
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
వనపర్తి: ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, నిరంతరం సూపర్వైజర్లు పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదర్శ్సురభి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని మర్రికుంటలో గల కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని వంటశాలను, స్టాక్ రిజిస్టర్లను తనిఖీ చేసి నాణ్యమైన బియ్యం సరఫరా చేయకపోతే స్టాక్ను అనుమతించొద్దని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు. అనంతరం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు బట్టి విధానంలో కాకుండా ఫార్ములాలను అనుసరించి పాఠ్యాంశాలను నేర్చుకోవాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ గణిత శాస్త్రానికి సంబంధించి కొన్ని ప్రశ్నలను అడిగి విద్యార్థుల ద్వారా సమాధానాలను రాబట్టారు.
హరిజనవాడ ప్రభుత్వ పాఠశాల సందర్శన
జిల్లా కేంద్రంలోని హరిజనవాడ ప్రభుత్వ పాఠశాలను కలెక్టర్ సందర్శించారు. ఉపాధ్యాయుల హాజరు పట్టికను పరిశీలించారు. విద్యార్థుల మా ర్కులను పరిశీలించిన కలెక్టర్, వెనకబడిన వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ
జిల్లా కేంద్రంలోని గాంధీనగర్లో ఇందిరమ్మ ఇళ్లకు ఎంపికై న లబ్ధిదారులు అంజి, వెంకటమ్మ ఇంటి నిర్మాణానికి కలెక్టర్ భూమిపూజ చేశారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జీసీడీవో శుభలక్ష్మి, హౌసింగ్ డీఈ విఠోబా, తహసీల్దార్ రమేష్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.
రోగులతో గౌరవంగాప్రవర్తించాలి
వనపర్తి: వైద్యులు ఆస్పత్రికి వచ్చే రోగులకు చికిత్స చేయడమే కాకుండా, ఉత్తేజమైన మాటలతో వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించాలని కలెక్టర్ ఆదర్శ్సురభి అన్నారు. జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం నర్సింగాయపల్లి పరిధిలోని ఎంసీహెచ్లో నిర్వహించిన వేడుకలకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మెడికోస్ బ్లడ్ డొనేషన్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో కూడా క్లబ్ తరఫున ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని వైద్య విద్యార్థులను అభినందించారు. వైద్య వృత్తిలో ఉన్న వారు ఎక్కడ ఉన్నా.. ఆ స్థానిక భాషను నేర్చుకొని రోగులతో స్నేహపూర్వకంగా మెలిగితే వారికి ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం పెరుగుతుందన్నారు. అనంతరం కలెక్టర్ సమక్షంలో వైద్య విద్యార్థులు కేక్ కట్ చేశారు. కలెక్టర్ నూతనంగా నిర్మించిన క్రిటికల్ కేర్ యూనిట్ భవనాన్ని ఇంజినీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. కార్యక్రమంలో ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కిరణ్మయి, జీజీహెచ్ సూపరిటెండెంట్ రంగారావు తదితరులు ఉన్నారు.