాధికారుల వద్ద ప్రత్యేక అనుమతి తీసుకుని దర్యాప్తు మొదలుపెట్టాను.. 13 ఏళ్ల ఆ అమ్మాయిని పక్కింట్లో అద్దెకుండే ఓ యువకుడు మాయమాటలు చెప్పి బిహార్కు తీసుకెళ్లాడనే విషయాన్ని కనిపెట్టి, అక్కడ నుంచి బాలికను క్షేమంగా తీసుకొచ్చి నానమ్మకు అప్పగించా. అప్పుడు ఎంతో సంతోషం కలిగిందో చెప్పలేను. ► ఇంత తక్కువ సమయంలో 76 మంది పిల్లలను ఎలా గుర్తించగలిగారు? ఇదంతా మా ఢిల్లీ పోలీస్ కమిషనర్ సార్ కల్పించిన అవకాశం. 14 ఏళ్లలోపు చిన్నారుల మిస్సింగ్ కేసులను ర్యాంకులతో సంబంధం లేకుండా ఎవరైనా కనిపెట్టవచ్చు అంటూ ఇచ్చిన ఆదేశాలను నేను సమర్థంగా వినియోగించుకున్నాను. వాస్తవానికి 12 నెలల్లో 50 మంది పిల్లల ఆచూకీ కనిపెట్టాలని డిపార్ట్మెంట్ నాకు టార్గెట్ ఇచ్చింది. కేవలం తొలి పదిరోజుల్లోనే 12 మంది పిల్లల ఆచూకీ కనిపెట్ట గలిగాను. దాంతో నామీద నాకు, డిపార్ట్మెంట్కు నమ్మకం పెరిగింది. కేవలం 70 రోజుల్లో ఆ సంఖ్య 76కి చేరుకుంది. మిస్సింగ్ కేసుల్లో ఠాణా పరిమితులు లేకపోవడంతో ఢిల్లీలో ఎక్కడ పిల్లలు తప్పిపోయినా.. నా వద్దకు వచ్చిన కేసులను దర్యాప్తు చేస్తున్నాను. ► పిల్లల కోసం ఏయే రాష్ట్రాలు వెదికారు? ఎలాంటి సవాళ్లు ఉండేవి? ఢిల్లీలో తప్పిపోయిన పిల్లలు ఎక్కువగా ఢిల్లీ, పంజాబ్, ఉత్తర్ప్రదేశ్, పశ్చిమ బెంగాల్లో దొరికారు. కేసు వస్తే.. ఎన్ని సవాళ్లు ఎదురైనా లెక్కచేయను. పిల్లలను రెండు రోజుల్లో పట్టుకునేదాన్ని. తరువాత సీడబ్ల్యూసీ వాళ్ల ద్వారా తల్లిదండ్రులకు అప్పగించినపుడు ఆ కష్టం మొత్తం మర్చిపోతాను. వెంటనే ఒక చాయ్ తాగేసి, టేబుల్ మీద ఉన్న కొత్త కేసు ఫైల్ అందుకుంటా! ► పిల్లలు ఇంటి నుంచి పారిపోవడానికి ప్రధాన కారణాలేంటి? పేదరికం. అవును, మీరు వింటున్నది నిజమే! ఢిల్లీకి బతుకుదెరువు కోసం వచ్చే పేదపిల్లలే ఎక్కువగా అదృశ్యమవుతుంటారు. కుటుంబ సమస్యలు, చెడుసావాసాలు, తల్లిదండ్రులు సమయం కేటాయించకపోవడం, ప్రేమపేరుతో మాయమాటల కారణంగా పిల్లలు ఇల్లు విడుస్తున్నారు. వీరుగాకుండా మానవ అక్రమ రవాణా ముఠాలు కిడ్నాప్ చేస్తుంటాయి. ► పిల్లలు తప్పిపోయిన విషయంలో తప్పుడు ఫిర్యాదులేమైనా వస్తుంటాయా? వస్తుంటాయి. అసలు కారణాలను వదిలేసి, పిల్లలు పారిపోయిన విషయాన్నే చెబుతుంటారు చాలామంది. పేదరికం, సహజీవనం, అక్రమ సంబంధాలు కలిగి ఉండటం... ఇలాంటి వాటికి మూలకారణం. దానివల్ల దర్యాప్తు ఆలస్యమవుతుంది. ఈ విషయంలో కారణాలేమైనా.. మేం పిల్లల్ని వెదికి పట్టుకుంటాం. తరువాత అందరికీ కౌన్సెలింగ్ చేసి పంపిస్తాం. ► కిడ్నాప్ కేసులు ఏమైనా మీ వద్దకు వచ్చాయా? లాక్డౌన్లో ఒక విచిత్రమైన కేసు మావద్దకు వచ్చింది. ఓ వివాహితతో అక్రమ సంబంధం ఉన్న ఓ యువకుడు ఆమె తనను కలిసేందుకు రావడం లేదని ఆమె మూడేళ్ల కూతురుని కిడ్నాప్ చేశాడు. తల్లి మాకు అసలు విషయం చెప్పలేదు. మూడేళ్ల చిన్నారిని విడిపించాక, అసలు విషయం వెలుగు చూసింది. నిందితుడు జైలుకు వెళ్లడంతో తల్లీ పిల్లలకు విముక్తి కలిగింది. ► మీరు ఆచూకీ కనిపెట్టిన 76 మంది తల్లిదండ్రులను చేరుకున్నారా? దేవుడి దయవల్ల అంతా తల్లిదండ్రులను కలుసుకున్నారు. కొందరు తల్లిదండ్రులు భాగస్వాములకు తెలియకుండా దత్తతకిచ్చి, తరువాత గొడవలు రాగానే తప్పిపోయారని ఫిర్యాదు చేస్తారు. లాక్డౌన్ కాలంలో కొందరు ఫిర్యాదులు ఇచ్చి రాంగ్ అడ్రస్లు ఇచ్చారు. కొందరు ఫోన్నెంబర్లు మార్చారు. మరికొందరు ఏకంగా ఢిల్లీ వదిలి సొంత రాష్ట్రాలకు వెళ్లిపోయారు. ఈసారి తల్లిదండ్రులను కూడా పట్టుకోవాల్సి వచ్చింది. అంతవరకూ పిల్లలను షెల్టర్ హోంలో ఉంచాల్సి వచ్చింది. ► కుటుంబ నేపథ్యం, వ్యక్తిగత జీవితం గురించి చెబుతారా? మాది యూపీలోని ముజఫర్ నగర్ జిల్లాలోని షమ్లీ ప్రాంతం. డిగ్రీవరకూ అంతా అక్కడే చదివాను. సంప్రదాయ కుటుంబం. అమ్మానాన్నలు టీచర్లు. మా కుటుంబంలో నేనే తొలి పోలీసు ఆఫీసర్. ఉద్యోగమొచ్చాక ఢిల్లీకి మారాను. ఇంట్లో నేను మా ఆయన అనిత్ ఢాకా, మా అబ్బాయి ఆరవ్ ఢాకా ఉంటాం. మా ఆయన కూడా పోలీసే. నా భర్త నా బ్యాచ్మేటే. మా కజిన్ ఈ సంబంధం తీసుకువచ్చాడు. దీంతో అనుకోకుండానే బ్యాచ్మేట్ను వివాహం చేసుకున్నాను. క్షణం తీరిక లేకున్నా.. ఇంట్లో అంతా నన్ను ప్రోత్సహిస్తారు. నా విజయాలను వారి విజయాలుగా చెప్పుకుంటారు. వారి ప్రోత్సాహంతోనే కూతురిగా, భార్యగా, తల్లిగా పోలీసు అధికారిగా ఇపుడు అన్ని బాధ్యతలు సమర్థంగా నిర్వర్తించగలుగుతున్నాను. ► పోలీసు జాబును ఎందుకు ఎంచుకున్నారు? సీమ: 2006 ఊళ్లో కొందరు అమ్మాయిలు దరఖాస్తు చేస్తుంటే నేనూ చేశాను. సెలెక్టయ్యాను. కానీ, బంధువులంతా నాన్నను భయపెట్టారు. పోలీసైతే పెళ్లి అవదు అని, మగరాయుడిలా పోలీసును చేస్తావా? అంటూ సూటిపోటి మాటలు అన్నారు. దానికి తగ్గట్టు శిక్షణకు వెళ్లొచ్చాక కొద్దిగా నల్లబడ్డాను. ‘చెబితే విన్నావా? అసలే ఆడపోలీసు...అంటుంటే.. ఇపుడు నల్లబడింది. మీ అమ్మాయికి ఇక పెళ్లవదు...’ అంటూ శాపనార్థాలు పెట్టారు. 2014లో పదోన్నతితో హెడ్ కానిస్టేబుల్ అయ్యాను. 76 మంది పిల్లల జాడ పట్టుకున్నాక.. ఈ ఏడాది నవంబరులో ఏఎస్ఐగా పదోన్నతి వచ్చింది. ఇలాంటి ప్రమోషన్ ఢిల్లీ పోలీసు చరిత్రలో నాకే తొలిసారిగా దక్కింది. దీంతో నాడు వెక్కిరించినవారే... నేడు మా బంధువుల అమ్మాయి అని గర్వంగా చెప్పుకుంటున్నారు. – అనిల్కుమార్ భాషబోయిన సాక్షి, హైదరాబాద్ భర్త, కుమారుడితో సీమ -
కాల్చుకుని చనిపోయిన ఏసీపీ.. దూకేసిన భార్య
ఆయనో సీనియర్ పోలీసు అధికారి. ఏసీపీ స్థాయిలో ఉన్నారు. ఏం జరిగిందో ఏమో గానీ.. రివాల్వర్తో తనను తాను కాల్చుకుని చనిపోయారు. ఆ తర్వాత ఆయన భార్య వాళ్లుండే అపార్టుమెంట్ నాలుగో అంతస్తు బాల్కనీ నుంచి కిందకు దూకేసింది. ఈ దారుణ ఘటన ఢిల్లీ శివార్లలోని నోయిడాలో సోమవారం అర్ధరాత్రి జరిగింది. ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్లో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తున్న అమిత్ సింగ్, సరిత దంపతులకు 18 నెలల కుమార్తె కూడా ఉంది. ఈ ఘటన జరిగిన తర్వాత అపార్టుమెంట్లో ఉండేవాళ్లు పోలీసులకు ఫోన్ చేశారు. దంపతులను ఆస్పత్రికి తరలించగా, అమిత్ సింగ్ అప్పటికే మరణించారని, ఆయన భార్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే ఈ ఘటనకు కారణం ఏంటో మాత్రం ఇంకా తెలియడం లేదు. అమిత్ సింగ్ ఓ గదిలోకి వెళ్లి, తలుపు వేసుకుని కాల్చేసుకున్నారు. ఆ శబ్దం వినగానే సరిత పరుగున వెళ్లి గార్డును, ఇరుగు పొరుగులను పిలిచింది. మృతదేహాన్ని చూడగానే ఆమె వెళ్లి బాల్కనీ లోంచి దూకేసింది. మూడేళ్ల క్రితం పెళ్లయిన ఈ దంపతుల మధ్య ఇటీవల తరచు గొడవలు జరుగుతున్నట్లు తెలిసింది.