జిల్లాపై ప్రత్యేక శ్రద్ధ | Special attention to the district | Sakshi
Sakshi News home page

జిల్లాపై ప్రత్యేక శ్రద్ధ

Jan 8 2015 1:27 AM | Updated on Sep 2 2017 7:21 PM

జిల్లాపై ప్రత్యేక శ్రద్ధ

జిల్లాపై ప్రత్యేక శ్రద్ధ

రాజధాని నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాపై ప్రత్యేక శ్రద్ధ చూపింది. ప్రధానంగా భూ సమీకరణను వేగవంతం చేయడం, రైతుల నుంచి అంగీకార పత్రాలు తీసుకోవడం వంటి....

సాక్షి,గుంటూరు : రాజధాని నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాపై ప్రత్యేక శ్రద్ధ చూపింది. ప్రధానంగా భూ సమీకరణను వేగవంతం చేయడం, రైతుల నుంచి అంగీకార పత్రాలు తీసుకోవడం వంటి అంశాలపైనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు సూచనలు చేశారు. కేంద్రం తరహాలో ఒకరోజు ప్రీ బడ్జెట్ సదస్సును రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విజయవాడలోని గేట్‌వే హోటల్‌లో నిర్వహించింది. ముఖ్యమంత్రి, మంత్రులతోపాటు ఆయా జిల్లాల కలెక్టర్లు పాల్గొన్న సదస్సులో జిల్లాల వారీగా వివిధ అంశాలపై సమీక్ష జరిగింది.
 
గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్‌దండే రాజధాని భూ సమీకరణకు సంబంధించి సీఎంకు సమగ్ర నివేదిక సమర్పించినట్లు సమాచారం. ఇప్పటివరకు రైతుల నుంచి తీసుకున్న అంగీకార పత్రాలు, భూ సమీకరణ వేగవంతం కోసం తీసుకుంటున్న చర్యలను ముఖ్యమంత్రికి వివరించారని తెలిసింది. దీనిపై రాజధానికి భూములు ఇచ్చేందుకు రైతులు సుముఖంగా ఉన్నారని, వీలైనంత త్వరగా ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని సీఎం సూచించినట్లు సమాచారం.
 
జిల్లా కలెక్టర్ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లోని ముఖ్యాంశాలు....
జిల్లాలో 2,39,630 హెక్టార్లలో పంటలు సాగు కాగా 16,10,913 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం వస్తుందని అంచనా వేశారు.  జిల్లా వ్యాప్తంగా 100 ధాన్యం సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు.
 
జిల్లాలో తాగు నీటి సమస్య పరిష్కారం కోసం పులిచింతల, ప్రకాశం బ్యారేజి, నాగార్జునసాగర్, బుగ్గవాగు రిజర్వార్ ద్వారా దాదాపు 53 మండలాలు, గుంటూరు కార్పొరేషన్, 10 మునిసిపాలిటీలు కవర్ అయ్యేలా 3,367కోట్ల రూపాయలతో అధికారులు అంచనాలు రూపొందించారు.
 
అన్ని రకాల పథకాల కింద తాగునీటి కోసం రూ. 6,568.83 కోట్ల రూపాయలు అవసరమని అంచనా వేశారు. ఇందులో నుండి తుళ్ళూరు, ఫిరంగిపురం, పెదకూరపాడు, రాజుపాలెం మండలాలను మినహాయించారు.
 
జిల్లాలో ఎన్‌టీఆర్ వైద్య సేవలకు రూ.543.14 కోట్లు ఖర్చవుతుం దని నివేదించారు. జిల్లాకు 3,49,568 పింఛన్లు మంజూరయ్యాయన్నారు.
 
కొత్తగా ప్రవేశపెట్టిన ఇసుక పాలసీ అమలుకు సంబంధించి ఆరు రీచ్‌లను డ్వాక్రా మహిళలు నడుపుతున్నారని వివరించారు.
 
జిల్లాకు సంబంధించి మొదటి విడతలో 5,05,919 మందికి రూ. 2,125.76 కోట్ల రూపాయల రుణ మాఫీ అయిందన్నారు. రెండవ దశలో మరికొంత మంది రైతులు తమ వివరాలు నమోదు చేసుకొంటున్నారని తెలిపారు.
 
రేషన్ కార్డులకు సంబంధించి దాదాపు 98 శాతం ఆధార్ సీడింగ్ పూర్తి చేసినట్టు తెలిపారు. అన్ని శాఖలకు సంబంధించి ఆధార్ సీడింగ్ ఎంత మేరకు చేశారనేదానిపైన కూడా వివరించారు. సంక్రాంతి సంబరాలను ఏవిధంగా జరిపేది వివరించారు.
 
పత్తి, మిరప విస్తారంగా పండే జిల్లాలో ఆ పంటలకు సంబంధించిన పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం ఉన్న రెండు టెక్స్‌ైటైల్ పార్కులను పదికి పెంచాలి. సిగరెట్ పరిశ్రమలు కూడా ఏర్పాటు చేస్తే ఆ లబ్ధి జిల్లాకు దక్కుతుంది. అలాగే యువతలో నైపుణ్యం పెంచే విధంగా ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్ ప్రభుత్వానికి సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement