అందరి సహకారం అవసరం
అనంతపురం అర్బన్ : ప్రజా సమస్యల పరిష్కారానికి, జిల్లా అభివృద్ధికి అందరి సహకారం అవసరమని జిల్లా పరిషత్ చైర్మన్ చమన్సాబ్ అన్నారు. పార్టీలకతీతంగా కలసిరావాలని జెడ్పీటీసీ సభ్యులకు పిలుపునిచ్చారు. జిల్లా పరిషత్తు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన తొలి సమావేశంలో ప్రణాళిక, ఆర్థిక, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, విద్య, వైద్య సేవలు, మహిళ, శిశు సంక్షేమం, సాంఘిక సంక్షేమం, పనులకు సంబంధించి ఏడు స్థాయీ సంఘాల కమిటీలు ఏర్పాటు చేశారు. చమన్సాబ్ మాట్లాడుతూ వైఎస్సార్సీపీ నుంచి 21 మంది, టీడీపీ నుంచి 42 మంది జెడ్పీటీసీ సభ్యులం ఉన్నామని, స్థాయీ సంఘాల కమిటీలలో అందరికీ అవకాశం కల్పించామన్నారు.
ఎంపీడీఓపై చర్యలు తీసుకోండి : సమస్యలపై ప్రశ్నించిన నల్లచెరువు వైఎస్సార్సీపీ సర్పంచ్పై రౌడీషీట్ ఓపెన్ చేయిస్తానని బెదిరించిన ఎంపీడీఓ రమేష్బాబుపై వెంటనే చర్యలు తీసుకోవాలని రాప్తాడు జెడ్పీటీసీ సభ్యుడు రవీంద్రరెడ్డి చైర్మన్ను కోరారు. ఈ విషయంపై జెడ్పీ చైర్మన్ స్పందిస్తూ విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు.
ప్రత్యేక గది ఏర్పాటు చేయండి : మండల పరిషత్ కార్యాలయంలో ప్రత్యేక గది కేటాయించి, ఒక అటెండర్ను ఏర్పాటు చేయాలని పలువురు జెడ్పీటీసీ సభ్యులు కోరారు. నెలలోపు ఈ సమస్యను పరిష్కరిస్తామని చైర్మన్ హామీ ఇచ్చారు. టోల్ప్లాజాల వద్ద ఉచితంగా తమ వాహనాల రాకపోకలను అనుమతించాలని సభ్యులు కోరగా.. సీఎంతో చర్చిస్తానన్నారు.సమావేశంలో జెడ్పీ వైస్ చైర్పర్సన్ సుభాషిణి, ఇచార్జ్ సీఈఓ సూర్యనారాయణ తోపాటు జెడ్పీటీసీ సభ్యులందరూ పాల్గొన్నారు.
అంతా ఏక పక్షమే !
స్థాయీ సంఘాల ఏర్పాటు, సభ్యుల నియామకం అంతా ఏక పక్షంగా జరిగిందనే విమర్శలు వస్తున్నాయి. అయితే సీఎం చంద్రబాబునాయుడు సూచన మేరకే టీడీపీ జిల్లా అధ్యక్షుడు, పెనుకొండ ఎమ్మెల్యే బి.కె. పార్థసారథితో చర్చించి స్థాయీ సంఘాలు ఏర్పాటు చే శామని జెడ్పీ చైర్మన్ వివరించారు.