ప్రజాపాలన సంబరాల్లో ఉద్యోగులకు భాగస్వామ్యం కల్పించాలి
12లోగా డీఏ ప్రకటిస్తామని ఇచ్చిన మాటకు కట్టుబడాలి
ఉద్యోగుల ఆరోగ్య పథకం వెంటనే అమలు చేయాలి
పెండింగ్ బిల్లుల కింద నెలకు రూ.1,500 కోట్లు చెల్లించాలి
‘టెట్’కు మినహాయింపుపై అసెంబ్లీలో తీర్మానం చేయాలి
తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: ప్రజపాలన విజయోత్సవాల కంటే ముందే ఉద్యోగులకు ఇచి్చన హామీలను నెరవేర్చాలని, ప్రజా పాలన సంబరాల్లో ఉద్యోగులకు భాగస్వామ్యం కల్పించాలని తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ (టీజీఈజేఏసీ) రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ నెల 9 నుంచి ఉత్సవాలు ప్రారంభించడానికి ముందే ఉద్యోగుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేసింది. సోమవారం టీఎన్జీవో భవన్లో టీజీఈజేఏసీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఉద్యోగుల సమస్యలు, ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీలు, నెరవేర్చాలనే డిమాండ్లపై చర్చించింది. అనంతరం టీజీఈజేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, ఏలూరి శ్రీనివాస్రావు మీడియాతో మాట్లాడారు.
సమస్యలు పరిష్కరించాలి
‘గ్లోబల్ సమ్మిట్, ఉత్సవాల ప్రారంభానికి ముందే ఉద్యోగుల అన్ని సమస్యలు పరిష్కరించాలి. డిసెంబర్ 12లోగా డీఏ ప్రకటిస్తామని ఇచి్చన మాటకు కట్టుబడాలి. ప్రభుత్వం లిఖిత పూర్వకంగా ఇచ్చిన 64 హామీల మేరకు విడుదల చేసిన జీవో 78ని అనుసరించి డీఏను విడుదల చేయాలి. మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం మేరకు ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్) వెంటనే అమలు చేయాలి. ఈహెచ్ఎస్ అమలు చేయాలని కోరుతూ ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో అనేకసార్లు సమావేశమైనా ఇప్పటికీ అమలు కాలేదు. దీంతో అనేకమంది ఉద్యోగులు అనారోగ్య పరిస్థితి వచి్చనప్పుడు అప్పులు చేయాల్సి వస్తోంది. ఉద్యోగులు, పెన్షనర్లకు వైద్య సేవలు అందించేలా గ్లోబెల్ సమ్మిట్, ప్రజా పాలన ఉత్సవాల్లోనే ప్రకటించేలా తక్షణమే చర్యలు తీసుకోవాలి..’ అని టీజీఈజేఏసీ నేతలు కోరారు.
నెలకు రూ.1,500 కోట్లు ఇవ్వండి
‘ప్రభుత్వం ఉద్యోగులకు ఇవ్వాల్సిన పెండింగ్ బిల్లుల కింద నెలకు రూ.700 కోట్లు ఇస్తుంటే సరిపోవడం లేదు. కాబట్టి రూ.1,500 కోట్లు ఇవ్వాలి. రాష్ట్రంలో నెలకు సగటున 600 మంది ఉద్యోగులు రిటైర్ అవుతుండడంతో బకాయిలు భారీగా పెరిగిపోతున్నాయి. పెద్ద మొత్తంలో బకాయిలు విడుదల చేస్తే రిటైర్డ్ ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులు ఇబ్బందులు పండకుండా ఉంటారు. 2010 కంటే ముందుగా నియామకమైన ప్రభుత్వ ఉపాధ్యాయులందరినీ టెట్ అర్హత పరీక్ష తప్పనిసరిగా పాస్ కావాలనే నిబంధన నుంచి మినహాయించాలి. ఈ మేరకు శాసనసభలో తీర్మానం చేయాలి. తీర్మానం కాపీని కేంద్ర ప్రభుత్వానికి పంపాలి..’ అని మారం జగదీశ్వర్, ఏలూరి శ్రీనివాస్రావు విజ్ఞప్తి చేశారు.


