
కాంట్రాక్ట్ పెళ్లి చేసుకున్న అరబ్ షేక్
బాలికను ఒప్పంద వివాహం చేసుకొన్న అరబ్ షేక్ను కంచన్బాగ్ పోలీసులు అరెస్ట్ చేసి సోమవారం రిమాండ్కు తరలించారు.
చాంద్రాయణగుట్ట: బాలికను ఒప్పంద వివాహం చేసుకొన్న అరబ్ షేక్ను కంచన్బాగ్ పోలీసులు అరెస్ట్ చేసి సోమవారం రిమాండ్కు తరలించారు. అతనికి సహకరించిన మరో ఐదుగురిని కూడా రిమాండ్కు తరలించారు. సోమవారం దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణ కథనం ప్రకారం....ఒవున్ దేశానికి చెందిన సెనేది కమీస్ మహ్మద్ కమీస్ (70) గతనెల 30న విజిటింగ్ వీసాపై నగరానికి వచ్చాడు. హఫీజ్బాబానగర్కు చెందిన మహిళకు రూ. లక్ష చెల్లించి బాలికను 15 రోజుల కోసం కాంట్రాక్టు పెళ్లి చేసుకున్నాడు. బాలికను ముంబైకి తరలిస్తుండగా సమాచారం అందుకున్న పోలీసులు పట్టుకొని బాలికకు షేక్ కబంధ హస్తాల నుంచి విముక్తి కల్పించారు. షేక్తో పాటు అతనికి సహకరించిన ట్రావెల్ ఏజెంట్ ఆసీమ్ సయీద్, పెళ్లిళ్ల బ్రోకర్ సయ్యద్ జుల్ఫీకర్ అలీ, మధ్యవర్తులు అబ్దుల్లా బిన్ హుస్సేన్ యెమానీ, నూర్జాహాన్ బేగంలను పోలీసులు అరెస్ట్ చేసి సోమవారం రిమాండ్కు తరలించారు.
కాగా, షేక్ ఒమాన్ దేశంలో అపర కోఠీశ్వరుడని పోలీసుల విచారణలో వెల్లడైంది. ధనవంతుడనే అహంతోనే నిందితుడు బాలిక జీవితాన్ని నాశనం చేయడానికి సిద్ధమయ్యాడన్నారు. కాగా, పాతబస్తీలో అమాయక బాలికలకు షేక్లతో వివాహం జరిపిస్తున్న 20 మంది ఖాజీలపై నిఘా ఉంచామని డీసీపీ తెలిపారు. అలాంటి వారిపై త్వరలోనే సస్పెక్ట్ షీట్లు, పీడీయాక్ట్ ప్రయోగిస్తామన్నారు. విలేకర్ల సమావేశంలో దక్షిణ మండలం అదనపు డీసీపీ కె.బాబురావు, కంచన్బాగ్ ఇన్స్పెక్టర్ మనోజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.