స్థానికులా? ప్చ్..!
త్వరలో జరిగే సాధారణ ఎన్నికలు చావోరేవో అన్న నిర్ణయానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వచ్చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. రానున్న ఎన్నికల్లో ఎవరు దండిగా ఖర్చు పెట్టగలరో వారికే ఎంఎల్ఏ టిక్కెట్లను ఖరారు చేసే యోచనలో టీడీపీ అధినేత ఉన్నట్లు కనబడుతోంది. ఈ నేపథ్యంలోనే ఆర్థిక బలం బాగా ఉన్నవారికే స్థానికులు కాకపోయినా పార్టీ టిక్కెట్ ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఈ పరిస్థితులు చూస్తుంటే చీపురుపల్లి నియోజకవర్గంలో టీడీపీ తరఫున ఎంఎల్ఏ టిక్కెట్ను ఆశిస్తున్న స్థానికులకు మింగుడు పడడం లేదు.
సాక్షి ప్రతినిధి, విజయనగరం: పెరడులోని చెట్టు వైద్యానికి పనికిరాదన్న చందాన తయారైంది చీపురుపల్లి నియోజకవర్గంలోని టీడీపీ నాయకుల పరిస్థితి. నియోజకవర్గంలో అసెంబ్లీ స్థానానికి టీడీపీ తరఫున పోటీ చేసేందుకు ఆశావహుల జాబితా చాంతాడంత ఉన్నా పక్క జిల్లా నేతలపైనే పార్టీ అధినేత దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. స్థానిక నేతల కన్నా సొమ్మున్నోళ్లపైనే ఆసక్తి కనబరుస్తున్న ట్టు పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. ఇటీవల హైదరాబాద్లో జరిగిన చర్చల సారాం శం విని పార్టీ వర్గాలు విస్తుపోతున్నాయి. అయితే వారేమైనా తక్కువ తిన్నారా? తమను కాదని వేరొకరికి టిక్కెట్ ఇస్తే పార్టీకి నియోజకవర్గంలో పుట్టగతులుంటాయా? చూద్దాం అంటూ అంతర్లీనంగా చెప్పుకుంటున్నారు.
చాంతాండంత స్థానికుల జాబితా
చీపురుపల్లి టిక్కెట్ను ఆశిస్తున్న స్థానిక ఆశావహుల జాబితా చాంతాడంత ఉంది. నాయకుడిగా చెలామణి అవుతున్న ప్రతి ఒక్కరూ టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఎంఎల్ఏ టిక్కెట్టును ఆశిస్తూ నియోజకవర్గ ఇన్చార్జిగా పనిచేస్తున్న కె.త్రిమూర్తులు రాజు, ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎంఎల్ఏ టిక్కెట్టు ఆశించి పార్టీలో చేరిన మాజీ ఎంఎల్ఏ గద్దే బాబూరావుతో పాటు ఆయన కుమార్తె, ఎన్నాళ్లుగానో ఊరిస్తున్న టిక్కెట్ తనకే దక్కుతుందన్న ఆశలో మాజీ ఎంపీ కెంబూరి రామ్మోహనరావు, బీసీ కోటాలో టిక్కెట్ ఇవ్వాలన్న డిమాండ్తో చీపురుపల్లి, గుర్ల మండలా ల పార్టీ అధ్యక్షులు రౌతు కామునాయుడు, వెన్నె సన్యాశినాయుడు రేసులో ఉన్నారు. వీరితో పాటు గుర్ల మండలానికి చెందిన కురిమినెల్లి బంగారునాయుడు, చీపురుపల్లి మండలానికి చెందిన వలిరెడ్డి శ్రీరాములు, మెరకముడిదాం మండలానికి చెందిన బూర్లె రవికుమార్ ఆశావహుల జాబితాలో చేరారు. ఎవరికి వారు తమ ప్రయత్నాలు గట్టిగానే సాగిస్తున్నారు.
అధినేత మదిలో మరొకరు
అయితే, అధినేత చంద్రబాబు వీరిని కాదని పక్క జిల్లా నేతలపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఇన్నాళ్లూ కష్టపడి రేసులో ఉన్న వారిని ఎలాగైనా ఒప్పించొచ్చని, ఒకవేళ వారు దారికి రాకపోయినా ప్రభావం చూపలేరన్న ఆలోచనతో స్థానిక నేతల అభిప్రాయాలకు భిన్నంగా నిర్ణయం తీసుకునే పనిలో ఉన్నట్టు పార్టీ వర్గాల నుంచి విన్పిస్తోంది. శ్రీకాకుళం జిల్లాపరిషత్ మాజీ చైర్మన్ కిమిడి మృణాళిని లేదంటే ఆమె భర్త గణపతిరావును అభ్యర్థిగా నిలబెట్టాలని చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. వీరిని కాదనే పరిస్థితి వస్తే భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ను కానీ ఆయన సోదరుడిని కానీ రంగంలోకి దించాలని కూడా మరోవైపు అభిప్రాయపడుతున్నట్టు సమాచారం. వీరి అభ్యర్థిత్వంపై ఇటీవల హైదరాబాద్లో చర్చ కూడా జరిగినట్టు తెలిసింది. అధినేత యోచన తెలుసుకున్న స్థానిక నేతలు అభద్రతా భావంలోకి వెళ్లిపోగా, క్యాడర్ అంతా అయోమయంలో ఉంది. స్థానిక నేతలకు కాకుండా పక్క జిల్లా నేతలకిస్తే ఇన్నాళ్లూ పడ్డ కష్టం వృథా అవుతుందని, వాళ్ల కోసం మేమెందుకు కష్టపడతామని, అధినేత ఆలోచన సరైనదని కాదని ఉసూరుమంటున్నారు.