
సైబర్ నేరాల నిరోధంలో మరో ముందడుగు
‘అనుమానాస్పదాల’పై ఎన్సీఆర్పీ పోర్టల్ దృష్టి
అధికారిక వెబ్సైట్లోనూ ప్రత్యేక లింక్ ఏర్పాటు
8 అంశాలపై సమాచారం ఇచ్చే అవకాశం
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరాల నిరోధం దిశగా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (ఎన్సీఆర్పీ) మరో కీలక ముందడుగు వేసింది. అనుమానాస్పద సోషల్ మీడియా ఖాతా, ఫోన్ నంబర్.. ఇలా మొత్తం ఎనిమిది అంశాలపై ఎప్పటికప్పుడు ఫిర్యాదు చేసే అవకాశం ఇచి్చంది. దీనికోసం తన అధికారిక పోర్టల్లో (https:// cybercrime.gov.in) ప్రత్యేక విభాగంతో కూడిన లింక్ అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఈ లింక్ దుర్వినియోగానికి ఆస్కారం లేకుండా ప్రతి ఫిర్యాదుతోపాటు ఆధారాలను జత చేయడం తప్పనిసరి చేసింది.
సైబర్ నేరాలకు అవే ఆధారం
ఏ సీజన్లో.. ఆ ఫ్రాడ్ చేస్తూ అందినకాడికి కొల్లగొట్టే సైబర్ నేరగాళ్లకు ఫోన్ కాల్స్తోపాటు సోషల్మీడియా ఖాతాలే ఆధారం. డార్క్ వెబ్తోపాటు వివిధ మార్గాల్లో లక్షల్లో ఫోన్నంబర్లను సంప్రదిస్తున్న సైబర్ నేరగాళ్లు వీటి ఆధారంగానే ఎర వేస్తున్నారు. బల్క్ విధానంలో సందేశాలు పంపుతూ, ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టం (ఐవీఆర్ఎస్) కాల్స్ చేస్తూ తమ పని ప్రారంభిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో నకిలీ వెబ్సైట్లు ఏర్పాటు చేసి, వర్చువల్ మొబైల్ యాప్స్ను లింకుల ద్వారా టార్గెట్ చేసిన వ్యక్తికి పంపి అందినకాడికి దండుకుంటున్నారు. వీరు వినియోగించే సిమ్కార్డులు, బ్యాంకు ఖాతాలు సహా ప్రతీదీ నకిలీ పేర్లు, చిరునామాలతోనే ఉంటున్నాయి.
ఇప్పటి వరకు నేరం జరిగాకే...
సైబర్ నేరాల బారిన పడినవారు ఫిర్యాదు చేయడానికి, సహాయసహకారాలు పొందడానికి ఎన్సీఆర్పీ పోర్టల్ పనిచేస్తోంది. ఈ వెబ్సైట్తో పాటు టోల్ఫ్రీ నంబరు1930 ద్వారా బాధితులు ఫిర్యాదు చేసే అవకాశముంది. ఇలా వచి్చన ఫిర్యాదుల ఆధారంగా నేరగాళ్లు వినియోగించిన సెల్నంబర్, బల్క్ పోర్టల్, వెబ్సైట్, బ్యాంకు ఖాతా సహా వివిధ అంశాలను పోర్టల్ నిర్వాహకులతోపాటు ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) దృష్టికి వెళుతున్నాయి. ఇలా ఆయా నేరగాళ్లు వినియోగించిన వాటిని గుర్తిస్తున్న అధికారులు వాటిని కేసుల దర్యాప్తునకు ఆధారంగా మార్చుకుంటున్నారు. ఆపై వీటికి సంబంధించిన జాబితాలను రూపొందించి సంబంధిత విభాగాలు, మంత్రిత్వ శాఖలు, బ్యాంకుల ద్వారా బ్లాక్ చేయిస్తున్నారు.
ఒకేసారి ఎందరినో టార్గెట్ చేస్తూ...
ఇదంతా నేరం జరిగిన తర్వాత, ఆ నేరంలో కొందరు బాధితులుగా మారిన తర్వాత జరుగుతోంది. అలాకాకుండా సైబర్ నేరం చేయడానికి ముందే ఆ కేటుగాళ్లు ఎర వేయడం మొదలెట్టడంతోనే వీటిని బ్లాక్ చేయాలని ఎన్సీఆర్పీ నిర్ణయించుకుంది. ఓ వ్యక్తిని టార్గెట్ చేసిన తర్వాత నేరగాళ్లు కొన్నిరోజుల పాటు వారితో సంప్రదింపులు జరుపుతుంటాడు. వ్యవస్థీకృతంగా నేరం చేయడానికి కాల్ సెంటర్లు సైతం ఏర్పాటు చేసుకుంటున్న నేరగాళ్లు ఒకేసారి అనే క మందితో సంప్రదింపులు జరుపుతున్నారు.
వీరిలో కొందరే వారి వల్లో పడతారు. ఆదిలోనే ప్రజల నుంచి సమాచారం సేకరించి వారి ఫోన్నంబర్ తదితరాలను బ్లాక్ చేస్తే బాధితుల సంఖ్య తగ్గే అవకాశముందని ఎన్సీఆర్పీ నిర్ణయించింది. దీంతో తన పోర్టల్లోని ‘రిపోర్ట్ అండ్ చెక్ సస్పెక్ట్’ ( https:// cybercrime.gov.in/webform/cyber&suspect.) విభాగంలో వెబ్సైట్, వాట్సాప్ నంబర్/టెలి గ్రాం హ్యాండ్లర్, ఫోన్ నంబర్, ఈ–మెయిల్ ఐడీ, ఎస్ఎంఎస్ నంబర్/హ్యాండ్లర్, సోషల్మీడియా యూఆర్ఎల్, డీప్ ఫేక్, మొబైల్ యాప్లపై ఫిర్యాదు చేసే అవకాశం ఇచి్చంది.