breaking news
BA degree
-
సంప్రదాయ డిగ్రీలతోనూ.. సాఫ్ట్వేర్ జాబ్!
సాక్షి, హైదరాబాద్: సాఫ్ట్వేర్ జాబ్ అంటే ఇంజనీరింగ్ చేసిన వాళ్లకే అన్నది ఇప్పటివరకు ఉన్నమాట. ఇకముందు బీఏ, బీకాం, బీఎస్సీ.. వంటి సంప్రదాయ కోర్సులు చేసినా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయడానికి అవకాశం రానుంది. ఇందుకోసం సంప్రదాయ డిగ్రీల్లోనే ప్రత్యేకమైన కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. బహుళ జాతి కంపెనీలు డిగ్రీ కాలేజీల్లోనూ క్యాంపస్ నియామకాలు చేపట్టబోతున్నాయి. ఈ దిశగా ఇప్పటికే కసరత్తు వేగవంతం చేశామని, రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీలను సమాయత్తం చేస్తున్నామని రాష్ట్ర సాంకేతిక విద్యా మండలి చైర్మన్ ఆర్.లింబాద్రి తెలిపారు. మరోవైపు ఉస్మానియా సహా రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు సంప్రదాయ డిగ్రీ కోర్సుల స్వరూపాన్ని మార్చడంపై దృష్టి సారించాయి. ప్రస్తుత పరిస్థితి ఇదీ.. రాష్ట్రంలో ఏటా 4.5 లక్షల మంది సంప్రదాయ డిగ్రీ కోర్సులు (బీఏ, బీఎస్సీ, బీకాం) పూర్తిచేస్తున్నారు. వీరిలో 20 శాతం మంది కూడా తగిన జీతాలతో ఉద్యోగాలు పొందలేకపోతున్నారు. మరోవైపు రాష్ట్రంలో ఏటా రెండు లక్షల మంది వరకు వివిధ ఇంజనీరింగ్ కోర్సులు పూర్తిచేస్తున్నారు. బహుళజాతి కంపెనీలు (ఎంఎన్సీ), ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థలు క్యాంపస్ రిక్రూట్మెంట్ల ద్వారా 20 నుంచి 30 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. ఉద్యోగాలు ఉన్నా.. మారుతున్న అవసరాలకు అనుగుణంగా అభ్యర్థులు లేక ఎంపిక చేయడం లేదని కంపెనీలు చెప్తున్నాయి. అందువల్ల డిగ్రీ ఏదైనా, కోర్సు ఏదైనా సరే.. కంపెనీలకు అవసరమైన సాంకేతిక నైపుణ్యాలు ఉంటే ఉద్యోగాలు లభించే పరిస్థితి ఉందని ఒక కంపెనీ ప్లేస్మెంట్ నిర్వాహకుడు తెలిపారు. ఇందుకోసం కొత్త కోర్సులు అందుబాటులోకి రావాల్సి ఉందని పేర్కొన్నారు. డిగ్రీలో ఏం చేయబోతున్నారు? సంప్రదాయ డిగ్రీ కోర్సుల స్వరూపాన్ని పూర్తిగా మార్చేందుకు కసరత్తు జరుగుతోంది. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులు తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. పలు యూనివర్సిటీలు దీనిపై అధ్యయనం చేస్తున్నాయని ఉన్నత విద్యా మండలి తెలిపింది. ఉదాహరణకు బీకాంలో బిజినెస్ అనలిటిక్స్, బీఎస్సీలో డేటా సైన్స్ కోర్సులను ఇప్పటికే ప్రవేశపెట్టారు. సిలబస్ రూపకల్పన నుంచే ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ టాటా కన్సల్టెన్సీ భాగస్వామ్యం తీసుకున్నారు. దాదాపు 120 కాలేజీల్లో ఈ కోర్సుల్లో చేరిన విద్యార్థులకు టీసీఎస్ శిక్షణ ఇస్తోంది. కోర్సులు పూర్తయ్యాక వారికి ప్రత్యేకంగా పరీక్ష కూడా నిర్వహించి, వివిధ కంపెనీల్లో ఉద్యోగాలకు అర్హత పొందేలా చేయనుంది. ఇదే తరహాలో బీఏ, బీఎస్సీ, బీకాం డిగ్రీల్లో ఉపాధి అవకాశాలున్న కొత్త కోర్సులను తీసుకురానున్నారు. ఇందులో ఆర్ట్స్, హ్యుమానిటీస్ కోర్సుల విద్యా ప్రణాళిక రూపకల్పనకు సంబంధించి బ్రిటిష్ కౌన్సిల్తో ఎంవోయూ చేసుకున్నారు. సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించి పలురకాల కోర్సులనూ జత చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉపాధి పొందేలా డిగ్రీ కోర్సులు సంప్రదాయ డిగ్రీ కోర్సుల నాణ్యత పెంచాలన్నదే మా తపన. ఈ దిశగా కొత్త కోర్సులపై కసరత్తు జరుగుతోంది. మరో ఏడాదిలో వాటి స్వరూపం మారబోతోంది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలతోనూ ఈ దిశగా సంప్రదింపులు జరుపుతున్నాం. ఇప్పటికే టీసీఎస్ భాగస్వామ్యంతో స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇస్తున్నాం. –ఆర్.లింబాద్రి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ మంచి ప్రయత్నం సంప్రదాయ డిగ్రీ కోర్సులను మార్కెట్కు అనుగుణంగా తీర్చిదిద్దాలనే ప్రయత్నం అభినందనీయం. ఇది వచ్చే ఏడాది నుంచి అమల్లోకి వస్తుందని భావిస్తున్నాం. దీనిపై ఇప్పటికే అధ్యయనం జరుగుతోందని తెలిసింది. దీనివల్ల డిగ్రీ కోర్సులకు పూర్వ వైభవం వస్తుంది. – గౌరీ సతీశ్, కేజీ టు పీజీ జేఏసీ కన్వీనర్ -
సెలబస్లోలేని సబ్జెక్టులకు మార్కులా?
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ డిగ్రీల విషయంలో రాజుకున్న వివాదం ఇంకా సద్దుమణగడం లేదు. గుజరాత్ యూనివర్శిటీ నుంచి 1983లో మోదీకి జారీ చేసిన మాస్టర్ డిగ్రీ మార్కుల జాబితాలో పేర్కొన్న సబ్జెక్టులేవీ కూడా అసలు అప్పటి సెలబస్లోనే లేవని అప్పటి యూనివర్శిటీ ప్రొఫెసర్ జయంత్ పటేల్ తాజాగా ఫేస్బుక్లో ఆరోపించారు. ఆయన 1969 నుంచి 1983 వరకు యూనివర్శిటీ ప్రొఫెసర్గా పనిచేశారు. నరేంద్ర మోదీకి ఎంఏ సెకండ్ ఇయర్లో పొలిటికల్ సైన్స్లో 64 మార్కులు, యూరోపియన్ అండ్ సోషల్ పొలిటికల్ థాట్స్లో 62, మోడరన్ ఇండియా, పొలిటికల్ అనాలసిస్లో 69, పొలిటికల్ సైకాలోజిలో 67 మార్కులు వచ్చినట్లు మార్కుల మెమోలో పేర్కొన్నారని, నాకు గుర్తున్నంత వరకు అప్పట్లో ఇంటర్నల్ పరీక్షలకుగానీ, ఎక్స్టర్నల్ పరీక్షలకుగానీ ఈ సబ్జెక్టులేవీ లేవని జయంత్ పటేల్ తెలిపారు. అసలు ఎన్నడూ కాలేజీకి సరిగ్గా రాని మోదీకి పరీక్షల్లో ఇన్ని మార్కులు ఎలా వచ్చాయో తనకు ఆశ్చర్యంగా ఉందని అదే యూనివర్శిటీలో పనిచేసి రిటైరైన మాజీ ప్రొఫెసర్ ఒకరు మొన్ననే వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే. జయంత్ పటేల్ చేసిన తాజా ఆరోపణలను గుజరాత్ యూనివర్శిటీ రిజిస్ట్రార్ డాక్టర్ మహేళ్ పటేల్ ఖండించారు. మార్కులు పేర్కొన్న షీట్లు 30 ఏళ్ల క్రితం తయారు చేసినవని, అందులో పేర్కొన్న సబ్జెక్టులు మాత్రం ఆ సమయంలో సెలబస్లో ఉన్నవేనని ఆయన వివరించారు. నరేంద్ర మోదీ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ సర్టిఫికెట్లు నకిలీవని ఆరోపిస్తున్న ఢిల్లీ డిప్యూటి ముఖ్యమంత్రి సిసోడియా వాస్తవాస్తవాలను తెలుసుకునేందుకు గురువానం జాయింట్ తనిఖీ కోసం ఢిల్లీ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ యోగోష్ త్యాగికి ఓ సుదీర్ఘ లేఖ రాశారు. మోదీ సర్టిఫికెట్ల గురించి యూనివర్శిటీలో సంయుక్తంగా తనిఖీ చేసి, వాటి వివరాలను యూనివర్శిటీ వెబ్సైట్లో వెల్లడిద్దామని ఆ లేఖలో సిసోడియా కోరారు. ప్రధాన మంత్రి లాంటి వ్యక్తి తమ యూనివర్శిటీలో చదువుకుంటే ఏ యూనివర్శిటీ అయినా గొప్పగా ఆ విషయాన్ని చాటుకుంటుందని, కానీ మోది సర్టిఫికెట్లపై వివాదం ఏర్పడినప్పుడు కూడా వాస్తవాలతో ముందుకు రావాల్సిన ఢిల్లీ యూనివర్శిటీ ఎందుకు వెనకడుగు వేస్తోందని సిసోడియా మీడియా ముందు ప్రశ్నించారు.