
ఉగ్రామాత, శివదూతీమాతగా భద్రకాళి
హన్మకొండ కల్చరల్ : శ్రీభద్రకాళి దేవాలయంలో నిర్వహిస్తున్న శాకంబరీ నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా బుధవారం ఏడో రోజు అమ్మవారిని ఉగ్రామాత, శివదూతీమాతగా అలంకరించి పూజలు నిర్వహించారు. అర్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు ఉదయం అమ్మవారికి సుప్రభాతసేవ, నిత్యాహ్నికం నిర్వహించారు. అనంతరం కాళీక్రమాన్ని అనుసరించి స్నపనభేరాన్ని ఉగ్రామాతగా, షోడశీక్రమాన్ని అనుసరించి భోగభేరాన్ని శివదూతీమాతగా అలంకరించి పూజలు జరిపారు. ఈఓ శేషుభారతి, సిబ్బంది, ధర్మకర్తలు తొనుపునూరి వీరన్న, గాండ్ల స్రవంతి, శ్రీనివాస్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
కేఎఫ్ఐ ఎథిక్స్ కమిషన్
కన్వీనర్గా రాఘవరెడ్డి
వరంగల్ స్పోర్ట్స్: ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(కేఎఫ్ఐ) ఎథిక్స్ కమిషన్ కన్వీనర్గా, ఖోఖో అసోసియేషన్ సౌత్ జోన్ అధ్యక్షుడిగా తెలంగాణ ఆయిల్ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్, ఖోఖో సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి ఎన్నికయ్యారు. న్యూఢిల్లీలోని ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కార్యాలయంలో బుధవారం ఎథిక్స్ కమిషన్ ఎన్నికలు జరిగాయి. ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు సుధామ్ష్ మిట్టల్ అధ్యక్షతన జరిగిన ఎన్నికల్లో రాఘవరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఒక ప్రకటనలో తెలి పారు. తన ఎన్నికకు సహకరించిన ఖోఖో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి, ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షుడు సీతారాంరెడ్డిలకు రాఘవరెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
స్నాతకోత్సవానికి రండి
గవర్నర్ను కలిసి ఆహ్వానించిన కేయూ వీసీ
కేయూ క్యాంపస్: ఈ నెల 7వ తేదీన జరగనున్న కాకతీయ యూనివర్సిటీ 23వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా రావాలని బుధవారం వీసీ కె.ప్రతాప్రెడ్డి హైదరాబాద్లోని రాజ్భవన్లో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్వర్మను కలిసి ఆహ్వానించారు. స్నాతకోత్సవం నిర్వహణ సమయం, గోల్డ్మెడల్స్, పీహెచ్డీ అభ్యర్థులకు పట్టాల ప్రదానం వివరాలు, కాన్వొకేషన్ ప్రొసీడర్ను గవర్నర్కు తెలిపారు. గవర్నర్ స్నాతకోత్సవానికి హాజరయ్యేందుకు ఓకే చెప్పారని సమాచారం. వీసీ వెంట కేయూ ఓఎస్డీ ప్రొఫెసర్ పి.మల్లారెడ్డి, పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్ ఉన్నారు.
వయోజనులను
అక్షరాస్యులుగా చేయాలి
విద్యారణ్యపురి: జిల్లాలోని నిర్లక్ష్యరాస్యులైన వయోజనులను అక్షరాస్యులుగా చేయాలని హనుమకొండ డీఈఓ డి.వాసంతి కోరారు బుధవారం హనుమకొండలోని సుబేదారి ప్రభుత్వ హైస్కూల్లో ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, కంప్యూటర్ ఆపరేటర్లకు శిక్షణ ఇచ్చారు. డీఈఓ హాజరై మాట్లాడుతూ మండలస్థాయిలో జరిగే శిక్షణకు ప్రతీ పాఠశాలనుంచి ఒక ఉపాధ్యాయుడు, గ్రామసమాఖ్య సభ్యులు హాజరుకావాలన్నారు. వయోజన విద్య డైరెక్టర్ రమేష్రెడ్డి ఉల్లాస్ యాప్లో నిరక్ష్యరాస్యులైనవారిని గుర్తించి ఎలా నమోదు చేయాలో వివరించారు. కమ్యూనిటీ మొబిలైజింగ్ కోఆర్డినేటర్ సుదర్శన్రెడ్డి, ఓపెన్ స్కూల్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ సదానందం పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
న్యూశాయంపేట: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉపాధి సంబంధిత ప్రోత్సాహక పథకానికి(ఈఎల్ఐ) దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రాంతీయ ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) కమిషనర్ వైడీ శ్రీనివాస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధి సృష్టించడం, ప్రోత్సహించడం, ఉపాధి సామర్థ్యాన్ని పెంపొందించడం, సామాజిక భద్రతను ఈ పథకం ద్వారా మెరుగుపరచాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం వరంగల్ ప్రాంతీయ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.

ఉగ్రామాత, శివదూతీమాతగా భద్రకాళి

ఉగ్రామాత, శివదూతీమాతగా భద్రకాళి