పత్తి రైతుకు మద్దతు | - | Sakshi
Sakshi News home page

పత్తి రైతుకు మద్దతు

Jun 6 2025 12:52 AM | Updated on Jun 6 2025 7:36 AM

పత్తి

పత్తి రైతుకు మద్దతు

కేంద్ర నిర్ణయం హర్షణీయం

మాది ఉమ్మడి కుటుంబం. ప్రతి సంవత్సరం 30 ఎకరాల్లో పత్తి సాగు చేస్తుంటాం. 200 నుంచి 250 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. సాగు ఖర్చులు, కౌలు చెల్లింపులకు పోను పెద్దగా మిగిలేది కాదు. చేతి కష్టం మటుకే మిగిలేది. కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరను పెంచడం హర్షణీయం. రైతులందరికీ సంతోషం కలిగించే విషయం. ఎకరాకు ఐదారు వేల రూపాయలు అదనంగా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే సీసీఐ కేంద్రాలను సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలల్లోనే తెరిచి కొనుగోళ్లను ప్రారంభిస్తే రైతులకు ప్రయోజనం ఉంటుంది. మద్దతు ధర పెంపుతో కలిసొచ్చే అవకాశం ఉంటుంది.

–ఎర్రంబెల్లి బాల్‌రెడ్డి, రైతు, ముత్తిరెడ్డిగూడెం

ధర క్వింటాకు రూ.589

పెంచిన కేంద్రం

ప్రస్తుతం 1,15,000 ఎకరాల్లో సాగు అంచనా

ధర పెంపుతో పెరగనున్న సాగు విస్తీర్ణం

వరికి రూ.69 పెంపు, నిరాశలో రైతులు

రామన్నపేట: నకిలీ విత్తనాలు, ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్లు, గిట్టుబాటు ధర రాకపోవడం వంటి కారణాలతో పత్తి రైతు ఏటా నష్టాలు చవిచూస్తున్నాడు. ఈక్రమంలో ఆరుగాలం శ్రమించి పంట సాగు చేసిన అన్నదాతలను ఆదుకునేందుకు కేంద్రం ముందుకొచ్చింది. అన్ని రకాల పంటలకు మద్దతు ధర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అత్యధికంగా పత్తికి క్వింటాకు రూ.589 పెంచడం రైతులకు ఊరటనిచ్చింది.

అంచనాలకు మించి సాగయ్యే అవకాశం

జిల్లాలో ఈసారి 1,15,009 ఎకరాల్లో పత్తి సాగు కానున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. కేంద్రం మద్దతు ధర పెంచడంతో సాగు అంచనాలు దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం క్వింటాకు రూ.7,521 ఉండగా.. రూ.589 పెంపుతో ఈ ఏడాది ధర రూ.8,110గా నిర్ణయించింది. వరి తర్వాత పత్తి అత్యధికంగా సాగు చేస్తున్న జిల్లా రైతులకు ధర పెరగడం కలిసొస్చే అంశంగా కనిపిస్తుంది.

రూ.5వేల నుంచి రూ.8వేల వరకు

అదనపు అదాయం

కాలం అనుకూలిస్తే ఎకరాకు 8 నుంచి 14 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. రేగడి నేలల్లో 20 కింటాళ్ల వరకు వస్తుంది. పెరిగిన మద్దతు ధర ధర వల్ల ఎకరాకు రూ.5వేల నుంచి రూ.8వేలు అదనంగా ఆదాయం వచ్చే అవకాశం ఉన్నది. పై గణాంకాల ప్రకారం 9.20లక్షల క్వింటాళ్లకు పైన రూ.53 కోట్ల ఆదాయం అదనంగా పెరిగే అవకాశం ఉంది. ఏటేటా సాగు ఖర్చులు పెరుగుతున్న తరుణంలో మద్దతు ధర పెంపువల్ల సమకూరే అదనపు ఆదాయం రైతుకు ఎంతో ఊరటనిస్తుంది.

వరి రైతుకు నిరాశే..

పత్తికి మినహా మిగతా పంటలన్నింటికీ మద్దతు ధర తక్కువగా పెంచింది. పెట్టుబడి వ్యయం మాత్రం గత సంవత్సరంతో పోల్చితే పెరగనుంది. పత్తికి క్వింటాకు రూ.586 పెంచిన కేంద్రం.. వరికి కేవలం రూ.69తో సరిపెట్టడం రైతులను నిరాశ పరిచింది. గత ఏడాది వరి ఏ గ్రేడ్‌ క్వింటా రూ.2,320 ఉండగా మద్దతు ధర పెంపుతో రూ.2,389కి చేరింది. సాధారణ రకం రూ.2,300 నుంచి రూ.2,369కి పెరిగింది. క్వింటా రూ.2,500 పెంచాలని రైతు సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

మద్దతు ధర ఇలా.. (క్వింటాకు రూ.లలో)

పంట గతేడాది ఈసారి పెరుగుదల

పత్తి మేలు రకం 7,521 8,110 589

పత్తి సాధారణం 7,121 7,710 589

వరి ఏగ్రేడ్‌ 2,320 2,389 69

వరి (కామన్‌) 2,300 2,369 69

పత్తి రైతుకు మద్దతు 1
1/1

పత్తి రైతుకు మద్దతు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement