
మీనమేషం..!
మత్స్యబీజం పంపిణీకి ఖరారు కాని టెండర్లు
ఊసేలేని టెండర్ల ప్రక్రియ..
ఉచిత చేప పిల్లల పంపిణీకి డిమాండ్ ఆధారంగా ఏటా మే, జూన్లో టెండర్ల ప్రక్రియ నిర్వహించేవారు. చెరువులు నిండిన వెంటనే చేప పిల్లలను వదిలే ఆస్కారం ఉండేది. గతేడాది నుంచి టెండర్ల ప్రక్రియ ఆలస్యంగా కొనసాగుతుండటంతో అక్టోబర్ వరకు చేప పిల్లలను చెరువుల్లో వదిలితే.. మార్చి, ఏప్రిల్ నాటికి అవి ఆశించిన మేర పెరగడం లేదు. ఉత్పత్తి తగ్గిపోతుందనే వాదనలు మత్స్యకారుల్లో లేకపోలేదు.
2.04 కోట్ల డిమాండ్..
జిల్లాలో గతేడాది మాదిరిగానే 900 పైచిలుకు చెరువులు, కుంటల్లో 2.04 కోట్ల చేప పిల్లలు వదిలేందుకు అంచనాలు సిద్ధం చేశారు. ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో రెండు నుంచి మూడు అంగుళాల చేప పిల్లలు, చెరువులు, కుంటల్లో ఒటిన్నర అంగుళాల చేప పిల్లలను వదిలిలేందుకు ఏటా టెండర్లు పిలుస్తారు. జిల్లాలో ఎక్కువగా బంగారు తీగ, బొచ్చ, రౌటతో పాటు మరికొన్ని రకాల చేప పిల్లలను ఎక్కువగా తీసుకొస్తారు.
వనపర్తి: ఈ ఏడాది ఉచిత చేపపిల్లల పంపిణీకి ప్రతిపాదనలు, టెండర్ల ప్రక్రియ ప్రారంభం కాకపోవడంతో నిర్లక్ష్యం అలుముకుందనే చర్చ వినిపిస్తోంది. మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంచేందుకు, వారు జీవనోపాధి కోసం వలసబాట పట్టకుండా ఉన్న ఊరులోనే జీవించేందుకు గత ప్రభుత్వం ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఏటా జూన్ మొదటి వారంలో అంచనా ప్రణాళికలు, టెండర్ల పక్రియ నిర్వహించేవారు. గతేడాది నుంచి ఈ పథకంపై కొంత అలసత్వం అలుముకుందని మత్స్యకారుల్లో అసహనం నెలకొంది. గతేడాది ఆలస్యంగా ఆగష్టులో ఉచిత చేపపిల్లల పంపిణీ ప్రారంభించి అక్టోబర్, నవంబర్ వరకు కొనసాగించారు. ఈ ఏడాది ఇప్పటి వరకు జిల్లాలో ఎలాంటి కార్యాచరణ ప్రారంభించకపోవడం శోచనీయం. ఉమ్మడి జిల్లాకు చెందిన వాకిటి శ్రీహరికి ఇటీవల మత్స్యశాఖ మంత్రి పదవి కేటాయించడంతో అభివృద్ధికి తోడ్పాటు లభిస్తుందనే భావనలో మత్స్యకారులు ఉన్నారు. గతేడాది టెండర్ల ప్రక్రియ ఆలస్యంగా నిర్వహించడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు మత్స్యకారులు అధికారుల దృష్టికి తీసుకొచ్చిన ఘటనలు చాలానే ఉన్నాయి.
జిల్లాలో 1,050 చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు
900 పైచిలుకు చెరువులను గుర్తించిన మత్స్యశాఖ
40 శాతానికిపైగా నీరుంటేనే అనుమతి
ప్రభుత్వమే నిర్ణయించాలి..
టెండర్ల ప్రక్రియ ప్రభుత్వమే నిర్ణయించాల్సి ఉంటుంది. జిల్లాలో ఏటా 900 చెరువుల్లో చేప పిల్లలు వదులుతాం. చెరువులు, కుంటలు, రిజర్వాయర్లల్లో నీరు వస్తే సుమారు 2 కోట్ల చేప పిల్లలు అవసరమవుతాయని ప్రణాళికలు తయారు చేస్తున్నాం. ఆయా చెరువులు, రిజర్వాయర్లలో 40 శాతం నీరుంటేనే చేప పిల్లలు వదిలేందుకు వెసులుబాటు ఉంటుంది.
– లక్ష్మప్ప, జిల్లా మత్స్యశాఖ అధికారి

మీనమేషం..!