
సాక్షాత్కార వైభవోత్సవాలు ప్రారంభం
చంద్రగిరి: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో సాక్షాత్కార వైభవోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు మూడు రోజుల పాటు జరగనున్నాయి. సోమవారం ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు వరకు ఊంజల్ సేవ చేపట్టారు. రాత్రి 7 గంటలకు పెద్దశేష వాహనంపై స్వామివారు ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. మంగళవారం హనుమంత, బుధవారం గరుడ వాహనంపై స్వామివారు విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు. వాహన సేవ ముందు కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. జూలై 3న పార్వేట ఉత్సవం జరగనుంది. కార్యక్రమంలో ఆలయ స్పెషల్ గ్రేడ్ డెప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈవో గోపినాథ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.