breaking news
Dance artists
-
నృత్య పోటీల్లో..శ్రీరాధాకృష్ణ ‘హై’లైట్
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): “గోదావరి నీటిని తాగితే కళాకారులవుతారు’ అనేది నానుడి. దీనిని నిజం చేస్తూ అనేక మంది సంగీత, నృత్య కళాకారులు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. మరికొందరు సరిహద్దులను దాటి ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటుతున్నారు. చరిత్ర పుటల్లో తమదైన ముద్రను వేసి రాజమహేంద్రవరం ఖ్యాతిని నలుదిశలా చాటుతున్నారు. ఆ కోవలోకే శ్రీరాధాకృష్ణ కళాక్షేత్రం చేరింది. ఈనెల 2న మలేషియాలోని టీఎంసీ ఆడిటోరియంలో జరిగిన పోటీల్లో 14 బహుమతులను గెలుచుకుని ఇక్కడి కళాకారులు ప్రతిభ చాటారు. ఇందులో ప్రథమ బహుమతి ఉండటం విశేషం. మలేషియాలోని స్వర్ణ మరియమ్మన్ కుచాంగ్ వారు ఇంటర్నేషనల్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ పోటీలను ఆన్లైన్ ద్వారా నిర్వహించారు.ఇందులో 13 దేశాల నుంచి 615 మంది కళాకారులు పాల్గొన్నారు. గాత్రం, ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్, క్లాసికల్ డ్యాన్స్, సెమీ క్లాసికల్ వంటి విభాగాల్లో పోటీలు నిర్వహించారు. దీన్లో శ్రీరాధాకృష్ణ కళాక్షేత్రం నుంచి 68 మంది విద్యార్థులు పాల్గొని 14 మంది బహుమతులు గెలుచుకున్నారు. ఆన్లైన్లో పోటీలు మలేషియాలో జరిగిన ఈ పోటీల్లో ఆన్లైన్ ద్వారా కళాకారులు తమ ప్రతిభను కనబరిచారు. వీటిని రికార్డ్ చేసుకున్న నిర్వాహకులు అన్నీ పరిశీలించాక బహుమతులు ప్రకటించారు.స్థానిక శ్రీరాధాకృష్ణ క్షేత్రం మొత్తం 14 బహుమతులు దక్కించుకుంది. ఇందులోమొదటి బహుమతి కూచిపూడి నాట్యానికి రాగా, ఐదు ద్వితీయ బహుమతుల్లో రెండు గాత్రం, ఒకటి సెమీ క్లాసికల్, రెండు కూచిపూడికి వచ్చాయి. తృతీయ బహుమతులు రెండు కూచిపూడి నృత్యానికి, సెమీ క్లాసికల్కు రెండు, గాత్రానికి ఒకటి వచ్చాయి. ఇవి కాకుండా కన్సొలేషన్ బహుమతులు సెమీ క్లాసికల్కు ఒకటి, కూచిపూడి నృత్యానికి రెండు వచ్చాయి. ఆయా బహుమతులను మలేషియా నుంచి కొరియర్లో మంగళవారం కళాక్షేత్రానికి వచ్చాయి. ఈ బహుమతులను శ్రీరాధాకృష్ణ కళాక్షేత్ర నిర్వాహకులు డాక్టర్ జి.వి. నారాయణ, డాక్టర్ ఉమా జయశ్రీ కళాకారులకు అందజేశారు.చదువుతో పాటు డ్యాన్స్ కూడా... నేను పదో తరగతి చదువుతున్నా. ఆరేళ్ల నుంచి కూచిపూడితో పాటు కర్ణాటక సంగీతం నేర్చుకుంటున్నా. మలేషియాలో జరిగిన పోటీల్లో సీనియర్ విభాగంలో ప్రథమ బహుమతి వచ్చిoది. నాట్యాచార్యులు ఉమ జయశ్రీ నాట్య సాధన చేస్తున్నా. అలాగే చదువుకూ సమయం కేటాయిస్తున్నా. – చెరుకుమిల్లి సిరిచందన నాట్యం అంటే ప్రాణం నేను ఏడో తరగతి చదువుతున్నాను. నాకు నృత్యం అంటే ప్రాణం. మలేషియాలో జరిగిన పోటీలో ద్వితీయ బహుమతి వచి్చంది. నేను 2024లో కశీ్మర్ నుంచి కన్యాకుమారి వరకూ ప్రతి ప్రముఖ దేవాలయంలో నృత్య నీరాజన కార్యక్రమంలో పాల్గొన్నా. – కె.హర్షిత కావ్య అనేక బహుమతులు వచ్చాయి నేను ఐదోతరగతి చదువుతున్నాను. మలేషియా పోటీలో సెమీ క్లాసికల్ జూనియర్ కేటగిరీలో ద్వితీయ స్థానం సాధించా. 2023 జూన్లో శ్రీరాధాకృష్ణ కళాక్షేత్రం వారు నిర్వహించిన హనుమాన్ చాలీసాను 14 గంటల 2 నిమిషాల పాటు 101 మంది కళాకారులతో కలసి నృత్యం చేసినందుకు గోల్డెన్ స్టార్, భారత్ వరల్డ్ రికార్డ్, గిన్సిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం పొందా. – ధర్నాలకోట శరణ్య -
నాట్య మయూరి అన్నపూర్ణాదేవి ఇకలేరు
సాక్షి, అమరావతి/విజయవాడ కల్చరల్: ప్రఖ్యాత నాట్య కళాకారిణి లంక అన్నపూర్ణాదేవి (70) అడుగులు ఆగిపోయాయి. నాట్యమయూరి, కళానిధి, కళాప్రపూర్ణ బిరుదులందుకున్న ఆమె విజయవాడ రామవరప్పాడులోని వృద్ధాశ్రమంలో మంగళవారం మృతి చెందారు. కృష్ణా జిల్లా తేలప్రోలులో బుధవారం అంత్యక్రియలు జరిగాయి. నాట్య కళాకారిణిగా జీవితంలో ఎన్నో ఆటు పోట్లను ఎదుర్కొని విజేతగా నిలిచి ఎందరికో స్ఫూర్తినిచ్చారు. ఈ విషయమై గతేడాది సెప్టెంబర్లో ‘తడబడిన నాట్య మయూరి అడుగులు’ శీర్షికన ‘సాక్షి’ ప్రత్యేక కథనం ప్రచురించింది. అన్నపూర్ణాదేవి జీవన నేపథ్యమిదీ.. ► కృష్ణా జిల్లా గుడివాడలో లక్ష్మీనారాయణ, సుబ్బలక్ష్మి దంపతులకు 1949 మే నెలలో జన్మించిన లంక అన్నపూర్ణాదేవి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ► చిన్నప్పుడే ఆమె చింతా సీతారామాంజనేయులు, భాగవతుల రామతారకం వద్ద భరత నాట్యం నేర్చుకున్నారు. కూచిపూడి కులపతి చింతా కృష్ణమూర్తి వద్ద కూచిపూడి నృత్యాన్ని అభ్యసించి దేశవ్యాప్తంగా ఎన్నో ప్రదర్శనలిచ్చారు. ► 1962లో భారత్–చైనా యుద్ధ సమయం లో దేశ సరిహద్దులకు వెళ్లి సైనికులలో ఉ త్తేజం నింపేలా నాట్య ప్రదర్శనలిచ్చారు. ఇందుకు గాను నాటి ప్రధాని నెహ్రూ, ఆయన కుమార్తె ఇందిర, రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ అభినందనలు అందుకున్నారు. ► 1973లో రైలు ప్రమాదంలో అన్నపూర్ణకు ఒక కాలు మోకాలి వరకు తెగిపోగా, మరో కాలు మడమ వరకు దెబ్బతింది. ► ఆ తరువాత కొయ్య కాలు అమర్చుకుని దేశవ్యాప్తంగా 200కు పైగా ప్రదర్శనలు ఇచ్చారు. ► 1982లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ ఘంటసాల సంగీత కళాశాలలో డ్యాన్స్ టీచర్ ఉద్యోగం ఇచ్చింది. ► 2006లో ఉద్యోగ విరమణ చేసిన ఆమె విజయవాడ సత్యనారాయణపురంలో స్థిర పడ్డా రు. గతేడాది సెప్టెంబర్లో అనారోగ్యం పా లైన ఆమెను బంధువులు, శిష్యు లు వైద్యం చేయించి వృద్ధాశ్రమంలో చేర్పించారు. కళాకారుల సంతాపం లంక అన్నపూర్ణాదేవి మృతి పట్ల నగరానికి చెందిన ఆంధ్ర నాట్యాచార్యుడు ఉమామహేశ్వర పాత్రుడు, పద్మశ్రీ హేమంత్, హైదరాబాద్కు చెందిన శిష్యురాలు భావన సంతాపం తెలిపారు. -
ప్రతి అడుగు ఒక పర్యటనే
కళ్లు తెరిచి చూస్తే... భౌతిక రూపాలు కనిపిస్తాయి. మనసుతో చూస్తే... అచ్చమైన ఆర్ద్రత కళ్లకు కడుతుంది. మనోనేత్రంతో చూస్తే... స్వచ్ఛమైన జీవితాలు కనిపిస్తాయి. జీవితాలను చూడటం... జీవించడంలో అందాన్ని చూడటమే తన పర్యటనల ఉద్దేశం అంటారు కవిత బుగ్గన. ఈ ఏడాది... భారతీయ నాట్య కళాకారిణి మృణాళినీ శారాబాయ్, ప్రముఖ ఉర్దూ కవి కైఫీ అజ్మీల శత జయంతి. దేశం ఇప్పటికే జాతిపిత మహాత్మాగాంధీ నూటయాభయ్యవ జయంతి ఉత్సవాలను జరుపుకుంటోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్.. 2019లో శుక్రవారం (జనవరి, 25) నాడు తన తొలి పుస్తకాన్ని ఆవిష్కరించారు కవిత బుగ్గన. ‘వాకింగ్ ఇన్ క్లౌడ్స్: ఎ జర్నీ టు మౌంట్ కైలాస్ అండ్ లేక్ మానససరోవర్’ అనే ఆ రచనను వెలువరించడానికి ముందు మూడు దశాబ్దాల ఆమె అధ్యయనం ఉంది. శ్రీలంక, నేపాల్, టిబెట్, లెబనాన్, రుమేనియా, ఇటలీ, ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్, అమెరికా, కెనడా, స్పెయిన్, చైనా, జపాన్, కంబోడియా, మయన్మార్, థాయ్లాండ్, టాంజానియా దేశాల్లో పర్యటించారామె. ఆ పర్యటనల్లో మనిషి జీవితాన్ని చూశారామె. పరిస్థితులు జీవితాన్ని ఎన్ని మలుపులు తిప్పుతాయో కాంబోడియా పర్యటనలో తెలుసుకున్నారు. రిషి వ్యాలీ స్కూల్ ఆమెకు అక్షరాలను, పాఠాలను చదవడంతోపాటు ప్రపంచాన్ని చదవడం కూడా నేర్పించింది. అన్నింటికంటే ముందు ప్రశ్నించడం నేర్పించింది. ఆ లక్షణమే ఆమెను మానసరోవర్ యాత్రలో రాక్షస్ తాల్ నీటిని తాగించింది. రాక్షస్ తాల్ విషపు నీటి మడుగు అనే మూఢనమ్మకాన్ని తుడిచేయడానికి తన వంతు ప్రయత్నం చేయించింది. పర్యటన అంటే... ప్రదేశాలను కళ్లతో చూడటం కాదు, పరిస్థితులను మనోనేత్రంతో చూడటం అంటూ.. తన అనుభవాలను, అనుభూతులను సాక్షితో పంచుకున్నారు కవిత. ‘‘నేను ఎక్కడికి వెళ్లినా టూర్ ఆపరేటర్లు రూపొందించిన ఐటెనరీలో వెళ్లను. ఆ టూర్లు... మనకు కట్టడాలను చూపిస్తాయి, వస్త్ర దుకాణాలను చూపిస్తాయి, స్థానికంగా తయారయ్యే హ్యాండీక్రాఫ్ట్స్ను మన చేత కొనిపించడానికి ప్రయత్నిస్తుంటాయి. నేను చూడాలనుకునేది చరిత్రను తెలిపే గొప్ప నిర్మాణాలతోపాటు అక్కడి ప్రజల జీవితాన్ని కూడా. అందుకే వెళ్లిన ప్రతి చోట మొదట మార్కెట్కు వెళ్తాను. అక్కడి పండ్లు, కూరగాయలను చూస్తే ఆ నేలల్లో ఏం పండుతాయో తెలుస్తుంది. ఆహారపు అలవాట్లు అర్థమవుతాయి. వర్క్ ప్లేస్, వర్షిప్ ప్లేస్లు మనుషుల ఇష్టాలు, విశ్వాసాలను చెప్పేస్తాయి. కైలాస విశ్వాసాలు మానస సరోవర్, మౌంట్ కైలాస్ పర్యటన... హిందూ, బౌద్ధ, జైన, బాన్ మత విశ్వాసాలకు ప్రతీక. కైలాస్ పర్వతం మీదకు వెళ్లిన తర్వాత కొందరు తిరిగి రావడానికి ఇష్టపడరని తెలిసినప్పుడు ఆశ్చర్యం వేసింది. ప్రాణం పోయే వరకు అక్కడే ఉండాలనుకునే వాళ్లు కూడా ఉంటారు. బుద్ధ పూర్ణిమ రోజున టిబెట్ నలుమూలల నుంచి ప్రజలు, బౌద్ధ సన్యాసులు పెద్ద సంఖ్యలో కైలాస పర్వతానికి వచ్చి, బౌద్ధ శాక్యముని వర్ధంతి, సాగదేవ జయంతిని కీర్తనలు, ప్రార్థనలతో దీక్షగా నిర్వహిస్తారు. కైలాస పర్వతాన్ని హిందువులు శివపార్వతుల క్షేత్రంగా భావిస్తారు. బౌద్ధులు చక్రసంవర, వజ్ర విరాహిలను కొలుస్తారు. మహాయాన బౌద్ధంలో వజ్రయానం అక్కడ ప్రాక్టీస్లో ఉంది. నా పర్యటన ఆద్యంతం చిన్న చిన్న గ్రామాల గుండా సాగింది. అక్కడ కరెంటు లేదు. ఆధునిక ఉపకరణాల్లేవు. స్థానిక గిరిజనులు ఏ మాత్రం సమతలంగా లేని ఎగుడుదిగుడు నేలలోనే వ్యవసాయం చేస్తారు. అనువైన పరిస్థితులు లేవని చింత వారిలో ఏ మాత్రం కనిపించదు. అటవీ ఉత్పత్తులను సేకరించి మైదాన ప్రదేశాలకు వెళ్లి అమ్ముకుంటారు. ‘ప్రకృతి మనకు ఏమి ఇస్తుందో అంతే తీసుకోవాలి, అంతలోనే జీవితాన్ని చక్కదిద్దుకోవాల’నే ఫిలాసఫీ కనిపిస్తుంది. అంతే తప్ప తమ జీవిక కోసం ప్రకృతికి హాని కలిగించరు. మన గూర్ఖాలు కర్నాలి నది నేపాల్లో పొడవైన నది. మానససరోవర్ ప్రదేశంలో మొదలైన ప్రవాహం మనదేశంలో గంగానదిలో కలుస్తుంది. మ్యూల్ గుర్రాలు ప్రశాంతంగా పచ్చిక బయళ్లలో మేస్తూ ఉంటాయి. స్థానికులు అడవి గేదెలు, మేకలను పెంచుకోవడం కనిపిస్తుంది. రాళ్లు పలకలుగా ఉంటాయి. బహిరంగ ప్రదేశాల్లో ఆ రాతి పలకలనే సిమెంట్ బెంచీలుగా అమరుస్తారు. స్కూలు పిల్లలు ఆ రాతి బెంచీల మీద కూర్చుని హోమ్వర్క్ చేసుకోవటం చూసినప్పుడు మనిషి పరిస్థితులకు అనుగుణంగా తనను తాను ఎలా మలుచుకుంటాడో కదా అనిపించింది. కర్నాలి నది నీళ్లు మరకతాల పచ్చదనాన్ని, నీలాల నీలివర్ణాన్ని కలుపుకుని వజ్రంలా మెరుస్తుంటాయి. నా ప్రయాణం ‘హమ్లా’ ప్రాంతంలో ఉన్న చిన్న చిన్న సెటిల్మెంట్ల మీదుగా సాగింది. అన్నీ బంకమట్టి, బండరాళ్లతో కట్టిన చిన్న చిన్న ఇళ్లు. పై కప్పు మీద గడ్డి పరుస్తారు. పర్వతాల నుంచి వచ్చే పెనుగాలుల నుంచి రక్షణ కోసం అలా కట్టుకుంటారు. ఓ సెటిల్మెంట్లో మమ్మల్ని (బృందంలో ఉన్న కజిన్ పల్లు, ప్రార్థన, జెఫ్, కేటీ ) చూసి ‘ఇండియా ఇండియా’ అని అరిచారు పిల్లలు. ఒక వ్యక్తి ‘ఇండియాలో ఎక్కడ’ అని హిందీలో అడిగాడు. ‘హైదరాబాద్’ అని చెప్పాం. కానీ వీళ్లకు హైదరాబాద్ ఎలా తెలుస్తుంది అనుకున్నాను. ఆశ్చర్యంగా ‘తెలుగా’ అని అడిగాడతడు. నాకు నోట మాట రాలేదు. ‘అవును’ అనగానే అతడు తెలుగులో ‘మీ పేరేంటి’ అని అడిగాడు. నేను తేరుకుని ‘మీకు తెలుగు ఎలా వచ్చు’ అని అడిగితే... అప్పుడు... తాను విశాఖపట్నంలో గూర్ఖాగా పనిచేశానని. ఇక్కడి గ్రామాల వాళ్లు చాలా మంది ఉపాధి కోసం ఇండియాలో అనేక నగరాలకు వస్తుంటామని చెప్పాడతడు. భిక్షతో ఆత్మశుద్ధి థాయ్లాండ్లో బౌద్ధాశ్రమాన్ని చూడటంతోపాటు బౌద్ధ సన్యాసుల జీవనశైలిని అనుసరించాను. ఉదయమే లేచి వాళ్ల వెనుక గ్రామాల్లోకి భిక్షకు వెళ్లడం... మన ఆత్మను శుద్ధి చేస్తుంది. మనలోని అహాన్ని చంపేస్తుంది. అహాన్ని చంపేయడంలో బౌద్ధాన్ని మించిన మతం మరోటి ఉండదనే చెప్పాలి. శ్రీలంక, బర్మాతోపాటు దక్షిణాసియా దేశాల్లో తెరవాద బౌద్ధం విస్తృతంగా ఉంది. చైనా, జపాన్, ఉత్తర ఆసియా దేశాల బౌద్ధులు అనుసరించే మతం మహాయాన బౌద్ధం. టిబెట్లో బౌద్ధాన్ని దగ్గరగా చూడగలిగాను. తొలినాటి బౌద్ధం చెప్పని తాంత్రికత ఆచరణలో ఉందక్కడ. ఇక టిబెట్లో కుక్కలైతే... చూడగానే భయమేస్తుంది. సింహాలంత ఉంటాయి. మనుషుల్ని తినేస్తాయి కూడా. ఇక్కడ పరిమితికి మించి మైనింగ్ చేయడం వల్ల మట్టి వదులై తరచూ కొండ చరియలు విరిగిపడుతుంటాయి. అది గోల్డ్ మైనింగ్ అని చెప్పాడు మా గైడ్ చిరింగ్. రాక్షసుల సరస్సు మానçసరోవర్తోపాటు రాక్షస్ తాల్ అనే మరో సరస్సు కూడా ఉంది. మానసరోవరం వలయాకారంగా ఉంటే, రాక్షస్తాల్ అర్ధ చంద్రాకారంలో ఉంది. వీటిని సూర్యచంద్ర సరస్సులు అని కూడా అంటారు. రాక్షస్ తాల్లో నీరు విషపూరితమని చెబుతారు. శివుని కోసం రావణుడు తపస్సు చేసింది ఈ సరస్సు తీరానే అని హిందువులు చెబుతారు. రావణుడి కారణంగానే అది విషపూరితమైందని, రాక్షస సరస్సుగా పేరు రావడానికి కారణం కూడా రావణుడు తపస్సు చేయడమేనని, ఆ నీటిని తాగితే చచ్చిపోతారని చెబుతారు. మానసరోవరం దేవతల సరస్సు కాబట్టి అందులో నీటిని తాగవచ్చు, ఆ నీటిలో మునిగితే పుణ్యం ప్రాప్తిస్తుందని విశ్వాసం. పుణ్యం ప్రాప్తించడం అనే నమ్మకం వల్ల ఎవరికీ నష్టం ఉండదు, కానీ ఒక సరస్సును విషపూరితమని ప్రచారం చేయడం ఏమిటి... అనిపించింది. అందుకే కప్పుతో రాక్షస్ తాల్ నీటిని ముంచుకుని తాగాను. నీరు చల్లగా, శుభ్రంగా ఉన్నాయి. అయితే కొద్దిగా ఉప్పగా ఉన్నాయి. తాగడానికి అనువుగా లేని నీరు అనే కారణంగా విషపూరితం అనీ, రాక్షసుల సరస్సు అని, రావణుడి కారణంగానే ఇలా జరిగిందనే అపోహలతో కథనాలను సృష్టించడం ఎందుకు అని కూడా అనిపించింది. నాతో ఉన్న పల్లు ఆ నీటిని ఎందుకు తాగావని కోప్పడింది. ‘ఆ నీరు విషపూరితమనేది అపోహ మాత్రమే’ అని నిరూపించడానికే అన్నాను. అంతే కాదు, ఆ సరస్సు తీరాన మెడిటేషన్ కూడా చేశాను’’. యుద్ధం నుంచి జీవితం పర్యటనలన్నింటిలో జీవితం పెట్టే పరీక్షలను ఎదుర్కొని నిలబడిన కంబోడియా మహిళ నన్ను ముగ్ధురాలిని చేసింది. ఖ్మేర్ పాలనలో ప్రజాజీవనం అస్తవ్యస్తం అయింది. తినడానికి తిండి దొరకని పరిస్థితి, ఎప్పుడు దాడులు జరుగుతాయోననే భయానక వాతావరణం. సైనిక దాడిలో ఒక కుటుంబంలో యజమాని మరణించాడు. ఆ దాడిని ప్రత్యక్షంగా చూసిన అతడి భార్య పిచ్చిదైపోయింది. పదకొండేళ్ల కొడుకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఎటో వెళ్లిపోయాడు. ఇక మిగిలింది ఐదేళ్ల అక్క, మూడేళ్ల చెల్లి. ఆ చెల్లిని బతికించుకోవడం ఆ అక్క బాధ్యత. మార్కెట్లో పారేసిన పండ్లు, కూరగాయలను ఏరి పాడై పోయిన వరకు తీసేసి బాగున్న భాగాన్ని తిని కడుపు నింపుకోసాగారు. కొన్నాళ్లకు సైనికులు ఆ మార్కెట్ను కాల్చేశారు. మూడేళ్ల చెల్లి ఆచూకీ లేదు. ఇక మిగిలింది తానొక్కటే. మార్కెట్ ఆధారం కూడా లేకుండా తనను తాను బతికించుకోవాలి. యుద్ధంలో అనాథలైన పిల్లలకు ఆశ్రయమిస్తున్న బౌద్ధారామానికి వెళ్లిందా ఐదేళ్ల అమ్మాయి. ఆడపిల్లలకు అనుమతి లేదన్నారు. తన కళ్ల ముందే మగపిల్లలను తీసుకెళ్లడం కనిపిస్తోంది. మగపిల్లాడిలా దుస్తులు మార్చుకుని ఆశ్రమంలో చేరిపోయింది. పదమూడేళ్ల వరకు ఇబ్బంది రాలేదు. అమ్మాయి అనే వాస్తవం బయటపడే వయసది. అప్పుడు ఆశ్రమ పెద్ద పిలిచి జీవితాన్ని ఎలా నిర్మించుకోవాలనుకుంటున్నావు– అని అడిగారామెని. ‘చాలా భాషలు నేర్చుకోవాలనుంది’ అని చెప్పింది. ఒక సన్యాసి ఆమెకి ఒక బంగారు పళ్లెం ఇచ్చి, వృద్ధ దంపతుల సంరక్షణలో ఉంచారు. అలా పెరిగిన మహిళ ఇప్పుడు ఆంగ్కోర్వాట్లో ఒక కేఫ్, స్టోర్ నడుపుతోంది. సోషల్ వర్క్ చేస్తోంది. బయోగ్రఫీ రాస్తే ‘ప్లేట్ ఆఫ్ గోల్డ్’ అని పేరు పెడతానని చెప్పిందామె. జీవితాన్ని నిలబెట్టుకోవాలనే ఆకాంక్ష ఉంటే ఎన్ని ప్రతికూలతలు ఉన్నా జీవితాన్ని అందంగా తీర్చిదిద్దుకోవచ్చు అని అర్థమైంది. తాత్విక జీవనం నెల్లూరులో పుట్టి, అమెరికాలోని వాషింగ్టన్లో పెరిగి, రిషివ్యాలీ స్కూలుకు వచ్చి ఆధ్యాత్మిక తత్వాన్ని ఒంటబట్టించుకున్నారు కవిత బుగ్గన. ఎమ్మెస్సీ కంప్యూటర్స్, ఎకనమిక్స్లో ఎంఫిల్ ఇవ్వని సంతృప్తిని ప్రపంచాన్ని చదవటంలో పొందుతున్నారామె. భర్త హరి బిజినెస్మన్. పిల్లలు ప్రణవ్, రోహన్ యుఎస్లో చదువు కుంటున్నారు. ఆధ్యాత్మికత అంటే జీవితం నుంచి, సమాజం నుంచి వెళ్లిపోవడం కాదు... చేసే పనిలో కరుణను నింపుకోగలిగితే అది ఆధ్యాత్మిక జీవనమేనన్నారు. -
ఘనంగా మహంకాళి బోనాలు
కాజీపేటలో సందడే సందడి * అమ్మవారికి మొక్కులు * చెల్లించుకున్న భక్తులు * ఆకట్టుకున్న కళాకారుల నృత్యాలు కాజీపేట: పట్టణ శివారు సోమిడిలోని మహంకాళి దేవాలయంలో ఆదివారం బోనాల పండుగ అత్యంత వైభవంగా జరిగింది. ఆషాఢమాసం చివరి ఆదివారం ఎంతో అట్టహాసంగా నిర్వహించే ఈ వేడుకల్లో వందలాది మంది భక్తులు పాల్గొని అమ్మవారిని ద ర్శించుకున్నారు. ఆలయ పూజారి ముత్యాల సరస్వతి, రాజు, లక్ష్మణ్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారి దర్శనానికి తరలిరావడంతో దేవాలయ పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. మేకలు, కోళ్లు బలిచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. పూలతో ప్రత్యేకంగా అలంకరించిన రథంపై అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని పురవీధుల్లో ఊరేగించారు. విష్ణుపురి సబర్మతి పాఠశాల, వెంకటాద్రినగర్, బాపూజీనగర్, ప్రశాంత్నగర్లో అమ్మవారికి మహిళలు మంగళహారతులతో ఎదురేగి మొక్కులు సమర్పించుకున్నారు. కాంగ్రెస్ అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుమ్మరి సాంబయ్య, టీఎన్టీయూసీ అర్బన్ జిల్లా అధ్యక్షుడు ఎండీ అంకూస్ అమ్మవారికి పూజలు నిర్వహించి ఆలయ అభివృద్ధికి చేయూత అందిస్తామని హామీ ఇచ్చారు. వీరితోపాటు పలువురు రాజకీయ నాయకులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆకట్టుకున్న నృత్యాలు.. డప్పు వాయిద్యాల మోతలు, చిందు కళాకారులు, పోతరాజులు చేసిన నృత్యాలు పట్టణ ప్రజలను ఆకట్టుకున్నాయి. దేవతామూర్తుల వేషధారణలతో చిందు కళాకారులు ఊరేగింపు అగ్రభాగాన నిలిచి నృత్యాలు చేశారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు ఆరూరి సాంబయ్య, గౌని సాంబయ్యగౌడ్, రాంచరణ్తేజ్ అభిమాన సంఘం పట్టణ అధ్యక్షుడు క్రాంతికుమార్, బక్కతట్ల మోహన్, బుర్ర తిరుపతి, స్థానిక పెద్దలు ధర్మయ్య, శ్రీనివాస్, ఎండీ అలీసాహెబ్, యాదగిరి, గద్దె సతీష్ పాల్గొన్నారు.