సాక్షి, చైన్నె: ఎండ వేడి నుంచి వాహనదారులకు ఉపశమనం కలిగించే విధంగా చైన్నె నగరంలోని కొన్ని కూడళ్లల్లో గ్రీన్ నెట్స్ ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపట్టారు. తొలి విడతగా 10 సర్కిళ్లలో వీటిని ఏర్పాటు చేయనున్నారు. వివరాలు.. రాష్ట్రంలో ఎండలు మండుతున్న విషయం తెలిసిందే. కొన్నిచోట్ల సోమవారం నుంచి అకాల వర్షం పలకరిస్తున్నా, మరికొన్ని చోట్ల భానుడు తన ప్రతాపం చూపిస్తూనే ఉన్నాడు. ఇక చైన్నె వంటి నగరాలలో భానుడు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాడు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ద్విచక్ర వాహనదారుల పరిస్థితి మరీ దారుణంగా ఉంటోంది. కొన్ని కూడళ్లల్లో ట్రాఫిక్ కష్టాలు ఓ వైపు, ఎండదెబ్బ మరోవైపు వాహన దారులను పిప్పి చేస్తున్నాయి. రద్దీతో కూడిన సిగ్నల్స్లో వాహన దారులకు ఉపశమనం కలిగించే విధంగా కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఎర్రటి ఎండలో వాహన దారులకు కాస్త చల్లదనం కలిపించే విధంగా ఆకు పచ్చ(గ్రీన్) నెట్స్ను నాలుగు వైపులా ఏర్పాటు చేశారు. ఇది వాహనదారులకు చల్లదనాన్ని నింపే విదంగా ఉండడంతో కోయంబత్తూరు, తిరుప్పూర్లలో కొన్ని చోట్ల ఈ గ్రీన్స్ ఏర్పాటు వేగవంతమైంది. అదే సమయంలో చైన్నె నగరంలో ట్రాఫిక్ అధికంగా ఉండే కూడళ్లల్లో గ్రీన్నెట్స్ ఏర్పాటుకు అధికారులు సిద్ధమయ్యారు. తొలి విడతగా కార్పొరేషన్ భనం రిప్పన్ బిల్డింగ్, రాజా ముత్తయ్య సాలై, ఈవేరా పెరియార్ కూడలి, తిరుమంగలం జంక్షన్, కీల్పాకం కూడలి, వళ్లువర్కోట్టం రహదారి, చేట్ పట్జంక్షన్, అడయార్ కూడలి, తిరువాన్మీయూరు – మహాబలిపురం కూడలి తదితర పదిచోట్ల ఈ గ్రీన్ నెట్స్ ఏర్పాటు పనులపై దృష్టి పెట్టారు.
తొలిదశలో చైన్నెలో
పది చోట్ల ఏర్పాటుకు చర్యలు