
రుణాలపై అవగాహన పెంచాలి
ఫ నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ ఉదయ్ భాస్కర్
ఖమ్మం వ్యవసాయం: వ్యవసాయ, వ్యవసాయేతర రుణాలపై రైతులతో పాటు అన్నివర్గాల వారికి అవగాహన పెంపొందించాలని నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్(సీజీఎం) ఉదయ్భాస్కర్ సూచించారు. ఖమ్మంలో గురువారం వ్యవసాయ, వ్యవసాయేతర రుణాలపై ప్రాంతీయ(ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్లగొండ జిల్లాల) స్థాయి బ్యాంకర్ల అవగాహన సదస్సు నాబార్డ్ ఆధ్వర్వంలో నిర్వహించారు. ఈ సదస్సులో సీజీఎం మాట్లాడుతూ.. రుణాలు అందుబాటులో ఉన్న విషయమై రైతులు, ప్రజలకు అవగాహన కల్పిస్తే సద్వినియోగం చేసుకుంటారని తెలిపారు. వివిధ రంగాల వారికి ప్రయోజనం కలిగేలా ప్రభుత్వాలు పథకాలను రూపొందించి సబ్సిడీ కల్పిస్తున్నాయని, కూరగాయల సాగు, సూక్ష్మసేద్య పరికరాలు, డ్రోన్లు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటుకు రుణాలు అందుబాటలో ఉన్నాయని చెప్పారు. ఈ విషయమై బ్యాంకర్లు విస్తత అవగాహన కల్పించాలని సీజీఎం తెలిపారు. ఈ సమావేశంలో నాబార్డ్ జనరల్ మేనేజర్ గణపతి, డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీకాంత్, ఎస్బీఐ రీజనల్ మేనేజర్ రాజశేఖర్, నల్లగొండ డీసీసీబీ సీఈఓ శంకర్రావు, అధికారులు ఆర్య రవీంద్రన్, వినయ్కుమార్, సుజిత్కుమార్, రవీందర్నాయక్, పాండురంగ తదితరులు పాల్గొన్నారు.