breaking news
Archaeological Officers
-
ముందు ఇనుము వాడింది ఏపీలోనే!
సాక్షి, అమరావతి బ్యూరో: దేశంలో మొదటిసారిగా ఇనుము వాడింది సింధు నాగరికత ప్రజలని ఇన్నాళ్లూ అనుకున్నాం. కానీ వారి కంటే 500 ఏళ్ల ముందే.. అది కూడా ఏపీలో.. ముందుగా ఇనుమును వాడారని మీకు తెలుసా? గోదావరి నదీ తీరాన మెగాలిథిక్ నాగరికత కాలంలో ఇనుప పనిముట్లు వాడినట్లు ఏపీ పురావస్తు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. అంతేకాకుండా సింధు నాగరికత కాలం నాటి ప్రజల కంటే దక్షిణ భారతదేశంలో విలసిల్లిన మెగాలిథిక్ నాగరికత కాలం నాటి ప్రజలు ఆధునికంగా ముందున్నారని స్పష్టమైంది. పుణేకు చెందిన డెక్కన్ కాలేజీ సహకారంతో పురావస్తు శాఖ పోలవరం ముంపు గ్రామాల్లో జరుపుతున్న పరిశోధనలు ఈ విషయాన్ని నిర్ధారించడం విశేషం. బయటపడ్డ మెగాలిథిక్ అవశేషాలు.. పోలవరం ముంపు గ్రామాల్లో పురావస్తు శాఖ 4 నెలలుగా పరిశోధనలు చేస్తోంది. డెక్కన్ కాలేజ్ భాగస్వామ్యంతో తవ్వకాలు చేపడుతోంది. తూర్పుగోదావరి జిల్లా రాయునిపేట, పశ్చిమగోదావరి రుద్రమకోట వద్ద వందలాది తవ్వకాలు జరిపారు. ఈ తవ్వకాల్లో మెగాలిథిక్ యుగం నాటి అవశేషాలు బయటపడ్డాయి. ప్రధానంగా ఆ కాలం నాటి పెద్ద పెద్ద సమాధులను కనుగొన్నారు. వాటిని తవ్వగా మానవుల ఎముకలు, ఇనుప పరికరాలు, అలంకరణ రాళ్లు, మట్టిపాత్రలు బయటపడ్డాయి. మెగాలిథిక్ నాగరికత అంటే.. ఆదిమానవ దశ నుంచి పరిపక్వతతో కూడిన కుటుంబ జీవనానికి మధ్య ఉన్న సంధి దశనే మెగాలిథిక్ నాగరికత అంటారు. క్రీ.పూ.3,000 నుంచి క్రీ.పూ.1,000 మధ్య ఈ నాగరికత దక్షిణ భారతదేశంలో విలసిల్లింది. సింధులోయ నాగరికతలో క్రీ.పూ.2,500 నుంచి క్రీ.పూ.1,750 మధ్య ఇనుము వాడినట్లు పరిశోధకులు నిర్ధారించారు. కానీ అంతకంటే దాదాపు 500 ఏళ్ల క్రితమే మెగాలిథిక్ నాగరికతలో ఇనుము వాడినట్లు పురావస్తు పరిశోధనల్లో వెల్లడైంది. దీంతో నాటి మానవుల జీవన శైలి మీద పరిశోధనలు చేస్తే మరింత సమాచారం లభిస్తుందని భావిస్తున్నారు. తవ్వకాల్లో బయల్పడిన ఎముకల ఆధారంగా అప్పటి మానవుల డీఎన్ఏ మ్యాపింగ్ చేయించాలని పురావస్తు శాఖ కమిషనర్ వాణీమోహన్ నిర్ణయించారు. -
నర్మెటలో కొనసాగుతున్న తవ్వకాలు
వెలుగుచూసిన ప్రాచీన మానవుడి అస్థికలు నంగునూరు: సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెటలో పురావస్తుశాఖ అధికారులు చేపట్టిన తవ్వకాల్లో ఆదిమమానవుడి ఆనవాళ్లు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇప్పటికే మట్టి కుండలు, రాతి పనిముట్లను కనుగొన్న అధికారులు.. గురువారం ప్రాచీన మానవుడి అస్థికలను వెలికితీశారు. ఇందులో 1.80 సెం.మీ ఎముకతోపాటు, సుమారు పది వరకు చిన్నచిన్న ఎముక ముక్కలు ఉన్నాయి. ఆయుధాలను పదును పెట్టేందుకు ఉపయోగించే రాతి బండ కూడా దొరికింది. మెన్హీర్ వద్ద సుమారుగా పది అంగుళాల వరకు మట్టిని తొలగించారు. నాలుగు చోట్ల ఇంకా తవ్వకాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సందర్భంగా పురావస్తు శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నాగరాజు మాట్లాడుతూ తవ్వకాల్లో భాగంగా ఇప్పటికే మట్టి కుండలు, మృణ్మయ పాత్రలు, వేటకు ఉపయోగించే రాతి మొన, ఉలి లభించాయని చెప్పారు. మట్టి కుండల్లో ధాన్యాన్ని నిల్వ ఉంచినట్లు తెలుస్తోందన్నారు. పాలమాకులలో నాలుగు రోజులుగా రెండు సమాధులను తవ్వుతున్నామని, వారం రోజుల్లో మరిన్ని అవశేషాలు బయటపడే అవకాశముందని పేర్కొన్నారు. తవ్వకాలను చూసేందుకు చుట్టు పక్కల గ్రామాల నుంచి ప్రజల భారీగా తరలివస్తున్నారు. సిద్దిపేట ఏసీబీ నర్సింహారెడ్డి, డీఆర్డీఓ సత్యనారాయణరెడ్డిసహా, పలువురు అధికారులు తవ్వకాలను ఆసక్తిగా తిలకించారు.