
తిరుపతి అభివృద్ధికి టాటా గ్రూప్తో కీలక ప్రతిపాదనలు
● టాటా కంపెనీ చైర్మన్ చంద్రశేఖరన్ కలిసిన ఎంపీ గురుమూర్తి
తిరుపతి మంగళం : తిరుపతి అభివృద్ధికి సహాయపడాలంటూ టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్తో ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి కీలక ప్రతిపాదనలు చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ముంబయిలో టాటా సనన్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్న్ను ఎంపీ కలిశారు. తిరుపతి జాతీయ స్థాయి విద్యా కేంద్రం, ఐజర్, ఐఐటీ, విశ్వవిద్యాలయాలు, ఇంజినీరింగ్ కాలేజీలతో వేగంగా అభివృద్ధి చెందుతోందని ఎంపీ వివరించారు. ఈ ప్రాంత యువతకు డిజిటల్ టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ, మాన్యుఫాక్చరింగ్, సేవా రంగాలలో శిక్షణ కల్పించే టాటా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అవసరమని తెలిపారు. అదే విధంగా బీపీఓ కేంద్రం ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని పేర్కొన్నారు.
కలంకారి ప్రాచీన కళకు ప్రోత్సాహం ఇవ్వండి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రాచీన కళ అయిన కలంకారీ నేటి ప్రపంచ ఫ్యాషన్ రంగంలో తగిన గుర్తింపు పొందడం లేదని ఎంపీ గురుమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాచీన కళను పునరుజ్జీవానికి టాటా క్లిక్, వైస్ట్సెడ్ వంటి టాటా ఫ్యాషన్ సంస్థల ద్వారా కలంకారీ ఉత్పత్తులను ఆధునిక డిజైన్లతో తయారు చేసి వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.
తిరుపతి నుంచి గల్ఫ్ దేశాలకు నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించండి
రాయలసీమకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్నారని, అయినా తిరుపతి నుంచి నేరుగా అంతర్జాతీయ విమాన సర్వీసులు లేవని ఎంపీ గుర్తు చేశారు. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ద్వారా తిరుపతి నుంచి కువైట్, కతార్, సౌదీ అరేబియా, యూఏఈలకు నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించాలని కోరారు. ఈ మూడు ప్రతిపాదనలు తిరుపతి ప్రాంత అభివృద్ధిలో మైలురాయిగా నిలుస్తాయని ఎంపీ వివరించారు. స్పందించిన చంద్రశేఖరన్ అందుకు అవసరమైన చర్యలు చేపడుతామని స్పష్టమైన హామీ ఇచ్చారని ఎంపీ గురుమూర్తి తెలిపారు.