
నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
కడప ఎడ్యుకేషన్ : ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఏపీ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ పరీక్ష(ఏపీఈఏపీసెట్)– 2025 నేటి నుంచి జిల్లా వ్యాప్తంగా ప్రారంభం కానుంది. ఈ పరీక్షలను కంప్యూటర్ ఆధారిత(ఆన్లైన్) విధానంలో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు సిద్ధం చేశారు. ఇందులో భాగంగా 19, 20 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ(బైపీసీ) కోర్సుల ప్రవేశ పరీక్షలు జరగనుండగా, ఈ నెల 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఇంజినీరింగ్ కోర్సుల ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. ఇందులో ప్రతి రోజు ఉదయం, సాయంత్రం రెండు సెషన్స్లో పరీక్షలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి వైఎస్సార్ జిల్లాలో 8 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు. ఇందులో 13049 మంది ఇంజినీరింగ్కు, 3389 మంది మంది అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షను రాయనుండగా మరో 35 మంది రెండు కలిపి పరీక్షలను రాయనున్నారు. ఇందులో ఉదయం సెషన్ 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంట వరకు, అలాగే మధ్యాహ్న సెషన్ 2.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు ఆన్లైన్లో నిర్వహించనున్నారు.
జిల్లాలో పరీక్షా కేంద్ర వివరాలు ఇలా..
ఏపీ ఈఏపీ సెట్ పరీక్ష కోసం జిల్లాలో 8 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు. ఇందులో కడపలో ఐదు పరీక్షా కేంద్రాలను, ప్రొద్దుటూరులో మూడు పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. కడపకు సంబంధించి కేఎస్ఆర్ఎం, కేఎల్ఎం, కేఓఆర్ఎం, అన్నమాచార్య, శ్రీనివాస ఇంజినీరింగ్ కళాశాలలు, ప్రొద్దుటూరుకు సంబంధించి చైతన్య భారతి ఇన్స్టిస్ట్యూట్ ఆఫ్ సైన్సు అండ్ టెక్నాలజీ, సాయి రాజేశ్వరి ఇన్స్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వాగ్దేవి ఇన్స్టిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాలను సిద్ధం చేశారు. జిల్లాలో 8 పరీక్షా కేంద్రాలకు ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించి 13049, అగ్రికల్చర్, ఫార్మసీకి సంబంధించి 3389 మంది రెండు విభాగాలకు సంబంధించి 35 మంది అభ్యర్థులు పరీక్షలను రాయనున్నారు.
రెండు సెషన్స్లో పరీక్ష..
ఉదయం సెషన్కు సంబంధించి 7.30 గంటల నుంచే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. మధ్యాహ్నం పరీక్షకు 12.30 గంటల నుంచి 2 గంటల వరకు పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. ఉదయం 9 గంటలు, మధ్యాహ్నం 2 గంటల తరువాత నిమిషం ఆలస్యమైనా ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. పరీక్ష జరిగే రోజు కనీసం గంట ముందుగా కేంద్రానికి చేరుకోవాలి. కేంద్రాల దగ్గర తనిఖీలతోపాటు బయోమెట్రిక్ హాజరు నమోదు, సంతకం చేయాల్సి ఉన్నందున చివరి నిమిషంలో హడావుడి పడకుండా చూసుకోవాలి.
విద్యార్థులు వెంట తీసుకురావాల్సిన
వస్తువులు..
● విద్యార్థులు ఆన్లైన్లో దాఖలు చేసిన ఏపీ ఈఏపీ సెట్ –2025 దరఖాస్తు ప్రింటవుట్ కాపీతో పొందుపర్చిన నిర్ణీత బాక్స్లో విద్యార్థి కలర్ పాస్ పోర్టు సైజ్ ఫొటోను అతికించి సంబంధిత కళా శాల ప్రిన్సిపాల్తో సంతకం చేయించుకోవాలి.
● పరీక్ష జరిగే జరిగే రోజున సదరు ప్రింటవుట్ కాపీతోపాటు హాల్ టికెట్ వెంట తీసుకుని వెళ్లాలి. బ్లూ, బ్లాక్ కలర్ బాల్ పాయింట్ పెన్ను అనుమతిస్తారు. గుర్తింపు కోసం ఇంటర్ హాల్ టికెట్, పాస్పోర్టు, పాన్కార్డు, ఆధార్కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీలలో ఏదో ఒకటి ఒరిజినల్ తీసుకుని వెళ్లాలి. ఇవి మినహా ఇతర ఏ వస్తువులు అనుమతించరు.
● విద్యార్థి ఫొటో అతికించిన ఆన్లైన్ దరఖాస్తు కాపీ పై పరీక్షా కేంద్రంలో ఇన్విజిలేటర్ సమక్షంలో సంతకం చేసి ఎడమ చేతి బొటనవేలి ముద్ర వేయాలి.
నేటి నుంచి ఏపీ ఈఏపీ సెట్
ఏర్పాట్లను సిద్ధం చేసిన అధికారులు
జిల్లాలో 8 కేంద్రాల్లో ఆన్లైన్ పరీక్ష నిర్వహణ
19, 20న అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు
21 నుంచి 27 వరకు ఇంజినీరింగ్
ప్రవేశ పరీక్షలు
జిల్లా వ్యాప్తంగా 16,473 మంది అభ్యర్థులు