
ఎస్సై సమయస్ఫూర్తి.. నిలిచిన నిండుప్రాణం
ఆకివీడు: రైలు నుంచి ప్రమాదవశాత్తూ జారి పడిపోయిన వ్యక్తిని సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఎస్సై సమయస్ఫూర్తితో గుర్తించి రక్షించారు. వివరాల ప్రకారం ఆకివీడు మండలం కమతవానిగూడెంకు చెందిన నతానియేలుతో పాటు మరో 8 మంది ఉపాధి నిమిత్తం తిరుపతి వలస వెళ్లారు. అక్కడ పనులు ముగించుకుని తిరిగి బుధవారం రాత్రి ఆకివీడుకు తిరుమల – నర్సపూర్ రైలు బండిలో వస్తుండగా నతానియేలు ప్రమాదవశాత్తూ కదులుతున్న రైలు నుంచి జారి పడిపోయాడు. చీకట్లో ఏ ప్రాంతంలో పడిపోయాడో కూడా తెలియదు. వెంటనే బంధువులు గమనించి ఆకివీడు ఎస్సై హనుమంతు నాగరాజుకు ఫోన్ ద్వారా విషయం వివరించారు. ఆయన సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా క్షతగాత్రుడు కావలి ప్రాంతంలో పడిపోయినట్లు గుర్తించి సమీప పోలీస్ స్టేషన్కు తెలియజేసి పోలీసుల్ని అప్రమత్తం చేశారు. ఘటనా స్థలంలో పడిపోయి ఉన్న నతానియేలును గుర్తించి కావలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా నతానియేలుకు సకాలంలో వైద్యం అందడంతో అతడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడని, కానీ రెండు కాళ్లూ విరిగిపోయి, తలకి బలమైన గాయమైందని పోలీసులు చెప్పారు. ఎస్సై హనుమంతు నాగరాజు సమయస్ఫూర్తిని ఈ సందర్భంగా పలువురు అభినందించారు.