రాచకొండ రంగేళీ..

రాచకొండ రంగేళీ..


 పచ్చికను చుట్టుకున్న గుట్టలు.. మధ్యలో హొయలుపోతూ సెలయేరు.. వాటిని కంటి చూపుతో నియంత్రిస్తున్న భావన కలిగించేలా రాజభవనాలు.. ఎప్పుడూ పాలనతో గంభీరంగా ఉండే అక్కడి వాతావరణం తొమ్మిది రోజులుగా ఎంతో కోలాహలంగా మారింది. సాధారణ వ్యక్తి నుంచి రాజు వరకు అందరిలోనూ ఉత్సాహం... సామంత రాజులూ వేడుకలో పాలుపంచుకుంటున్నారు. అంతటి ఉత్సాహంలోనూ ప్రజా సంక్షేమ కాంక్షే అక్కడ రాజ్యమేలింది. వర్గాల వారీగా రాజు మంతనాలు జరిపి రాజ్యం సుభిక్షంగా ఉండాలంటే ఏం చేయాలనే విషయంలో అభిప్రాయ సేకరణ జరిపారు. నచ్చినవారు తోచిన సలహాలిచ్చారు. రాజు సరేనన్నారు. మైమరిపించే ఉత్సాహం రెట్టింపయింది అక్కాడవారికి.

 

 ఊహల్లో కల్పనగా పుట్టుకొచ్చే కథలా ఉంది కదూ ఈ వర్ణన. కానీ మనకు రాజధానిగా వర్ధిల్లిన కోట గోడల సాక్షిగా ఇది యథార్థ గాథ. మన చరిత్ర అక్కడి నుంచే మొదలైందనే భావనకు రూపంగా కనిపించే హైదరాబాద్ కాదిది. అంతకు ముందు విలసిల్లిన రాచకొండ వైభవంలో ఓ భాగం. నగరానికి కూతవేటు దూరంలో నాటి రాచరిక దర్పానికి సాక్ష్యంగా నిలిచిన మొండి గోడలే దానికి తార్కాణం. హైదరాబాద్ పుట్టక పూర్వం ఆ దుర్గంలో వసంతోత్సవ వేళ సాక్షాత్కరించిన దృశ్యమే ఈ వర్ణన!  

 

 హోలీ... రంగుల కేళీ. మనకింతవరకే తెలుసు. కానీ ఈ వసంతోత్సవం వెనక పరమార్థమూ దాగి ఉంది. దాన్ని ఆచరించి చూపిందే ‘రాచకొండ’. హైదరాబాద్ సంస్థానం ఏర్పాటుకు పూర్వం ఈ ప్రాంతాన్ని రేచర్ల పద్మనాయక వంశం (1361-1475) పాలించింది. ఈ వంశంలో రెండో పాలకుడు రెండో సింగమనాయక హయాం (1384-1399) నుంచి వసంతోత్సవాన్ని నిర్వహించిన ప్రస్తావన చారిత్రక గ్రంథాల్లో ఉంది. రాచకొండ సామంతరాజ్యాల్లో ఒకటైన భీమ్‌గల్ ఆస్థానంలో కవిగా వెలుగొందిన కొరవి గోపరాజు విరచిత ‘సింహాసన ద్వాత్రింశిక’లో ఈ వసంతోత్సవ ప్రస్తావన ఉంది.

 

 మూడు వర్గాల ప్రజలతో మమేకం...

 రాచకొండలో ఇది తొమ్మిది రోజుల వేడుక. చివరిరోజు వసంతోత్సవం. ఆరోజు రాజు-బంటు తేడా లేకుండా అంతా కలిసి ఆనందాన్ని పంచుకోవటం ఆనవాయితీ. రాజప్రసాదం వెలుపల ఇందుకు ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసేవారు. దాన్ని వ జ్రవైఢూర్యాలు, రంగురంగుల పూలతో అద్భుతంగా అలంకరించేవారు.

 

 ఆ ప్రాంతానికి రాగానే కస్తూరి సువాసన గుబాళించేది. మేళతాళాలు, యువత నృత్యవిన్యాసాల సందడుల మధ్య రాజు పరివారంతో అక్కడికి చేరుకునేవారు. అందుకు గుర్తుగా భేరీలు మోగగానే ఈలలు, చప్పట్లతో ప్రజలు ఆయనను స్వాగతించేవారు. ఆ ప్రాంతం చుట్టూ విస్తరించిన తోటలు, అందులోని పూలు, పండ్ల చెట్లు కొత్త శోభను సంతరించున్న వేళ... రాజ పరివారం అందులో విహరించేది. ఆ తర్వాత సంగీత నృత్యకార్యక్రమాలు జరుగుతుండగా ప్రధాన వేదిక వద్దకు రాజ కుటుంబం చేరుకునేది. ప్రత్యేకంగా అక్కడ ఏర్పాటు చేసిన వసంత, మదన-రతి, లక్ష్మీఉపేంద్ర, గౌరీశంకర దేవాతామూర్తులకు ప్రత్యేక పూజాదికాలు నిర్వహించే వారు. మనలోని కోరికలను జయించేలా కామదహనం లాంటి ప్రత్యేక కార్యక్రమాలు హోలీ వేళ నిర్వహించే ఆనవాయితీ ఉన్నందున ఆ తరహా దేవతారూపాల పూజలు జరిగేవి. తర్వాత అక్కడికి చేరుకున్న మేధావులు, కవులు, కళాకారులతో రాజు భేటీ అయ్యేవారు.

 

  వారితో పాటు ప్రజల నుంచి పాలనపై అభిప్రాయాలు, సూచనలు, సలహాలు తీసుకునేవారు. ఆ తర్వాత సుగంధ ద్రవ్యాలు, గంధం, కుంకుమలాంటి వాటిని పరస్పరం చల్లుకుంటూ ఉల్లాసంగా గడిపేవారు. అక్కడే ఉన్న సెలయేరు (ఇప్పుడు మామూలు చెరువుగా ఉంది)లో జలకాలాటలు సాగేవి. తోటల్లోని పూలతో యువతులు మాలలు గుచ్చి రాజుకు సమర్పించేవారు. మామిడి పిందెలను తెచ్చి ఆయనకు కానుకగా ఇచ్చేవారు (ఇప్పటికీ ఆ పాంతంలో పండ్ల చెట్లున్నాయి).

 

 ‘రంగుల కేళీ ఎంత ఘనంగా జరగాలో, ఏ రూపంలో నిర్వహించాలో చాటిచెప్పే అద్భుత సంప్రదాయం రాచకొండలో అప్పట్లో విలసిల్లింది. రాజు ప్రజారంజక పాలన అందిస్తే ప్రజలు సుభిక్షంగా ఉంటారు. ఆయన ప్రజలతో మమేకమై వారికేం కావాలో తెలుసుకోవాలి. అది ఇక్కడ కనిపించింది. ఆ తీరు నేటి తరానికి ఆదర్శం కావాలి’ అని ఔత్సాహిక పురావస్తు పరిశోధకులు సత్యనారాయణ చెబుతున్నారు. కొరవి గోపరాజు రాసిన గ్రంథంలో రాచకొండ వసంతోత్సవ వైభవం కళ్లకు కట్టిందన్నారు.

 గౌరీభట్ల నరసింహమూర్తి

 

 ఇండియా అన్‌ప్లగ్‌డ్

 సంప్రదాయేతర ఇంధన వనరుల్ని ఎక్కువగా వినియోగించుకొని పర్యావరణ సమతుల్యాన్ని కాపాడాలని కోరుతూ డబ్ల్యూడబ్ల్యూస్ ఎర్త్ అవర్‌కి పిలుపునిచ్చింది. ఈ నెల 28 రాత్రి 8.30 నుంచి 9.30 వరకు దేశవ్యాప్తంగా నిర్వహించే ఈ ‘ఇండియా అన్‌ప్లగ్‌డ్’కు నగరవాసులంతా చేయూతనివ్వాలని కోరింది. బంజారాహిల్స్ హోటల్ తాజ్‌కృష్ణాలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో టెన్నిస్ తార సానియా మిర్జా పాల్గొంది. ఎర్త్ అవర్‌ను అన్ని సంస్థలు, కార్యాలయాలు పాటించి, పర్యావరణ పరిరక్షణలో అంతా భాగస్వాములు కావాలని కోరింది.

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top