breaking news
Child Psychiatrist
-
Jaipur Literature Festival 2024: చిల్డ్రన్ ఫస్ట్
‘మన దేశంలో అన్నింటికీ కోర్సులు ఉన్నాయి... పేరెంటింగ్కి తప్ప. పిల్లల మానసిక సమస్యల గురించి చాలా తక్కువ పట్టింపు ఉన్న దేశం. పిల్లల్లో మానసిక సమస్యలు అధికంగా ఉన్న దేశం మనదే. పిల్లల గురించిన ఆలోచనే అందరికీ ప్రధానం కావాలి’ అన్నారు జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్లో పాల్గొన్న చైల్డ్ సైకియాట్రిస్ట్లు డాక్టర్ శేఖర్ శేషాద్రి, డాక్టర్ అమిత్ సేన్, పిల్లల మానసిక చికిత్సా కేంద్రం నిర్వాహకురాలు నేహా కిర్పాల్. ఇంకా వారేమన్నారు? ‘మన దేశంలో పదికోట్ల మంది బాల బాలికలు మానసిక సమస్యలతో బాధ పడుతున్నారు. వారిలో కేవలం ఒక్కశాతం మందికి మాత్రమే నాణ్యమైన మానసిక చికిత్స, థెరపీ అందుతున్నాయి. తల్లిదండ్రుల ప్రపంచం, పిల్లల ప్రపంచం వేరు వేరుగా ఉంది. చాలా కుటుంబాలలో సభ్యుల మధ్య కనెక్టివిటీ లేదు. దానివల్ల అనేక సమస్యలు వస్తున్నాయి’ అని తెలిపారు పిల్లల మానసిక ఆరోగ్యరంగంలో పని చేస్తున్న నేహా కిర్పాల్, శేఖర్ శేషాద్రి, అమిత్ సేన్.జైపూర్లో జరుగుతున్న జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్లో ‘రీక్లయిమింగ్ హోప్’ అనే సెషన్లో వీరు పాల్గొన్నారు. చదువుల ఒత్తిడి – ఆత్మహత్యలు పోటీ పరీక్షల ఒత్తిడి పిల్లలను ఆత్మహత్య లకు ఉసిగొల్పుతోంది. రాజస్థాన్లోని ‘కోటా’లో కోచింగ్ సంస్థల వ్యాపారం 12 వేల కోట్లకు చేరుకుంది. ఏటా లక్షమంది విద్యార్థులు అక్కడ జెఇఇ, నీట్ ర్యాంకుల కోసం చేరుతున్నారు. తీసుకున్న ఫీజు కోసం నిర్వాహకులు తల్లిదండ్రులను సంతృప్తిపరచడానికి పిల్లలపై ఒత్తిడి పెంచుతున్నారు. రోజుకు 12గంటల రొటీన్ వల్ల పిల్లలకు కొద్దిగా కూడా రిలీఫ్ లేదు. రోజువారీ పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకున్నవారికి ఒకరకమైన ట్రీట్మెంట్, మార్కులు రాక స్ట్రగుల్ చేస్తున్నవారికి ఒక ట్రీట్మెంట్ ఉంటోంది. పిల్లలు తమ మీద తాము విశ్వాసం కోల్పోతున్నారు. చెప్పుకుందామంటే తల్లిదండ్రుల నుంచి కనీస సానుభూతి దొరకడం లేదు. దాంతో ఆత్మహత్యల ఆలోచనలు, చర్యలు పెరుగుతున్నాయి. పిల్లలకు ఏం కావాలో తెలుసుకోకుండా వారు చదువుకునే గదుల్లో ఫ్యాన్లు తీసేసినంత మాత్రాన ఆత్మహత్యలు ఆగవు. పిల్లలే మనకు ప్రధానం అనుకోక΄ోవడం వల్ల ఈ దారుణ స్థితి ఉంది’ డాక్టర్ అమిత్ సేన్ అన్నారు. ఢిల్లీకి చెందిన ఈ చైల్డ్ సైకియాట్రిస్ట్ పిల్లలకు ఎలాగైనా మానసిక చికిత్స అందించాలని ‘చిల్డ్రన్ ఫస్ట్’ అనే ఆన్లైన్ క్లినిక్ని నడుపుతున్నారు. కాని పల్లెటూరి పిల్లలకు ఇలాంటి సాయం ఉంటుందని కూడా తెలియడం లేదు అని వా΄ోయారాయన. వందమంది పిల్లల్లో ఒక్కరే ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు అని తెలిపారు. పరీక్షల మేళాలు జరగాలి ‘పరీక్షలంటే మార్కులు అని పిల్లల బుర్రల్లో ఎక్కించాం. కాని పరీక్ష రాస్తున్నాం అంటే ఏదో ఒకటి నేర్చుకునే అవకాశం వచ్చింది అనే భావన పిల్లల్లో ఎక్కించాలి. నేర్చుకుని, ఆ నేర్చుకున్నది చూపుదాం అని పిల్లలు అనుకోవాలి తప్ప మార్కులు చూపిద్దాం అనుకోకూడదు. నా దృష్టిలో పిల్లలు పరీక్షలు ఎంజాయ్ చేయాలంటే పరీక్షల మేళాలు జరగాలి. మైదానాల్లో రకరకాల పరీక్షలు రాసేందుకు పిల్లలను ఆహ్వానించాలి. అక్కడే ఆ పరీక్షలకు సంబంధించిన మెటీరియల్ ఉంచాలి. పురాణాలు, క్రీడలు, భౌగోళిక ్రపాంతాలు, ఆరోగ్యం... ఇలా అనేక అంశాల మీద పరీక్షలు అక్కడికక్కడ రాయించాలి. దాంతో పరీక్షల భయంపోతుంది’ అన్నారు నిమ్హాన్స్ (బెంగళూరు) సీనియర్ చైల్డ్ సైకియాట్రిస్ట్ శేఖర్ శేషాద్రి. ‘పిల్లలు ఏదైనా సమస్య చెప్పుకోవాలనుకున్నప్పుడు ముగ్గురు వారితో సున్నితంగా వ్యవహరించాలి. ఒకరు కుటుంబ సభ్యులు... రెండు స్కూల్ టీచర్లు... మూడు సమాజం అనే చుట్టుపక్కలవారు, బంధువులు. పిల్లలకు గౌరవం ఇవ్వాలి అని కూడా చాలామంది అనుకోరు’ అన్నారాయన. ‘చైల్డ్ అబ్యూజ్ జరిగినప్పుడు పిల్లలు వచ్చి చెప్పుకుంటే వారిని దగ్గరకు తీసుకోవాల్సిందిపోయి... నువ్వే దీనికి కారణం అని నిందించే స్థితి ఉంది’ అన్నారాయన. కోవిడ్ చేసిన మేలు ‘కోవిడ్ వల్ల తల్లిదండ్రులు, పిల్లలు ఇంట్లో ఎక్కువ రోజులు కలిసి ఎక్కువసేపు గడిపే వీలు వచ్చింది. అప్పటికి గాని మన దేశంలో పిల్లలు, తల్లిదండ్రులు ఒకరికి ఒకరు సంబంధం లేకుండా ఎలా జీవిస్తున్నారో పరస్పరం అర్థం కాలేదు. కోవిడ్ వల్ల బంధాలు బలపడ్డాయి. అది జరిగిన మేలు. అదే సమయంలో పిల్లల మానసిక సమస్యలు, ప్రవర్తనలు తల్లిదండ్రులకు తెలిసి వచ్చాయి. కాని వాటికి సరైన చికిత్స చేయించాలని మాత్రం అనుకోవడం లేదు’ అన్నారు నేహా కిర్పాల్. ఈమె పిల్లల మానసిక చికిత్స కోసం ‘అమాహహెల్త్’ అనే క్లినిక్ల వరుసను నడుపుతున్నారు. ‘పిల్లల మానసిక ఆహ్లాదానికి కళలు చాలా ముఖ్యమని తెలుసుకోవాలి. ఇటీవల పిల్లల మానసిక సమస్యలకు ఆర్ట్స్ బేస్డ్ థెరపీలు బాగా ఉనికిలోకి వచ్చాయి’ అని తెలిపారు వారు. – జైపూర్ నుంచి సాక్షి ప్రతినిధి -
పువ్వులా వికసించనివ్వాలిపక్షిలా ఎగరనివ్వాలి
పూలు వాటికవే వికసిస్తాయి. మనం వెళ్లి మొక్కల ఎదురుగా కూర్చుని ‘కమాన్ బేబీ... గ్రోఅప్ గ్రోఅప్’ అనే పనే లేదు. పక్షులు వాటంతటవే ఎగురుతాయి. మనం వెళ్లి వాటి రెక్కల్లో ప్రొపెల్లర్లు అమర్చి టపటపమని పైకి ఎగరేయనవసరం లేదు. పిల్లలు కూడా పూలు, పక్షుల వంటివారే. నెమ్మదిగా, క్రమబద్ధంగా ఎదుగుతారు. రెక్కలు వచ్చినప్పుడు వాళ్లే ఎగురుతారు. ఈలోపు - మనం తొందరపడకూడదు. వారిని తొందరపెట్టకూడదు. తొందర పడితే, తొందర పెడితే ఏమౌతుందన్నదే... ఈవారం ‘లాలిపాఠం’... పిల్లలంటే... అమ్మానాన్నల ప్రేమకు ప్రతిరూపాలు. కడుపులో బిడ్డ పూర్తిగా ఒక రూపాన్ని సంతరించుకోక ముందే తల్లి కళ్లలో ఒక ఆకారం రూపుదిద్దుకుంటుంది. ఆ రూపం తల్లిని మురిపిస్తుంది. కడుపులో బిడ్డ కదలికలు మొదలై చిట్టిచేతులతో తల్లిని తాకుతుంటే తల్లి గిలిగింతలకు లోనవుతుంది. ఆ బుజ్జి చేతులు పెద్దయ్యాక ఏం చేయాలనే కలలు కూడా అప్పుడే మొదలవుతాయి. ఇక బిడ్డను చూసుకున్న తర్వాత తన ప్రేమను, కలలను రంగరించి బిడ్డకు ఉగ్గుపడుతుంది. బిడ్డకు ఒక్కో నెల నిండుతుంటే తల్లిదండ్రులు రోజుకోసారి బిడ్డ ఎదుగుదలను బేరీజు వేసుకుంటూ గడుపుతుంటారు. ఆ మమకారంలో... నిన్న పాకడం మొదలు పెట్టిన పాపాయి రేపటికి నడవాలన్నంత ఆతృత ఉంటుంది. బిడ్డను చేతుల్లోనే పెంచాలన్నంత తపన ఉంటుంది ఆ ప్రేమలో. పిల్లల్ని ప్రేమతో పెంచడమే కాదు పరిణతితో పెంచడం చాలా అవసరం అంటారు చైల్డ్ సైకియాట్రిస్ట్ డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి. పిల్లల మీద నుంచి దృష్టి మరలనివ్వకుండా పెంచడం తప్పుకాదు, పైగా చాలా అవసరం కూడా. అయితే అది ఏ వయసు వరకు... అనే స్పృహ తల్లిదండ్రులకు ఉండాలంటారాయన. పక్షులు గుడ్లు పొదిగి పిల్లల్ని పెడతాయి. పిల్లలకు రెక్కలు వచ్చే వరకు తల్లి పక్షి తన రెక్కల మాటున కాపాడుతుంది. ఆహారాన్ని నోటితో తెచ్చి పిల్లల నోట్లో పెడుతుంది. రెక్కలు వచ్చిన తర్వాత ఆహార సేకరణ నేర్పిస్తుంది. ఆహారాన్ని సేకరించడంలో నైపుణ్యం వచ్చిన తర్వాత పిల్లల్ని గూటిలో ఉండనివ్వవు పెద్ద పక్షులు. ఇది ప్రకృతి సిద్ధంగా పిల్లల్ని పెంచడంలో పాటించాల్సిన సూత్రం. ‘పువ్వు దానంతట అదే వికసించాలి, ముందుగా వికసింపచేయాలని ప్రయత్నించరాదు, అలాగే స్వతహాగా వికసిస్తున్న పువ్వుకు చేతులు అడ్డుపెట్టి నిరోధించరాదు’ అని చెబుతూ పిల్లల పెంపకంలో కొన్ని ప్రాథమిక సూత్రాలను వివరించారు. పిల్లల్ని రక్షణవలయంలో పెంచాల్సిన దశ, పిల్లలకు ప్రవర్తన నియమాలు నేర్పించాల్సిన దశ, సూచనలిచ్చి వారి పనులు వారి చేతనే చేయించాల్సిన దశ, పిల్లల అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన సమయాలు, వారు చేస్తుంటే దూరం నుంచి పర్యవేక్షించాల్సిన పరిస్థితులు, తమ నిర్ణయాలను తామే తీసుకునేటట్లు ఎప్పుడు ప్రోత్సహించాలి... వంటి వివరాలను తెలియచేశారు. ఆరేళ్ల వరకు... చంటిబిడ్డగా ఉన్నప్పుడు క్షణక్షణం కంటికి రెప్పలా కాపాడుకోవాలి. ఊహ తెలియడం మొదలైనప్పటి నుంచి కొద్దికొద్దిగా దూరం అలవాటు చేయాలి. పాపాయిని బొమ్మల ముందు కూర్చోబెట్టి ఐదు - పది నిమిషాల సేపు తల్లి కనిపించకుండా ఆడుకోనివ్వాలి. ఈ సమయంలో బిడ్డ కదలికను గమనిస్తూ ఉండాలి. సొంతంగా తన ప్రపంచంలో తానుగా కొంతసమయం గడపడం అలవాటు చేయాలి. ఆరేళ్ల వరకు పిల్లల మీద తల్లిదండ్రుల నియంత్రణ, రక్షణ 80 శాతం ఉండాలి. ఆరు నుంచి పదేళ్ల వరకు... ఈ వయసులో పేరెంట్స్ నేర్పాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే... ముందు వెనుకలు చూసుకోకుండా కొత్తవాళ్ల దగ్గరకు వెళ్లడాన్ని నివారించాలి. తెలియనివారితో వెళ్లడం, వాళ్లు ఇచ్చినవి తినడం వంటి విషయాల్లో జాగ్రత్త చెప్పాలి. అలాగే ఈ వయసులో... ఎక్కడ ఆడుకోవచ్చు, ఎక్కడ ఆడుకోకూడదు వంటివి చెప్పడంతోబాటు వాహనాలను చూసుకోకుండా రోడ్డు మీద పరుగులు తీస్తే ఎదురయ్యే ప్రమాదాలు ఎలా ఉంటాయో చెప్పాలి. చెప్పినట్లు వినకుండా దూకుడుగా వెళ్తుంటే నియంత్రించాలి. ప్రవర్తన నియమాలు నేర్పించడానికి కూడా సరైన వయసు ఇదే. పదేళ్లు దాటితే... పదేళ్లు నిండిన పిల్లల పెంపకంలో నిశితంగా ఉంటూ నియంత్రణ తగ్గించాలి. 10-13 ఏళ్ల వయసు పిల్లల మీద తల్లిదండ్రుల నియంత్రణ 40 శాతానికి మించకూడదు. ఈ వయసులో తమ అభిప్రాయాలకు ప్రాధాన్యం ఉంటోందని పిల్లలు నమ్మాలి. టీనేజ్లో... టీనేజ్ పిల్లలతో వ్యవహరించేటప్పుడు మరీ సున్నితంగా ఉండాలి. ఈ దశలో పిల్లలు చైల్డ్హుడ్ దశ దాటారనే విషయాన్ని జీర్ణించుకోవడానికి తల్లిదండ్రులు సిద్ధంగా ఉండరు. పిల్లల్లో మాత్రం తాము చిన్న పిల్లలం కాదనే అభిప్రాయంతోపాటు తాము పెద్దయ్యాం అనుకుంటుంటారు. ఈ వయసు పిల్లలతో మాట్లాడేటప్పుడు వారు చెప్పిన విషయాన్ని విని ఆశ్చర్యం ప్రకటించాలి, అది నిజమా అన్నట్లు ఆసక్తి కనబరచాలి. పిల్లల ఉత్సాహాన్ని గమనించి బయటి పనులు చెప్పి చక్కబెట్టుకుని రమ్మని ప్రోత్సహించాలి. వ్యక్తిత్వం వికసించే వయసులో... టీనేజ్ పూర్తయి 20 ఏళ్లు వచ్చేసరికి పిల్లలకు తమ హక్కులేంటో తెలుసుకోగలుగుతారు. తల్లిదండ్రులు ఏకధాటిగా ఎంత చెప్పినా అది వాళ్ల మెదడును చేరదు. చెప్పడం మానేసి చర్చించడం మొదలుపెట్టాలి. పిల్లలను మాట్లాడనివ్వాలి, అభిప్రాయాలను వ్యక్తం చేయనివ్వాలి. ఈ వయసు పిల్లలకు తల్లిదండ్రులు తమ అనుభవాలను చెప్పాలి. ఏం చేయవచ్చు, ఏం చేయకూడదు అనే నియమావళిని వివరించాలి. ఇలాంటి సందర్భంలో ‘మేము ఇలా చేశాం, ఇలాంటి ఫలితాన్ని సాధించాం’ అని చెప్పి వదిలేస్తే చాలు. పిల్లలు తామున్న పరిస్థితికి అన్వయించుకుని విశ్లేషించుకుంటారు. వారిలో ఈ ఆలోచన సాగుతున్నట్లు పైకి తెలియనివ్వరు, కానీ ప్రతి విషయాన్నీ బేరీజు వేసుకుని తామెలా చేయాలనే అవగాహనకు వస్తుంటారు. మార్గదర్శనంగా మాత్రమే..! ఇక్కడ ఒక విషయాన్ని మర్చిపోకూడదు. పిల్లలు ఈ వయసులో తాత్కాలికంగానే ఆలోచిస్తారు, దీర్ఘకాల ప్రయోజనాలను ఆశించి నిర్ణయం తీసుకోవడం చాలా తక్కువ. వాళ్ల నిర్ణయం లోపభూయిష్టంగా ఉన్నట్లు అనిపించినా కూడా దానిని ఒక్కమాటలో కొట్టిపారేయడం మంచిది కాదు. అందులో సహేతుకమైన సందేహాలను లేవనెత్తి పరిష్కారం వాళ్లనే చెప్పమనాలి, అవసరమైతే సవరణలను సూచించాలి. తల్లిదండ్రుల పాత్ర కీలకంగా మారేది ఇప్పుడే. అయితే ఆ రోల్ పిల్లలను నియంత్రించేదిగా ఉండకూడదు, దిక్సూచిగా, మార్గదర్శనంగా మాత్రమే ఉండాలి. - వాకా మంజులారెడ్డి ఊహకు వాస్తవానికి తేడా... ఆరేళ్లలోపు పిల్లలకు వాస్తవానికి, ఊహాజనితానికి మధ్య తేడా తెలియదు. కథల్లో విన్న పులి, నక్క నిజంగానే మాట్లాడతాయి అనుకుంటారు. కార్టూన్ చానెల్స్ చూస్తూ ఆ పాత్రలు చేసిన పనులు నిజంగా జరుగుతాయనుకుంటారు. పిల్లలకు ఈ తేడా తెలిసేటట్లు చెప్పడంలో తల్లిదండ్రుల పాత్ర చాలా ఎక్కువ. ఆరేళ్ల నుంచి పదేళ్ల వరకు తల్లిదండ్రుల నియంత్రణ అరవై శాతానికి పరిమితం కావాలి. ఏ బొమ్మలతో ఆడుకోవాలి, ఏ దుస్తులు ధరించాలనే నిర్ణయాలను వాళ్లకే వదిలేయాలి. ఇవి చిన్న విషయాలే, కానీ పిల్లల్లో... ‘తమ ఇష్టాన్ని అమ్మానాన్నలు కాదనరు’ అనే నమ్మకం కలిగించడం చాలా అవసరం. - డా. కల్యాణ్చక్రవర్తి చైల్డ్ సైకియాట్రిస్ట్