
నీటి కుంటలో పడి కాడెద్దులు మృతి
వీరపునాయునిపల్లె : మండలంలోని యలంకూరుపల్లెలో మంగళవారం ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి కాడెద్దులు మృతి చెందాయి. వివరాలిలా.. యలంకూరుపల్లె గ్రామానికి చెందిన యలంకూరు సాంబశివారెడ్డి ఎద్దులను పెట్టుకొని వ్యవసాయ పనులకు వెళ్లి వచ్చిన డబ్బుతో బతుకుదెరువు కొనసాగించేవాడు. ఉదయాన్నే వ్యవసాయ పనులకు వెళ్లి ఎద్దులకు నీటిని తాపించేందుకు బండితో సహా నీటి గుంత వద్దకు తీసుకెళ్లాడు. నీళ్లు తాగే సమయంలో బండి ముందుకు దొర్లడంతో ఎద్దులు రెండు నీటి గుంతలో పడి బురదలో ఇరుక్కు పోయి ఊపిరి ఆడక మృతి చెందాయి. రెండు ఎద్దులు మృతి చెందడంతో 2 లక్షల రూపాయలు నష్టపోవడంతో పాటు బతుకుదెరువు కోల్పోయామని కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ప్రభుత్వం ఆర్థిక సహా యం అందించి ఆదుకోవాలని వేడుకుంటున్నారు.