
డాక్టర్ ఇ.సి.గంగిరెడ్డి ఆసుపత్రిలో డయాలసిస్ సేవలు
పులివెందుల : పట్టణంలోని భాకరాపురంలో గల డాక్టర్ ఇ.సి.గంగిరెడ్డి ఆసుపత్రి(దినేష్ మెడికల్ సెంటర్)లో ఆదివారం నుంచి డయాలసిస్ సేవలు ప్రారంభమయ్యాయి. ఇందుకు సంబంధించిన డయాలసిస్ యూనిట్ను డాక్టర్ ఇ.సి. దినేష్రెడ్డి, మున్సిపల్ ఇన్చార్జి వైఎస్ మనోహర్రెడ్డి, మాజీ సర్పంచ్ అరవిందనాథరెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఇ.సి.దినేష్రెడ్డి మాట్లాడుతూ గంగిరెడ్డి ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ ఉంటే బాగుంటుందని నాన్న (డాక్టర్ ఇ.సి. గంగిరెడ్డి) చెప్పేవారన్నారు. ఆయన కోరిక ప్రకారం ఆసుపత్రిలో డయాలసిస్ సేవలు ప్రారంభిస్తున్నామన్నారు. నాన్నగారు పులివెందుల నియోజకవర్గంలోని చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలకు తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్య సేవలు అందించడానికి ఆసుపత్రిని అప్పట్లో ఏర్పాటు చేశారన్నారు. పులివెందుల నియోజకవర్గ ప్రజలే కాకుండా పొరుగు జిల్లాల నుంచి ప్రజలు పులివెందులకు వచ్చి వైద్య సేవలు పొందేవారన్నారు. నాన్న గారి ఆశయాలను కొనసాగిస్తూ ఆసుపత్రిలో మరిన్ని వసతులు కల్పించి ఈ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందిస్తామన్నారు. కార్పొరేట్ ఆసుపత్రిలోని వైద్య ఖర్చులకు మన ఆసుపత్రిలో వైద్య ఖర్చులకు ఎంతో వ్యత్యాసం ఉంటుందని ఆయన తెలిపారు. మున్సిపల్ ఇన్ఛార్జి వైఎస్ మనోహర్రెడ్డి మాట్లాడుతూ గంగిరెడ్డి బావ ప్రజలకు ఎంతో వైద్య సేవలు అందించి వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. గంగిరెడ్డి సార్ వద్దకు వెళితే ఎలాంటి రోగమైనా నయమవుతుందని ఆయన హస్తవాసి చాలా మంచిదని ప్రజలు నమ్మేవారన్నారు. డాక్టర్ వరలక్ష్మి మాట్లాడుతూ ఇ.సి. గంగిరెడ్డి ఆసుపత్రిలో డయాలసిస్ సేవలను ప్రజలందరూ వినియోగించుకోవాలన్నారు. ఇంతకుమునుపు దూరప్రాంతాలకు వెళ్లేవారని అలా కాకుండా ఇప్పుడు పట్టణంలోనే డయాలసిస్ సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. డాక్టర్ హర్షవర్దన్ మాట్లాడుతూ ఆసుపత్రిలో డయాలసిస్ సేవలు ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ఇక్కడ ఉన్న ప్రభుత్వాసుపత్రిలో డయాలసిస్ సేవలు అందిస్తున్నప్పటికి పడకలు సరిపడక కర్నూలు, నంద్యాల వంటి దూర ప్రాంతాలకు రోగులు వెళ్లేవారన్నారు. అలా కాకుండా తక్కువ ఖర్చుతో ఇక్కడ డయాలసిస్ వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. డాక్టర్ ఇ.సి.గంగిరెడ్డి ఆసుపత్రిలో అన్ని విభాగాలకు సంబంధించిన నిపుణులైన డాక్టర్లు అందుబాటులో ఉన్నారన్నారు. ఈ ప్రాంత ప్రజలకు 24 గంటలు వైద్య సేవలు అందించడంలో ఆసుపత్రిలోని డాక్టర్ల పాత్ర ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో డాక్టర్ వాసు, డాక్టర్ గంగాదేవి, డాక్టర్ పవన్కుమార్, డాక్టర్ రవీంద్రనాథరెడ్డి, డాక్టర్ చక్రపాణి, డాక్టర్ సుకన్య, డాక్టర్ జ్యోతి, డాక్టర్ సుప్రజ, డాక్టర్ షబానా, మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, డాక్టర్ ఇ.సి. గంగిరెడ్డి సన్నిహితులు సాంబశివారెడ్డి, బయపురెడ్డి, శశికాంత్రెడ్డి, దశరథరామిరెడ్డి, రసూల్, సర్వోత్తమరెడ్డి, హాలు గంగాధరరెడ్డి, రజనీకాంత్రెడ్డి, కోడి రమణ తదితరులు పాల్గొన్నారు.
నాన్న గారి ఆశయాలను కొనసాగిస్తాం : డాక్టర్ ఇ.సి. దినేష్రెడ్డి
పాల్గొన్న వైఎస్ మనోహర్రెడ్డి, వైద్యులు, డాక్టర్ ఇ.సి.గంగిరెడ్డి సన్నిహితులు

డాక్టర్ ఇ.సి.గంగిరెడ్డి ఆసుపత్రిలో డయాలసిస్ సేవలు