రైతులను నష్ట పరిచేందుకే దీక్షలు
► తెలంగాణలో మొదటి సహకార బ్యాంకు ఎటీఏం ప్రారంభం
► మంత్రి జోగు రామన్న
ఆదిలాబాద్ అగ్రికల్చర్ : వ్యవసాయనికి లక్షల ఎకరాలకు సాగు నీరందించేందుకు ప్రాజెక్టులు నిర్మిస్తుంటే అడ్డుకొని రైతులను నష్టపరిచేందుకు సీమాంద్ర పార్టీ నాయకులు దొంగదీక్షలు చేస్తున్నారని రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగురామన్న అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కేంద్ర సహకార బ్యాంకు ఆవరణలో ఎమ్మెల్సీ పురాణం సతీష్తో కలిసి మంత్రి జోగురామన్న సహకార బ్యాంక్ నూతన ఏటీఎం సెంటర్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి రామన్న మాట్లాడుతూ సహకార సంఘాలను, సహకార బ్యాంకులను బలోపేతం చేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలను సహకార బ్యాంకుల ద్వారా రైతులకు అవసరమైన అన్ని సేవలు అందించి రైతుల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు పట్టుదలతో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
గత ప్రభుత్వాలు సహకార సంఘాలను, సహకార బ్యాంకులను నిర్వీర్యం చేయడంతో రైతులు ఎంతో నష్టపోయారని తెలంగాణ ప్రభుత్వం రైతుల అభివృద్ధే ధ్యేయంగా పెట్టుకొని సహకార సంఘాలను, సహకార బ్యాంకులను బలోపేతం చేసి రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు, రుణాలు అందించడం జరుగుతుందన్నారు. డ్వాక్రా గ్రూపు మహిళలకు సహకార బ్యాంకుల ద్వారా రుణాలు అందించడం జరుగుతుందన్నారు. ఎమ్మెల్సీ పురాణం సతీష్ మాట్లాడుతూ గతంలో నిర్వీర్యమైన సహకార సంఘాలను, సహకార బ్యాంకులను బలోపేతం చేసి నష్టాల్లో ఉన్న సహకార బ్యాంకులు లాభాలు గడించేలా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సహకార సంఘాల ఎండి మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ డిసెంబర్ మాసంలోగా గ్రామాల్లో రైతులకు మైక్రో (మినీ) ఏటీఎం సేవలు అందిస్తామని అన్నారు.
మంత్రి చేతుల మీదుగా మహిళలకు రుణాల చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీసీసీబీ అధ్యక్షుడు ఎం.దామోదర్రెడ్డి, సీఈవో శ్రీధర్రెడ్డి, సహకార సంఘాల రాష్ట్ర చైర్మన్ రవీందర్, టీఆర్ఎస్ అధ్యక్షుడు లోకభూమారెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, డీసీసీబీ మాజీ అధ్యక్షుడు రాంకిషన్రెడ్డి, డీజీఎంఎన్ సురేష్, నోడల్ అధికారి హేమంత్ కుమార్ యాదవ్, నాబార్డ్ డీజీఎం ఎన్.పురోహిత్ పాల్గొన్నారు.