ఆకట్టుకునే పందిరి తోటలు.. నవనవలాడే కూరగాయలు.. ఆధునిక సాగు విధానాలకు పుట్టిల్లు..
వర్గల్: ఆకట్టుకునే పందిరి తోటలు.. నవనవలాడే కూరగాయలు.. ఆధునిక సాగు విధానాలకు పుట్టిల్లు.. వర్గల్ మండలంలోని గౌరారం. భాగ్యనగరానికి 50 కిలో మీటర్ల దూరంలో రాజీవ్ రహదారిని ఆనుకుని ఉన్న ఈ పంచాయతీకి అనుబంధ గ్రామం సింగాయపల్లి. కూరగాయ తోటలకు ప్రసిద్ధి చెందిన ఈ గ్రామాలు జంటనగరాల ప్రజలకు ప్రతినిత్యం వివిధ రకాల కూరగాయలు సరఫరా చేస్తూ తనవంతు సహకారం అందిస్తోంది.
గౌరారం, సింగాయపల్లి గ్రామాల్లోని 200 ఎకరాల్లో 100 మందికి పైగా రైతులు ఏడాది పొడుగునా టమాట, పొట్ల, బీర, కాకర, సొర, క్యాప్సికమ్, కాలీఫ్లవర్, దోస, క్యాబేజీ తదితర కూరగాయలు సాగు చేస్తారు. ఒంటిమామిడి మార్కెట్, ఇతర ప్రైవేట్ కొనుగోలు కేంద్రాల్లో తమ ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. లాభాలు గడిస్తూనే ధరలు పతనమైన సందర్భాల్లో భారీగా నష్టాలు సైతం చవిచూశారు. ఇలా కాకుండా రైతులకు గిట్టుబాటు ధర, హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల వాసులకు కూరగాయల కొరత నివారణేలక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ‘మన ఊరు- మన కూరగాయలు’ పథకం ద్వారా గౌరారాన్ని ‘క్లస్టర్’ గ్రామంగా ఎంపిక చేసింది.
దీనిలో భాగంగా గౌరారం, సింగాయపల్లి గ్రామాలకు చెందిన దాదాపు 131 మంది రైతులను గుర్తించి 250 ఎకరాల్లో ఉద్యాన కూరగాయల సాగుకు సమాయత్తం చేసింది. టమాట, బీర, కీర, పొట్ల, సోర(ఆందెపుకాయ) తదితర కూరగాయలను సాగు చేసేందుకు ఉద్యానశాఖ ఆధ్వర్యంలో సబ్సిడీ విత్తనాలను, డ్రిప్ వస్తువులతో పాటు సాంకేతిక సహకారం, సాగులో మెలకువలను అందిస్తోంది.
పందిరి తోటలను ప్రోత్సహిస్తూ ఇక్కడి రైతులు నాణ్యమైన కూరగాయలు, అధిక దిగుబడులు సాధించేందుకు కృషి చేస్తోంది. జంట నగరాల ప్రజల అవసరాలు, ఉద్యాన సూచనలకు అనుగుణంగా సాగు చేసే కూరగాయల ఉత్పత్తులను దళారుల బారిన పడకుండా గిట్టుబాటు ధరకు విక్రయించేందుకు వీలుగా త్వరలోనే ఇక్కడ కొనుగోలు కేంద్రం ప్రారంభించనుంది. గురువారం భారత ప్రభుత్వ సలహా దారు, ‘మన ఊరు-మ న కూరగాయలు’ సలహాదారు డాక్టర్ సేకన్, బోయిన్పల్లి మార్కెటింగ్ డీడీ పద్మ హర్షలు గౌరారం గ్రామాన్ని సందర్శించారు.
నిత్యం ఉత్పత్తులు అందించగలరా..?
సర్పంచ్ తిగుళ్ల నర్సింహరెడ్డి, రైతు కమిటీ సభ్యులు పాశం నర్సింహరెడ్డి, భూంరెడ్డి, రవి శేఖర్రెడ్డి, మోహన్రెడ్డి, రామచంద్రం, లక్ష్మారెడ్డి, కిష్టారెడ్డి, నల్ల యాదగిరి, మోహన్ తదితరులతో సమావేశమైన అధికారులు కూరగాయల సేకరణ కేంద్రం ఏర్పాటు చేస్తే అంచనాలకు తగినట్లుగా ప్రతిరోజు ఉత్పత్తులు అందించగలరా అనే విషయంపై వారితో చర్చించారు. కూరగాయల సాగు ద్వారా డిమాండ్ మేర ఉత్పత్తులు సాధిస్తామని రైతులు స్పష్టం చేశారు. త్వరలోనే ఇక్కడ కూరగాయల సేకరణ కేంద్రం ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా డాక్టర్ సేకన్ తెలిపారు.
దీనిని మార్కెటింగ్ పరంగా పూర్తి సహకారం ఉంటుందని, కేంద్రా న్ని రైతు సంఘం పర్యవేక్షించి, అవసరమైన కూరగాయలు సేకరించి తమకు అందించాలన్నారు. కూరగాయల రైతులకు ప్రతిరోజు వెం టవెంటనే పేకార్డు ద్వారా డబ్బులు చెల్లింపు ఉంటుందని వివరించారు. ఇక్కడి కూరగాయల సాగుపై వారు జిల్లా ఉద్యాన అధికారిణి రామలక్ష్మి, గజ్వేల్ ఉద్యాన అధికారి చక్రపాణిలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.