ప్రమాదం అంచున ‘ఒరోవిల్’
► డ్యామ్కు పెరిగిన వరద ఉధృతి
► లోతట్టు ప్రాంతాలు ఖాళీ
శాన్ ఫ్రాన్సిస్కో: అమెరికాలోని అత్యంత ఎత్తయిన (770 ఫీట్ల ఎత్తు) లేక్ ఓరోవిల్ డ్యాంకు ముప్పు పొంచి ఉంది. ఉత్తర కాలిఫోర్నియాలో కొద్ది వారాలుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఒరోవిల్ డ్యామ్లో సామర్థ్యానికి మించి నీరు చేరటంతో.. డ్యామ్లోని అత్యవసర తూము (ఎమర్జెన్సీ స్పిల్వే) ద్వారా అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. అయితే ఈక్రమంలోనే అత్యవసర తూముకు భారీగా రంధ్రాలు పడ్డట్టు గుర్తించిన అధికారులు ప్రధాన స్పిల్వే ద్వారా నీటిని దిగువకు వదులుతున్నారు.
వరదనీటి ఉధృతి పెరుగుతుండటంతో ప్రమాదం ముంచుకురావొచ్చని ముందుజాగ్రత్తగా లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేశారు. ప్రస్తుతానికి డ్యామ్కు ఎలాంటి ప్రమాదం లేనప్పటికీ.. స్పిల్వే తూము చుట్టూ నేల కోతకు గురవటంతో.. ప్రమాదం ముంచుకురావొచ్చని ముందస్తుగా లోతట్టులోని యూబా కౌంటీ, బట్ కౌంటీ, సటర్ కౌంటీల్లోని 2లక్షల మంది తీరప్రాంత వాసులను ఖాళీ చేయించారు.
లోతట్టులో భారత సంతతివారే ఎక్కువ
ఒరోవిల్ డ్యామ్ లోతట్టు ప్రాంతాల్లో భారత సంతతి ప్రజలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. డ్యాం కిందనే ఉన్న ఓరోవిల్ నగరంలో 16,260 మంది జనాభా ఉన్నారు. ఇక 65,000 మంది జనాభా ఉన్న యూబా నగరంలో అత్యధికులు భారత సంతతి ప్రజలే. అందులోనూ 13 శాతం మంది పంజాబీలు, సిక్కులు ఉన్నారు.