
అమ్ముడు పోయిన ప్రజాస్వామ్యం
● బొబ్బిలి మున్సిపల్ చైర్మన్గా రాంబార్కి శరత్
● దగ్గరుండి కథ నడిపించిన ఎమ్మెల్యే బేబీనాయన,
● మాజీ మంత్రి సుజయ్
బొబ్బిలి: అధికార తాపత్రయం, అడ్డగోలుగానైనా పీఠం దక్కించుకోవాలనే కుటిల రాజకీయం వెరసి బొబ్బిలి మున్సిపల్ పీఠం టీడీపీ వశమైంది. గత నెల 29న అవిశ్వాస తీర్మానం నెగ్గిన తరువాత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సోమవారం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ ఎన్నికల పరిశీలకుడిగా హాజరైన ఈ ఎన్నిక ప్రక్రియను ఆర్డీఓ జేవీఎస్ఎస్ రామమోహన రావు నిర్వహించారు. టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి ఒక్కరి పేరే నామినేట్ చేస్తూ బీఫాం అందజేయడంతో సభకు ఆర్డీఓ వివరించారు. మున్సిపాలిటీలోని 8వ వార్డు కౌన్సిలర్గా ఉన్న రాంబార్కి శరత్ పేరును ఒక టీడీపీ కౌన్సిలర్ ప్రతిపాదించి, మరో వైఎస్సార్సీపీ కౌన్సిలర్ (ఎన్నికకు ముందురోజే టీడీపీ కండువా కప్పారు) బలపరుస్తున్నట్లు వారి చేతే చెప్పించారు. కోరం కోసం అవసరమైన 16 మంది మాత్రమే హాజరయ్యారు. వారితో పాటు వైఎస్సార్సీపీ వైస్ చైర్మన్గా మొన్నటి వరకూ వ్యవహరించిన 19వ వార్డు కౌన్సిలర్ చెలికాని మురళీకృష్ణ కూడా హాజరయ్యారు.
చేతులెత్తే ప్రక్రియ అవసరం లేకుండానే..
చైర్మన్ ఎన్నికకు ఒకటే ప్రతిపాదన వచ్చిందని, మరెవరైనా పోటీ చేసే అవకాశం ఉందా అని జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ సమక్షంలో ఆర్డీఓ రామమోహన రావు కౌన్సిలర్లను ప్రశ్నించారు. దీనికి ఎవరూ నోరు మెదపలేదు. మరోసారి అడిగి ఎవరూ లేరని నిర్ధారించుకున్న తరువాత రాంబార్కి శరత్ చైర్మన్గా ఎన్నికై నట్లు ప్రకటించి ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. ఆ వెంటనే ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు.
రేసులో ఉన్న కౌన్సిలర్తోనే ప్రతిపాదన
అవిశ్వాస రాజకీయంలో దించేసిన చైర్మన్ ఎస్వీ మురళీ కృష్ణారావు కాపు సామాజిక వర్గానికి చెందిన వారు. ఈ సామాజిక వర్గానికే చైర్మన్ పదవి ఇస్తారని మొదటి నుంచి ప్రచారం సాగింది. అయితే కౌన్సిలర్లకు ఇవ్వాల్సిన, ఇతర ఖర్చుల కోసం మున్సిపల్ ఫ్లోర్ లీడర్, 6వ వార్డు కౌన్సిలర్ గెంబలి శ్రీనివాసరావు భారీగా ఖర్చు చేశారని, ఆయన ఇప్పుడు రేసులో ఉన్నారని ప్రచారం సాగింది. అయితే దీనిని ఖండించని బేబీనాయన తదితరులు గుంభన రాజకీయాలు నడిపారు. చివరికి గెంబలి శ్రీనివాసరావు కూడా తనకు చైర్మన్ గిరీ ఇచ్చేందుకు బేబీనాయన హామీ ఇచ్చారని ఆయనే సుప్రీమ్ కనుక మరెవరు చెప్పినా జరిగే పనికాదని నాదే చైర్మన్ గిరీ అనీ ఢంకా భజాయించారు. చివరికి డొంకలో ఇరుక్కుపోయారు. ఆయనకు ప్రస్తుత చైర్మన్ రాంబార్కి శరత్ చేస్తున్న టీడీపీ పట్టణ అధ్యక్షుడి పదవినిచ్చి మరోసారి చూద్దాంలే అని చివరి నిమిషంలో పక్కన పెట్టేశారు. అంతే కాదు. శరత్ చైర్మన్ కావడానికి సభలో నువ్వే ప్రతిపాదించాలని ఇరికించారు. దీంతో గెంబలి మరోసారి నిరుత్సాహ పడక తప్పలేదు. మరో కౌన్సిలర్ రామారావు గెంబలి ప్రతిపాదనను బలపర్చారు. అనంతరం సాయంత్రం నాలుగు గంటల సమయంలో మున్సిపల్ చైర్మన్గా రాంబార్కి శరత్ కౌన్సిల్ హాల్లో బాధ్యతలు స్వీకరించారు.
హాజరు కాని వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు:
బలం ఉన్నా టీడీపీ ఆడిన ప్రలోభాలు, పైరవీల వలలో పది మంది వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు చిక్కుకున్నారు. టీడీపీకి కేవలం పది మంది కౌన్సిలర్లే ఉన్నా ప్రలోభాలతో బలం పెరగడంతో ఎన్నిక లాంఛనమే అయింది. దీంతో వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు ఈ చైర్మన్ ఎన్నిక సమావేశానికి గైర్హాజరయ్యారు.
నీతి వదిలేసిన రాజకీయాలు
ప్రస్తుత రాజకీయాలు నీతిమాలిపోయాయి. కేవలం కొద్ది రోజుల పరిపాలన కోసం స్థానిక సంస్థలను కూడా కూటమి నాయకులు నిస్సిగ్గుగా చేజిక్కించుకునేందుకు బరితెగించడం సరికాదు. దమ్ముంటే సక్రమంగా రాజకీయాలు చేయాలి. అమ్ముకునే, కొనుగోలు చేసే రాజకీయాలు చేస్తే ప్రజలు తగిన జవాబిస్తారు. వచ్చే రోజుల్లో సరైన గుణపాఠం నేర్చుకోవాల్సి ఉంటుంది.
శంబంగి వెంకట చిన అప్పలనాయుడు,
మాజీ ఎమ్మెల్యే

అమ్ముడు పోయిన ప్రజాస్వామ్యం

అమ్ముడు పోయిన ప్రజాస్వామ్యం