
ప్రైవేట్ స్కూళ్లపై చర్యలు
ఉచిత సీట్లు
ఇవ్వని..
విజయనగరం అర్బన్:
విద్యాహక్కు చట్టం అమలులో భాగంగా ప్రభుత్వం ఎంపిక చేసిన ప్రైవేట్ పాఠశాలలు పేద విద్యార్ధులకు ఉచిత సీట్లు ఇవ్వకపోతే ఆయా స్కూళ్లపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ డాక్టర్ బీఆర్అంబేడ్కర్ హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా వినతుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో వచ్చిన అర్జీల్లో ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత సీట్లలో చేర్చుకోవడం లేదని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు వినతులు అందజేశారు. వరుసగా రెండు మూడు వారాల పాటు ఇలాంటి వినతులే రావడంతో సంబంధిత ప్రైవేట్ పాఠశాలలపై కలెక్టర్ ఆగ్రహించారు. కేటాయించిన సీట్లలో ఉచిత ప్రవేశాలను ఇవ్వని పట్టణంలోని బీసెంట్ స్కూల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, సన్ స్కూల్పై క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయాలని ఆర్డీవో సవరమ్మ, డీఈఓ యూ.మాణిక్యం నాయుడిని ఆదేశించారు. ఈ సందర్భంగా అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా వినతుల పరిష్కార వేదికకు వచ్చే వినతులను లాగిన్లో అధికారులు ఎప్పటికప్పుడు చూడాలని, లాగిన్లో ఎప్పుడు చూసినా సున్నా కనపడాలని స్పష్టం చేశారు. ప్రతి రోజూ లాగిన్ అయి అధికారులు వినతులను చూడాలని, అలాగే రీ ఓపెన్ కేసులు కూడా పూర్తిగా విచారణ జరిపి ముగించాలని తెలిపారు. సోమవారం పీజీఆర్ఎస్కు 172 వినతులు అందాయి. కలెక్టర్తోపాటు సంయుక్త కలెక్టర్ సేతు మాధవన్, డీఆర్ఓ శ్రీనివాసమూర్తి, విజయనగరం ఆర్డీఓ సవరమ్మ, డిప్యూటీ కలెక్టర్ మురళి, ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మొత్తం 172 వినతుల్లో అధికంగా 69 వరకు రెవెన్యూ శాఖకు చెందిన వినతులు అందాయి. మిగిలినవి ఇతర శాఖలకు చెందినవి ఉన్నాయి.
పోలీస్ గ్రీవెన్స్ సెల్కు 34 ఫిర్యాదులు
విజయనగరం క్రైమ్: జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 34 ఫిర్యాదులు వచ్చాయి. ఈ వారం ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశాలతో విజయనగరం డీఎస్పీ శ్రీనివాస్ ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. కార్యక్రమంలో స్వీకరించిన ఫిర్యాదుల్లో భూతగాదాలకు సంబంధించి 12, కుటుంబ కలహాలకు సంబంధించి 3, మోసాలకు పాల్పడినట్లు 4, ఇతర అంశాలకు సంబంధించి 15 ఫిర్యాదులు ఉన్నాయని డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో మాట్లాడుతూ ఫిర్యాదు అంశాలను పరిశీలించి అవసరమైతే విచారణ చేసి, ఫిర్యాదులు వాస్తవమైనట్లయితే చట్ట పరిధిలో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీసీఆర్బీ సీఐ బి.సుధాకర్, ఎస్.రాజేష్ పీజీఆర్ఎస్ సిబ్బంది పాల్గొన్నారు.
కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్
పీజీఆర్ఎస్కు 172 వినతులు