
‘సన్నాల’ సాగును ప్రోత్సహించండి
అనంతగిరి: జిల్లాలో సన్నరకం వరి సాగును ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్లో పౌర సరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహన్, కలెక్టర్ ప్రతీక్జైన్తో కలసి అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సన్న రకం వడ్లకు ప్రభుత్వం ఇస్తున్న రూ.500 బోనస్ గురించి రైతులకు వివరించి సాగు విస్తీర్ణం పెరిగేలా చూడాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అమలయ్యే విధంగా చూడాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. రాజీవ యువ వికాసం పథకం ద్వారా యువతకు ఉపాధి కల్పించాలని పేర్కొన్నారు. అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరుపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. రైతు భరోసా, రుణమాఫీ పథకాలపై ఆరా తీశారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని.. విద్యార్థుల్లో మానసిక వికాసాన్ని పెంపొందించేందుకు కృషి చేయాలన్నారు. భూ భారతి చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. సమావేశంలో ఎస్పీ నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్లు లింగ్యా నాయక్, సుధీర్, సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, కడా ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి, ఆర్డీఓ వాసుచంద్ర, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. అనంతరం వికారాబాద్ పట్టణం వెంకటేశ్వర కాలనీలోని 54 నంబర్ రేషన్ దుకాణాన్ని గురువారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాక్ వివరాలు, కార్డుదారులు బియ్యం తీసుకెళ్తున్నారా తదితర విషయాలను డీలర్ను అడిగి తెలుసుకున్నారు.
అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి
కొడంగల్: పట్టణంలో కొత్తగా చేపట్టిన ఆస్పత్రి భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఆదేశించారు. గురువారం నిర్మణ పనులను పరిశీలించారు. పనుల్లో వేగం పెంచాలని సంబంధిత ఇంజనీరింగ్ విభాగం అధికారులకు సూచించారు. అనంతరం ఆస్పత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, ప్రసవాల సంఖ్యను వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత పట్టణంలోని హరే కృష్ణ సంస్థ ద్వారా పాఠశాలలకు అల్పాహారాన్ని సరఫరా చేసే కిచెన్ షెడ్ను పరిశీలించారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రతీక్జైన్, ఎస్పీ నారాయణరెడ్డి, తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ప్రసాద్, కడా ప్రతేకాధికారి వెంకట్రెడ్డి, డీసీహెచ్ఎస్ డాక్టర్ ఆనంద్, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ పద్మ, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ లిల్లీమేరి, ఆస్పత్రి సూపరింటెండెంట్ చంద్రప్రియ, తహసీల్దార్ విజయకుమార్, మున్సిపల్ కమిషనర్ బలరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.
రైతులకు ఇబ్బందులు కలిగించొద్దు
పరిగి: రైతులు పండించిన పంటలకు ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తూ వారిని ప్రోత్సహిస్తోందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. గురువారం పరిగి మండలం సుల్తాన్పూర్లో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడారు. ధాన్యం విక్రయించేందుకు వచ్చే రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కేంద్రం నిర్వాహకులకు సూచించారు. టార్పాలిన్లు, గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ధాన్యం విక్రయించిన రైతుల ఖాతాల్లో ఎప్పటికప్పుడు డబ్బులు జమ చేయాలన్నారు. వర్షాలు కురుస్తున్నందున కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్, కలెక్టర్ ప్రతీక్జైన్, ఎస్పీ నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, తాండూర్ సబ్కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, డీఎస్ఓ మోహన్బాబు, జిల్లా మేనేజర్ వెంకటేశ్వర్లు, అధికారులు సారంగపాణి, తహసీల్దార్ ఆనంద్రావు తదితరులు పాల్గొన్నారు.
అర్హులకు సంక్షేమ పథకాలు అందాలి
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు