
పోటాపోటీగా పింఛన్ల పంపిణీ
● రెండు ప్రాంతాల్లో రెండు వర్గాలుగా అందజేత
● టీడీపీలో రాజుకుంటున్న గ్రూపుల కుంపటి
శృంగవరపుకోట: మేజర్ పంచాయతీ ఎస్.కోటలో మంగళవారం అధికార టీడీపీ నేతలు రెండు వర్గాలుగా, పోటాపోటీగా పింఛన్లు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే లలితకుమారి తన అనుయాయులతో కలిసి కోటవీధిలో, ఏపీ టూరిజం బోర్డు డైరెక్టర్ సుధారాజు తన అనుయాయులతో కలిసి పుణ్యగిరిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు మంగళవారం పంపిణీ చేశారు. తెలుగుదేశం పార్టీలో రాజుకుంటున్న అసమ్మతి కుంపటికి ఇది నిదర్శనం. నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో ఆరంభం నుంచి రెండు గ్రూపులు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఎమ్మెల్యే లలితకుమారి, ఎమ్మెల్యే సీటు కోసం ఆశించి భంగపడి, డీసీఎంఎస్ చైర్మన్గిరితో సరిపెట్టుకున్న గొంప కృష్ణ రెండు వర్గాలుగా ఉన్నారు. గొంప కృష్ణ వర్గానికి ఎంపీ భరత్ ఆశీస్సులు మెండుగా ఉన్న విషయం విదితమే. కాగా ఇటీవల శాసనసభ ఎన్నికల్లో నారా లోకేష్ హామీతో టీడీపీ తీర్థం పుచ్చుకున్న ఎంపీపీ సోమేశ్వరరావు, వైస్ ఎంపీపీ సుధారాజు, ఎస్.కోట సర్పంచ్ సంతోషికుమారితో పాటు కొందరు వైఎస్సార్సీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.
అసంతృప్తిలో మూడో వర్గం
మండలంలో తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న వైస్ ఎంపీపీ సుధారాజు వర్గం అధికార పార్టీ నేతల తీరుపై గుర్రుగా ఉన్నారు. పార్టీలో తమకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని, కార్యక్రమాలు వేటికీ తమకు సమాచారం ఇవ్వకుండా, తమ ప్రాతినిధ్యం లేకుండా చేస్తున్నారని మధనపడుతున్నారు. నాడు పార్టీలో తగిన ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చి, నమ్మించి నట్టేట ముంచుతున్నారని కలత చెందుతున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు, నిధులు, విధులు, సంక్షేమ కార్యక్రమాలు ఇలా ఎక్కడా తమ మాట చెల్లడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
లోకేష్ దగ్గకు పంచాయితీ?
తమకు తగిన గౌరవం దక్కడం లేదని నేరుగా రాష్ట్ర మంత్రి నారా లోకేష్కు ఫిర్యాదు చేసి, నాడు ఇచ్చిన హామీలను గుర్తుచేయాలని సుధారాజు వర్గం యోచిస్తోంది. ఇందుకోసం లోకేష్ అపాయింట్మెంట్ కోసం చూస్తున్నారని, త్వరలోనే అధిష్టానం పెద్దలకు వాస్తవాలు చెప్పేందుకు అమరావతి వెళ్లనున్నట్లు కచ్చితమైన సమాచారం.

పోటాపోటీగా పింఛన్ల పంపిణీ